
- వారిని ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నం: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
- సీఎం రేవంత్పై కేటీఆర్విచిల్లర ఆరోపణలు
- సహాయక చర్యల్లో పాల్గొంటున్న టీమ్స్ ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీయొద్దని సూచన
నాగర్కర్నూల్/అమ్రాబాద్, వెలుగు: ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నదని, టన్నెల్లో చిక్కుకున్నవారిని ఎలాగైనా బయటకు తెస్తామనే నమ్మకం ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ‘‘లోపల ఉన్న ప్రాజెక్ట్ మేనేజర్ ఫోన్ రింగ్ అయ్యింది. అక్కడ బీఎస్ఎన్ఎల్ నెట్ వర్క్ అందుబాటులో ఉంది. ఘటన జరిగిన రోజు ఆయన తన భార్యతో మాట్లాడినట్టు తెలిసింది. మేం ఆయన ఫోన్కు కాల్ చేయగా మొదట రింగ్ అయ్యి, తర్వాత స్విచ్ఛాఫ్ అయ్యింది. సైబర్ సెక్యూరిటీ సహకారంతో ఫోన్ ట్రేస్ చేస్తున్నాం’’ అని తెలిపారు. సోమవారం టన్నెల్ వద్ద జయ్ ప్రకాశ్ సంస్థ క్యాంప్ కార్యాలయంలో రాబిన్ కంపెనీ ప్రతినిధి గ్రేస్, ఎల్ అండ్ టీ కంపెనీ ప్రతినిధి, టన్నెల్ వర్క్స్ ఎక్స్ పర్ట్ ఇంజినీర్ క్రిస్ కూపర్ తో కలిసి మంత్రి వెంకట్రెడ్డి రివ్యూ నిర్వహించారు. ఇందులో డిజాస్టర్ మేనేజ్ మెంట్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, ఇండియన్ ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధులు, జయ్ ప్రకాశ్ సంస్థ ప్రతినిధులు, ఇరిగేషన్ సీఈ అజయ్ కుమార్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుకున్న 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని తెలిపారు.
కేటీఆర్ విమర్శలు సరికాదు..
టన్నెల్లో జరుగుతున్న సహాయక చర్యలపై, సీఎం రేవంత్పై కేటీఆర్ చిల్లర ఆరోపణలు చేస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి అన్నారు. ఘటనాస్థలికి సీఎం రాలేదంటూ ఎక్స్ వేదికగా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. సహాయక చర్యల్లో పాల్గొంటున్న టీమ్ల ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసేలా కేటీఆర్ వ్యాఖ్యలున్నాయని తెలిపారు. సీఎం రేవంత్ టన్నెల్ వద్దకు వస్తే సెక్యూరిటీ సమస్యలు తలెత్తడంతోపాటు రెస్క్యూ ఆపరేషన్కు ఇబ్బంది కలుగుతుందని, అందుకే తమ మంత్రులు, ఎమ్మెల్యేల బృందం సహాయక చర్యలను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాయని చెప్పారు. సహాయక చర్యలపై సీఎం రేవంత్ ప్రతి గంటకోసారి ఆరా తీస్తున్నారని, తమకు సలహాలు, సూచనలు అందజేస్తున్నారని తెలిపారు. ‘‘ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలతో మాకు పనిలేదు. మా దృష్టంతా టన్నెల్లోపల ఉన్నవారికి కాపాడడం మీదే ఉంది. ఏ చిన్న అవకాశం ఉన్నా వారిని కాపాడుకుంటాం. ప్రస్తుతం ఎంతో టెక్నాలజీ అందుబాటులో ఉంది.. అందువల్ల లోపల ఉన్నవాళ్లందరినీ క్షేమంగా బయటకు తెస్తామనే ఆశ ఉంది’’ అని వ్యాఖ్యానించారు.
లోపలి నుంచి నీరు, బురద ఎక్కువగా రావడం వల్ల సహాయక చర్యలకు ఆటంకం కలుగుతున్నదని, అయినప్పటికీ లోపల ఉన్నవారిని చేరుకునేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని చెప్పారు. లోపలికి వెళ్లే టీమ్స్కు అవసరమైన అన్ని వసతులు సమకూరుస్తున్నామని మంత్రి చెప్పారు. 100 హెచ్ పీ మోటర్లతో లోపలి నుంచి నీటిని తోడుతున్నామని, మంగళవారం ఉదయంలోపు వాటర్ తొలగించి, కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టిని కూడా తొలగించే ప్రయత్నాలు చేస్తామని చెప్పారు. అపోలో హాస్పిటల్కు చెందిన వెంటిలేషన్ అంబులెన్సులు కూడా బయట అందుబాటులో ఉంచామని తెలిపారు. ఇలాంటి సంఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నానని అన్నారు.