
వనపర్తి, వెలుగు : ఎస్ఎల్బీసీ రెస్క్యూ పనులు 48 గంటల్లో కొలిక్కి వస్తాయని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పారు. వనపర్తిలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో గురువారం మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలో ఏదైనా ఘటన జరిగితే అక్కడికి ప్రతిపక్షాలను రానిచ్చేది కాదని గుర్తు చేశారు. పదేండ్లు అధికారంలో ఉండి 9 కిలోమీటర్ల పనులను ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు.
ఎన్ని అవాంతరాలు ఎదురైనా సంవత్సరంలో పనులు పూర్తి చేసి మూడు లక్షల ఎకరాలకు సాగు నీరు ఇస్తామని స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీని అడ్డు పెట్టుకొని బీఆర్ఎస్ శవరాజకీయం చేస్తోందని మండిపడ్డారు. గతంలో కొండగట్టు, పాలమూరు- రంగారెడ్డి, శ్రీశైలం పవర్హౌస్లో ప్రమాదాలు జరిగినప్పుడు అప్పటి సీఎం కేసీఆర్ వచ్చారా ? అని ప్రశ్నించారు. సమావేశంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఉన్నారు.