
- ఘటనా స్థలంలో 200 మీటర్ల పొడవుతో15 ఫీట్ల ఎత్తు వరకు సిల్ట్: మంత్రి ఉత్తమ్
- టన్నెల్ బోరింగ్ మిషన్ అడ్డుగా కూరుకుపోయింది
- రెస్క్యూ టీమ్స్కు రిస్క్ ఉండడం వల్లే సహాయచర్యలు లేట్
- గ్యాస్, ప్లాస్మా కట్టర్లతో టీబీఎం శిథిలాలనూ తొలగిస్తున్నం
- స్పీడ్గా డీ వాటరింగ్.. 2 రోజుల్లో బురద తొలగింపు పూర్తి
నాగర్ కర్నూల్, వెలుగు: ఎస్ఎల్ బీసీ టన్నెల్లో చిక్కుకున్నవారిని కాపాడేందుకు చేపట్టిన ఆపరేషన్ మరో రెండు రోజుల్లో పూర్తవుతుందని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పేర్కొన్నారు. ఘటనా స్థలంలో 200 మీటర్ల పొడవుతో15 ఫీట్ల ఎత్తు వరకు సిల్ట్ఉన్నదని, అడ్డుగా టన్నెల్బోరింగ్ మిషన్ (టీబీఎం) కూరుకుపోయిందని చెప్పారు.
సీపేజ్భారీగా వస్తుండడం, పెచ్చులు ఊడిపడ్తుండడంతో రెస్క్యూ టీమ్లకు రిస్క్ ఉందని ఎక్స్పర్ట్స్ హెచ్చరించడంతో సోమవారం సహాయ చర్యలు స్లో చేశామని, మంగళవారం నుంచి ‘లో రిస్క్ రెస్క్యూ’ ఆపరేషన్ ప్రారంభించామని వెల్లడించారు. బుధవారం రెస్క్యూ ఆపరేషన్ ను పర్యవేక్షిస్తున్న అధికారులతో ఉత్తమ్కుమార్రెడ్డి రివ్యూ నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. డీ వాటరింగ్ స్పీడప్చేశామని, 2 రోజుల్లో బురద తొలగింపు పనులు పూర్తిచేస్తామని చెప్పారు.
ఇప్పటికే గ్యాస్, ప్లాస్మా కట్టర్లతో టీబీఎం శిథిలాలనూ తొలగిస్తున్నామని తెలిపారు. ‘‘లోపల చిక్కుకున్న 8 మందిపై పూర్తిగా ఆశలు వదులుకోలేదు. వారంతా బతికే ఉన్నారనే ఆశతో పనిచేస్తున్నాం. 2 రోజుల్లో ఆపరేషన్ ముగిస్తాం. లోపలికి వెళ్లివచ్చిన ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్, ర్యాట్హోల్మైనర్స్ ఇచ్చిన సమాచారంతో ఈ నిర్ణయానికి వచ్చాం’’ అని వెల్లడించారు.
యాక్షన్ ప్లాన్ రెడీ..
టన్నెల్ లో సంఘటనా స్థలం దగ్గరిదాకా వెళ్లి వచ్చిన ఆర్మీ, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ ప్రతినిధులు, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్, జేపీ అసోసియేట్స్, రాబిన్స్ ప్రతినిధులు, ర్యాట్హోల్మైనర్స్తో మాట్లాడిన తర్వాత లోపలి పరిస్థితిపై బుధవారం ఒక అంచనాకు వచ్చామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ఇందులో భాగంగానే ‘రెస్క్యూ, రిలీఫ్ యాక్షన్ ప్లాన్’ రెడీ చేశామని వెల్లడించారు.
రెస్క్యూ టీమ్స్కు తక్కువ రిస్క్ ఉండేలా చూసుకుంటూ రాబోయే2 రోజుల్లో ఆపరేషన్ కంప్లీట్ చేస్తామని చెప్పారు. టన్నెల్లో నుంచి సిల్ట్ తొలగించడంతోపాటు ధ్వంసమైన టీబీఎం విడిభాగాలను గ్యాస్, ప్లాస్మా కట్టర్తో కట్ చేసి.. బయటకు తెస్తామని తెలిపారు. బుధవారం సాయంత్రం నుంచే శిథిలాల తొలగింపు మొదలైందని చెప్పారు. ఈ ఆపరేషన్ కోసం దేశంలో వివిధ టన్నెల్స్కోసం పనిచేసిన ఎక్స్పర్ట్స్ను, టన్నెల్ ప్రమాదాల్లో జరిగిన రెస్క్యూ ఆపరేషన్లలో పాల్గొన్న వారిని పిలిపించినట్టు చెప్పారు.
వీరంతా ప్రస్తుత రెస్క్యూ ఆపరేషన్లో తమ సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఘటన జరిగిన 3 గంటల నుంచి మంత్రులంతా ఇక్కడే ఉండి రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నామని గుర్తుచేశారు. రాత్రి, పగలు తేడా లేకుండా సహాయక చర్యలను కో ఆర్డినేట్చేస్తున్న నాగర్ కర్నూల్ కలెక్టర్ బీ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ను మంత్రి ఉత్తమ్ ప్రశంసించారు. అందరి శ్రమ ఫలించి లోపల చిక్కుకున్నవారు క్షేమంగా బయట పడాలని ఆకాంక్షించారు.
మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..జడ్చర్ల ఎమ్మెల్యేతో కలిసి శివరాత్రి సందర్భంగా శ్రీశైలంలో భ్రమరాంబిక మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఎస్ఎల్ బీసీ టన్నెల్ నుంచి సిబ్బంది క్షేమంగా బయటపడాలని మల్లన్నను వేడుకున్నట్టు ఆయన తెలిపారు. ఇక్కడ ఎంపీ మల్లు రవి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి తదితరులున్నారు.