
- డీ1, డీ2 ప్లేస్లో మట్టి, రాళ్లు తవ్వుతున్న ర్యాట్ హోల్ మైనర్స్
- ఇంకా పనిలోకి దిగని రోబో
- టన్నెల్ వద్దకు మానవ హక్కుల సంఘం నేతలు
ఎస్ఎల్బీసీ టన్నెల్ నుంచి వెలుగు టీం : ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగిన చోట రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ర్యాట్ హోల్ మైనర్లు, సౌత్ సెంట్రల్ రైల్వే కట్టర్లు రెండు షిఫ్టుల్లో పనిచేశారు. బుధవారం టన్నెల్లోకి వెళ్లిన రోబో ఆపరేషన్ ఇంకా స్టార్ట్ కాలేదని సమాచారం. 12వ కిలోమీటర్ వరకు ఉన్న లోకో ట్రాక్ను 13వ కిలోమీటర్ వరకు పొడిగించారు. ఆ తర్వాత అడ్డంగా పడిపోయిన టీబీఎం విడిభాగాలు, మట్టి, బురద అడ్డంకిగా మారుతోంది. టన్నెల్లోని డీ1, డీ2 ప్రదేశాల్లో సింగరేణి కార్మికులు, ర్యాట్ హోల్ మైనర్లు మట్టిని తవ్వుతున్నారు.
టన్నెల్లో 400 మీటర్ల వరకు కొట్టుకొచ్చిన విడిభాగాలు, పైపులు, ఇతర ఇనుప వస్తువులను తొలిగించడం సవాల్గా మారుతోంది. టీబీఎం ఫ్లాట్ఫాంను కట్ చేసి విడి భాగాలను లోకో ట్రైన్లో బయటికి తరలిస్తున్నారు. మరోవైపు స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్కుమార్, కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ రెస్క్యూ టీమ్స్తో రివ్యూ నిర్వహించారు. డీ1, డీ2 మధ్యలో ఉన్న మట్టి, ఇతర విడిభాగాలను పూర్తిగా తొలగించేందుకు నాలుగైదు రోజులు పడుతుందని ర్యాట్ హోల్ మైనర్స్ టీం మెంబర్ మహ్మద్ ఇర్ఫాన్
వివరించారు.
టన్నెల్ను సందర్శించిన ప్రజాసంఘాల నేతలు
ప్రమాదం జరిగిన ఎస్ఎల్బీసీ టన్నెల్ను బుధవారం పౌర హక్కుల సంఘం, ప్రజాసంఘాల నేతలు సందర్శించారు. ఘటనపై స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు రూ. 2 కోట్ల ఎక్స్గ్రేషియా చెల్లించాలని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్ కోరారు. పర్యవేక్షణాలోపమే ప్రమాదానికి కారణమని, ప్రభుత్వ నిర్లక్ష్యం కూడా ఉందని
ఆరోపించారు.