ఎస్​ఎల్​బీసీలో సహాయక చర్యలు స్పీడప్

ఎస్​ఎల్​బీసీలో సహాయక చర్యలు స్పీడప్

ఎస్ఎల్​బీసీ నుంచి వెలుగు టీం:ఎస్ఎల్​బీసీ టన్నెల్​లో సహాయక చర్యలు ఊపందుకున్నాయి. ఆదివారం ఎరక్టర్​ ఆపరేటర్​గురుప్రీత్​ సింగ్​ డెడ్​బాడీని వెలికితీసిన రెస్క్యూ బృందాలు, మిగిలిన వారి ఆచూకీ కోసం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. సౌత్​ సెంట్రల్​ ర్వైల్వే బృందం సభ్యులు మూడు షిప్టుల్లో గ్యాస్, థర్మల్, ప్లాస్మా మెషీన్లతో టీబీఎం వెనక భాగాన్ని కట్​ చేస్తున్నారు. కట్​చేసిన విడిభాగాలను లోకో ట్రైన్​ ద్వారా బయటకి తరలిస్తున్నారు. పేరుకుపోయిన మట్టి, బురద, రాళ్లను కన్వేయర్​ బెల్ట్​ ద్వారా పంపుతున్నారు.

 టన్నెల్​లో నీటిని తోడి వేసేందుకు ప్రతి రెండు కిలోమీటర్లకు డీవాటరింగ్​ డ్రైన్లు ఏర్పాటు చేశారు. 13.500 కిమీల వద్ద ఒక అడుగు ఎత్తులో నీటి ఊట వస్తోంది. ఈ నీటిని తరలించేందుకు మూడు 3హెచ్​పీ, ఒక 5 హెచ్ పీ, ఒక 7 హెచ్​పీ మోటార్లను 24 గంటలు నడిపిస్తున్నారు. నిమిషానికి 300 గ్యాలన్ల నీటి ఊట వస్తున్నట్లు అంచనా వేశారు. టన్నెల్​ లోపల ఒక నిమిషం మోటర్లు ఆగినా నీటి ప్రవాహం పెరుగుతోందని సింగరేణి రెస్క్యూ టీం ద్వారా తెలిసింది. 

మూడవ రోజు టన్నెల్​లోకి వెళ్లిన క్యాడవర్​ డాగ్​ స్క్వాడ్​ మాయ, మర్ఫీలు టీబీఎం పరిసరాల్లోనే తిరుగాడాయి. టన్నెల్​ వెనక భాగం, నీటి గుంటలో వాసన చూశాయి. టన్నెల్​లో మట్టి కూలి పడే ప్రమాదం లేకుండా దుంగలను అడ్డంగా పేర్చుతున్నారు. సింగరేణి నుంచి తెప్పించిన అడ్వాన్స్  హైడ్రాలిక్​ ఎక్విప్​మెంట్​ను ఉపయోగిస్తున్నారు. సింగరేణి రెస్క్యూ టీం జీఎం బైద్య టీబీఎం పక్కన తవ్వకాలను పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన చోట ర్యాట్​ హోల్​ మైనర్లతో తవ్విస్తున్నారు. 60 మంది గంట సేపు కష్టపడినా రెండు నుంచి మూడు అడుగుల కంటే ఎక్కువ మట్టిని తవ్వలేని పరిస్థితి. సౌత్​ సెంట్రల్​ రైల్వే ఇంజనీర్ల టీం నీటిలో కూడా మెషీన్లను కట్​చేయగలిగే థర్మల్​ కట్టర్లను వినియోగిస్తున్నారు.   

డి2 ప్రదేశం చాలా రిస్క్..

టీబీఎం  పక్కన 8 మీటర్ల మట్టి కింద నలుగురు చిక్కుకుని ఉంటారని ఎన్జీఆర్ఐ జీపీఆర్  స్కానర్లు, కేరళ క్యాడవర్​ డాగ్స్​ గుర్తించిన డి2 ప్రదేశం హై రిస్క్​ ఏరియాగా పేర్కొంటున్నారు. టీబీఎం ఏసీ క్యాబిన్​ను కట్​ చేసి ఇక్కడి నుంచే గురుప్రీత్​సింగ్​ డెడ్​బాడీని బయటకుతీశారు. మరో ముగ్గురు ఈ ప్రాంతంలోనే కూరుకుపోయి ఉంటారని భావించి తవ్వకాలు జరుపుతున్నారు. అక్కడికి సింగరేణి, ర్యాట్​ హోల్​ మైనర్లను మినహా ఇతరులను అనుమతించడం లేదు. డి1 పాయింట్​ వద్ద రెండు ప్రదేశాల్లో మరో నలుగురు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నా, ఆ ఏరియా టీబీఎం కింద చూపిస్తోంది. ఇదిలాఉంటే రోబోటిక్​ సంస్థ ప్రతినిధులు మంగళవారం ఎస్ఎల్​బీసీకి చేరుకుంటారని సమాచారం.