
- అమెరికా నుంచి టీబీఎం బేరింగ్ తెప్పించిన ప్రభుత్వం
- బిగించేందుకు 2 నెలల టైమ్.. జులైలో పనులు ప్రారంభం
- ఇన్లెట్ వద్ద ప్రమాదం జరగడంతో నిలిచిన పనులు
- ఇంకా తవ్వాల్సింది 9.56 కిలోమీటర్లు
నల్గొండ, వెలుగు:ఎస్ఎల్బీసీ పనులను తిరిగి ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇటీవల జరిగిన ప్రమాదంతో టన్నెల్ ఇన్లెట్ వైపు నుంచి పనులు నిలిచిపోవడంతో అవుట్లెట్ వైపు నుంచి తవ్వకాలు చేపట్టాలని నిర్ణయించింది. అయితే, గతంలో అటువైపు నుంచి కొంతమేర తవ్వగా టన్నెల్ బోరింగ్ మెషిన్ (టీబీఎం) పాడైపోవడంతో దాదాపు రెండేండ్లుగా పనులు నిలిచిపోయాయి. ఆ మెషిన్కు రిపేర్లు చేయాలని భావించిన ప్రభుత్వం.. టీబీఎం బేరింగ్ను తెప్పించింది.
అది శుక్రవారం మన్నెవారిపల్లిలోని అవుట్లెట్ వద్దకు చేరుకుంది. అమెరికాకు చెందిన కంపెనీ ఈ బేరింగ్ను తయారు చేసింది. దాన్ని జనవరిలో అమెరికా నుంచి నౌకలో తరలించగా.. 20 రోజుల కింద చెన్నై పోర్టుకు చేరింది. దాన్ని ఈ నెల 9న చెన్నై పోర్టు నుంచి భారీ వాహనంలోకి ఎక్కించి పంపించగా, శుక్రవారం ఇక్కడికి చేరింది. దీన్ని టీబీఎంకు బిగించడానికి రెండు నెలల సమయం పట్టనుంది. ఇంకొన్ని విడిభాగాలు కూడా తెప్పించాల్సి ఉంది. ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా ముందుకుసాగితే జులైలో పనులు మళ్లీ మొదలయ్యే అవకాశం ఉంది.
తరచూ బేరింగ్ రిపేర్..
ఇన్లెట్ ఉన్న దోమలపెంట నుంచి అవుట్లెట్ ఉన్న మన్నెవారిపల్లి వరకు మొత్తం 43.930 కిలోమీటర్ల పొడవునా సొరంగం తవ్వాల్సి ఉండగా, రెండువైపుల నుంచి పనులు చేపట్టారు. రెండువైపులా కలిపి 34.37 కిలోమీటర్ల మేర టన్నెల్ తవ్వకం పూర్తికాగా, ఇంకా 9.56 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ఇందులో అవుట్లెట్ వైపు నుంచి ఇప్పటివరకు 20.435 కిలోమీటర్ల పొడవునా సొరంగం పూర్తయింది. మరో 3.545 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది.
అయితే ఇక్కడ రాయి గట్టిదనం ఎక్కువగా ఉన్నందున తరచూ బేరింగ్, ఇతర పరికరాలు పాడైపోతున్నాయి. ఇప్పటికి మూడుసార్లు బేరింగ్ పాడైపోయింది. దీంతో 2023 జనవరిలో పనులు పూర్తిగా ఆగిపోయాయి. మరోవైపు ఇన్లెట్ వైపు నుంచి 13.935 కిలోమీటర్లు సొరంగం పూర్తయింది. 2019లో వరదల కారణంగా భారీగా సీపేజీ రావడంతో అప్పటి నుంచి పనులు ఆగిపోయాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 21న పనులు తిరిగి ప్రారంభించారు.
150 మీటర్లు తవ్వగానే గత నెల 22న టన్నెల్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందగా, ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో అవుట్లెట్ వైపు నుంచి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీలైనంత మేర ఇటు వైపు నుంచే తవ్వాలని ఇంజనీర్లు ప్లాన్ చేస్తున్నారు.