
స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ – డీ2 (ఎస్ ఎస్ఎల్వీ–డి2) ప్రయోగాన్ని ఇస్రో షార్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఇండియా విజయవంతంగా పరీక్షించింది. ఎస్ఎస్ఎల్వీ–డి2 రాకెట్ ద్వారా ఇస్రోకు చెందిన 156.3 కిలోల బరువు గల ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్–07, అమెరికా అంటారిస్ సంస్థకు చెందిన 11.5 కిలోల జానుస్–1, చెన్నై స్పేస్కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలల బాలికలు రూపొందించిన 8.7 కిలోల ఆజాదీశాట్–2లను భూమికి 450 కి.మీ. ఎత్తులోని కక్ష్యలో ప్రవేశ పెట్టారు. అతి తక్కువ ఖర్చు, ఐదు రోజుల వ్యవధిలో రాకెట్ను రూపొందించి అంతరిక్షంలోకి ఉపగ్రహాలను విజయవంతంగా పంపిన దేశంగా భారత్ తన పేరును నమోదు చేసుకుంది.
ఉపగ్రహాల వివరాలు
ఈఓఎస్-07: ఇది 156.3 కిలోల బరువున్న ఉపగ్రహం. ఇస్రో ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంది. ఈ మిషన్ లక్ష్యం మైక్రోశాటిలైట్ బస్, కొత్త సాంకేతికతలకు అనుకూలమైన పేలోడ్ సాధనాలను రూపొందించడం, అభివృద్ధి చేయడం. ఈ ఉపగ్రహం ద్వారా భూమిపైన, సముద్రాల్లోని వాతావరణ మార్పులను గుర్తించవచ్చు.
జానుస్-1: బరువు 10.2కిలోలు. అంటారిస్ సాఫ్ట్వేర్ ప్లాట్ఫారం ఆధారంగా స్మార్ట్ శాటిలైట్ మిషన్. జానుస్–1 ఉపగ్రహం ఐఓటీ, కమ్యూనికేషన్ సిస్టమ్స్తో సహా ఐదు పేలోడ్లను తీసుకెళ్లింది.
ఆజాదీశాట్-2: బరువు 8.7 కిలోలు. ఇది దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలకు చెందిన 750 మంది బాలికల సంయుక్త ప్రయత్నం. దీనిని చెన్నైలోని స్పేస్ కిడ్జ్ ఇండియా ఆధ్వర్యంలో తయారు చేశారు.
ఎస్ఎస్ఎల్వీ-డి2 రాకెట్
ఈ రాకెట్ బరువు 120 టన్నులు. దీని వ్యాసం 2 మీటర్లు కాగా, పొడవు 34 మీటర్లు. దాదాపు 500 కిలోల బరువు గల ఉపగ్రహాలను ఈ వాహకనౌక అంతరిక్షంలోకి మోసుకెళ్లగలదు. దీన్ని నాలుగు దశల్లో ప్రయోగించారు.