
మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ వేదిక కానున్న సంగతి తెలిసిందే. మే 7 నుంచి 31 వరకు జరగనున్న ఈ వేడుకలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలో మిస్ వరల్డ్ పోటీల స్వాగత ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించిన తెలంగాణ టూరిజం సెక్రటరీ స్మిత సభర్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ టూరిజం బ్రాండ్ పెరిగేలా, తెలంగాణ అతిథ్యానికి వన్నె తెచ్చేలా మిస్ వరల్డ్ పోటీలు ఉండాలని అన్నారు స్మిత సభర్వాల్. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో జరుగనున్న ఈ పోటీలలో 120 దేశాలకు చెందిన మోడల్స్ పాల్గొంటారు.
మే 6, 7న మోడల్స్ హైదరాబాద్ చేరుకోనున్నారని... దీంతో వారి రాక సందర్భంగా చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్, చౌమొహల్లా ప్యాలెస్ లో వెల్కమ్ డిన్నర్ ఉంటుందని తెలుస్తోంది. వీటి ఏర్పాట్ల కోసం టూరిజం, జీహెచ్ఎంసీ, హెరిటేజ్, పోలీస్ ఆఫీసర్లతో ప్యాలెస్ లో క్షేత్రస్థాయిలో పర్యటించారు స్మిత సభర్వాల్.
వెల్కమ్ డిన్నర్ లో తెలంగాణ టూరిజం బ్రాండ్ ఇమేజ్ అనుగుణంగా ఏర్పాట్లను చేయాలని అధికారులకు సూచించారు స్మిత. 120 మంది మోడల్స్ తో పాటు సుమారు 400 మంది ప్రతినిధులు, ఫోటోగ్రాఫర్లు, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు పాల్గొంటారని.. ఈవెంట్ ప్రారంభం నుంచి చివరి వరకు పర్యాటక ప్రత్యేకతలు చాటేలా కార్యక్రమాలు రూపొందించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు స్మిత సభర్వాల్.
Also Read:-మంచు మనోజ్ ఇంట్లో.. పార్క్ చేసిన కారు మాయం.. ఎక్కడ దొరికిందంటే..
ప్యాలెస్ లో ఫోటోషూట్ కోసం సీటింగ్ ఏర్పాట్లు, లైవ్ మ్యూజిక్ కాంటెస్ట్, సూఫీ మ్యూజిక్, కవ్వాలీ సంగీత ప్రదర్శన, తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా 20 నిమిషాలు పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేలా కార్యక్రమాన్ని రూపొందించాలని అన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల అనంతరం వెల్కం డిన్నర్ ఉంటుందని... నిజాం వంటకాలు, తెలంగాణ రుచులు మెన్యూలో ఉంటాయని అన్నారు స్మిత సభర్వాల్.