డిప్రెషన్​తో సాఫ్ట్ వేర్​ ఉద్యోగి ఆత్మహత్య

డిప్రెషన్​తో సాఫ్ట్ వేర్​ ఉద్యోగి ఆత్మహత్య
  • అపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ 9వ ఫ్లోర్‌‌‌‌ నుంచి దూకిన మహిళ
  • ఘటనకు ముందు సూసైడ్​ నోట్‌‌‌‌

మియాపూర్, వెలుగు : అపార్ట్మెంట్ బిల్డింగ్ నుంచి దూకి సాఫ్ట్ వేర్​ఉద్యోగిని సూసైడ్​చేసింది. మియాపూర్ మయూరినగర్​కు చెందిన నెహ్రూ, సాయి సింధూర (29) దంపతులు. ఐటీ ఉద్యోగులుగా పనిచేస్తున్న వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. అనారోగ్య సమస్యలకు తోడు సింధూర తల్లి ఐదు నెలల కిందట మృతి చెందడంతో కొద్దిరోజులుగా ఆమె డిప్రెషన్​లోకి వెళ్లింది. 

ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం తాను ఉంటున్న దివ్య శ్రీశక్తి అపార్ట్మెంట్ 9వ ఫ్లోర్​ నుంచి కిందకు దూకి మృతి చెందింది. సంఘటనా స్థలానికి చేరుకున్న మియాపూర్​పోలీసులు డెడ్​బాడీని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సింధూర తండ్రి సూర్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మా నాన్నే నా హీరో..

మృతి చెందడానికి ముందు సింధూర రాసిన సూసైడ్​ నోట్​ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘‘మా నాన్నే నా హీరో, అనారోగ్య సమస్యల కారణంగా నా లైఫ్​ డిప్రెషన్​లో ఉంది. భర్తతో చిన్న చిన్న గొడవలు జరుగుతున్నాయి’’ అనే విషయాలను సూసైడ్​ నోట్​లో సింధూర రాసినట్లు పోలీసుల ద్వారా తెలిసింది.