
గచ్చిబౌలి, వెలుగు: ప్రేమించి పెండ్లి చేసుకున్న ఆరు నెలల్లోనే నవ వధువు ఉరేసుకొని మృతి చెందింది. వికారాబాద్ జిల్లా తోర్ మామిడికి చెందిన కమలాపురం దేవిక (25) పూణెలో ఎంబీఏ పూర్తి చేసి, హైదరాబాద్ లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుంది.
మంచిర్యాలకు చెందిన సద్గుర్తి సతీశ్ చంద్ర ఐఐటి ఖరగ్పూర్ లో ఇంజినీరింగ్ పూర్తి చేసి, ఆమెతో కలిసి అదే సంస్థలో పనిచేస్తున్నాడు. వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో.. ఇరువైపుల పెద్దలను ఒప్పించి గతేడాది ఆగస్టు 23న గోవాలో వైభవంగా పెండ్లి చేసుకున్నారు.
ఆ తర్వాత రాయదుర్గం పరిధిలోని ప్రశాంతిహిల్స్ లోని ఓ అపార్ట్మెంట్లో కాపురం పెట్టారు. అయితే, పెండ్లి అయినా కొద్దిరోజులకే భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆదివారం రాత్రి 11 గంటల సమయంలో దేవిక, సతీశ్ ఇంట్లో గొడవ పడ్డారు. దీంతో మనస్తాపానికి గురైన దేవిక తన గదిలోకి వెళ్లి లోపలి నుంచి గడియ పెట్టుకుంది. సతీశ్ చంద్ర సైతం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి అర్ధరాత్రి 12 గంటల తరువాత తిరిగి వచ్చాడు.
అప్పటికీ దేవిక గది తలుపులు పెట్టి ఉండడంతో నిద్రపోయిందనుకొని, తన గదిలోకి వెళ్లి నిద్రపోయాడు. తెల్లవారుజామున లేచిన సతీశ్ మరోసారి దేవిక గది తలుపుతట్టినా స్పందించలేదు. ఉదయం పనిమనిషి వచ్చి తలుపుకొట్టినా తలుపు తీయలేదు. అయితే, ఉదయం 10 గంటలకు దేవిక ఆఫీసుకు వెళ్లాల్సి ఉండగా, అప్పటికీ తలుపు తీయలేదు.
దీంతో అనుమానం వచ్చిన సతీశ్ తలుపులు బద్దలుకొట్టి చూడగా, ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకొని కనిపించింది. స్థానికుల సమాచారంతో రాయదుర్గం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కట్నం కోసమే తన కుమార్తెను సతీష్ చంద్ర తరుచూ వేధించడంతో ఆత్మహత్య చేసుకుందని దేవిక తల్లి రామలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.