
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాకేంద్రంలోని తీన్ఖని ఏరియాలో సోమవారం కొన్ని గంటల పాటు సీసీ కెమెరాలు పనిచేయకపోవడం కలకలం రేపింది. జిల్లా కేంద్రంలోని సున్నిత ప్రాంతంలో కొన్ని గంటలపాటు సీసీ కెమెరాల స్తంభించిపోవడంతో పోలీస్ శాఖ ఉలిక్కిపడింది. దీనిపై పోలీసులు ఆరా తీయగా సీసీ కెమెరాలకు సంబంధించిన కేబుల్స్, ఇంటర్నెట్ కేబుల్స్ కట్ చేసినట్లు గుర్తించారు.
దీనికి బాధ్యులైన బల్దియా ఏఈ అనిల్, సిబ్బంది నక్క భూమరాజ్, ఖాజీపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ఇటీవల బల్దియాకు చెందిన ఓ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో దొరకగా, తాను బల్దియాలో పనిచేస్తామని చెప్పినా పోలీసులు పట్టించుకోలేదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ చర్యకు పాల్పడినట్లు విశ్వసనీయ సమాచారం. కాగా కట్ చేసిన కేబుళ్లను కరెంట్ డిపార్ట్మెంట్ అధికారులు సరిచేశారు.