కాంట్రాక్టర్​ పనులు ఆఫీసర్లే చేసేస్తున్రు 

 కాంట్రాక్టర్​ పనులు ఆఫీసర్లే చేసేస్తున్రు 
  • ఉన్నతాధికారులకు ఫిర్యాదు

వనపర్తి, వెలుగు : విద్యుత్​ శాఖలో కొందరు కింది స్థాయి ఇంజినీర్లు, లైన్​మన్, బిల్​ రికార్డర్లు కక్కుర్తి పడుతున్నారు. వనపర్తి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో విద్యుత్​ శాఖ ఆఫీసర్లు, సిబ్బంది కలిసి కాంట్రాక్టర్లు చేయాల్సిన పనులను తామే చేసి బిల్లులు తీసుకుంటున్నారు. అందుకు అగ్రిమెంట్​ చేసుకున్న కాంట్రాక్టర్లను సంతకాలు చేయాలని ఉన్నతాధికారులతో సిఫారసు  చేయిస్తున్నారు.

జిల్లాలోని కొత్తకోట సబ్​ డివిజన్​ పరిధిలో రైతులకు వ్యవసాయ కనెక్షన్లు,  బిల్డింగులకు మెటీరియల్​ సప్లై చేసేందుకు టెండర్లు పిలవగా, 16 పనులను ఇద్దరు కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. అందులో వనపర్తికి చెందిన ఒకరు 13 పనులు, మిగతా మూడు పాలెంకు చెందిన కాంట్రాక్టరు దక్కించుకున్నాడు. ఇంత వరకు బాగానే ఉన్నా. విద్యుత్తు శాఖ కొత్తకోట సబ్​ డివిజన్​ పరిధిలోని ఏఈ, లైన్​మన్​ స్థాయి ఉద్యోగులు టెండర్​ నిబంధనలకు విరుద్ధంగా వేరే వారితో మెటీరియల్​ సప్లై చేయించారు. 

అగ్రిమెంట్​ మార్చి బిల్లులు కాజేసే యత్నం..

కొత్తకోట సబ్​ డివిజన్​ పరిధిలో రైతులు, బిల్డింగులు కట్టిన వారికి కాంట్రాక్టర్​తో సంబంధం లేకుండా వేరే వ్యక్తితో మెటీరియల్​ సప్లై చేయించారు. ఇదిలాఉంటే టెండర్​ దక్కించుకున్న కాంట్రాక్టర్​ను ఇటీవల ఓ రైతు కలిసి తన పొలంలో ట్రాన్స్​ఫార్మర్​ బిగించారని.. ఇంకా కొంత మెటీరియల్​ ఇవ్వలేదని చెప్పాడు. దీంతో మెటీరియల్​ సప్లై చేసింది ఎవరని ఆరా తీయగా డిపార్టుమెంట్​ ఆఫీసర్లే చేశారని తెలిసింది.

ఆ తరువాత ఏఈ, లైన్​మన్​ సదరు కాంట్రాక్టర్​ను కలిసి రైతులు, బిల్డింగ్​ ఓనర్లకు తాము మెటీరియల్​ సరఫరా చేశామని, బిల్లుల కోసం సంతకాలు చేయాలని కోరారు. అందుకు ససేమిరా అన్న కాంట్రాక్టర్..​ తనకు అగ్రిమెంట్​ చేసిన పనులను డిపార్టుమెంట్​లోని వారే అక్రమంగా చేశారని, వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్ఈకి ఫిర్యాదు చేశాడు. 

మితిమీరుతున్న జోక్యం..

విద్యుత్​ శాఖలో ఇంజినీర్లు, లైన్​మన్​లుగా ఉంటూ కాంట్రాక్టర్లకు దక్కిన పనులను తమ బంధువులు, బిల్​ రీడింగ్​ తీసే వారి పేరిట అక్రమంగా అగ్రిమెంట్​ చేసి బిల్లులు కాజేస్తున్నారు. 16 పనులకు ట్రాన్స్​ఫార్మర్, పోల్స్, కండెన్సర్లు, కండక్టర్లు, దిమ్మెల ఏర్పాటు, వైర్లు వంటి మెటీరియల్​ను గత కొన్నాళ్లుగా కాంట్రాక్టర్లు సప్లై చేస్తున్నారు. ఇదిలాఉంటే డిపార్ట్​మెంట్​లోని కింది స్థాయి ఆఫీసర్లు కమీషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్​ అగ్రిమెంట్​ను సైతం మార్చడానికి తెగించారు.

నిబంధనల ప్రకారం ఒకసారి అగ్రిమెంట్​ జరిగాక దాన్ని మార్చడం సాధ్యం కాదు.  కానీ, సదరు కాంట్రాక్టర్​ పనులు చేయకపోవడంతో తాము వేరే వారితో పనులు చేయించామని ఉన్నతాధికారులను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కాంట్రాక్టర్​తో సంతకాలు చేసేలా చూడాలని ఒత్తిడి తెస్తున్నారు. కొత్తకోట, పెబ్బేరు సబ్​ డివిజన్​ పరిధిలో విద్యుత్​ శాఖలోని కింది స్థాయి ఆఫీసర్లు కాంట్రాక్ట్​ పనులు చేస్తున్నారని, వారి ఆగడాలకు కళ్లెం వేయాలని ఓ కాంట్రాక్టర్​ ఎస్ఈకి ఫిర్యాదు చేశాడు. 

విచారణకు ఆదేశించాం..

కాంట్రాక్టర్​ ఫిర్యాదు చేసిన మాట నిజమే. పనులు ఎవరు చేశారు? కాంట్రాక్టర్​తో సంబంధం లేకుండా వేరే వారితో చేయించాల్సిన అవసరం ఏముందనే విషయంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఈని ఆదేశించాను. ఆయన ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటాం. – రాజశేఖర్, ఎస్ఈ, వనపర్తి