
జగిత్యాల, వెలుగు: కొత్తగా బల్దియాల్లో వార్డు ఆఫీసర్లుగా చేరిన ఉద్యోగులకు ట్రెజరీలో కేటాయించాల్సిన ఎంప్లాయిమెంట్ ఐడీల పేరిట బల్దియాల్లో కొందరు వసూళ్లు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మరోవైపు ఎంప్లాయిమెంట్ ఐడీలు కేటాయించినప్పటికీ ప్రాన్(పర్మినెంట్, రిటైర్మెంట్ అకౌంట్ నంబర్) ఐడీలు అప్రూవల్ కాలేదు. దీంతో రెండు నెలలుగా జీతాలు రాక తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.
76 మంది వార్డు ఆఫీసర్ల కేటాయింపు
జగిత్యాల జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ బల్దియాల్లో రెండు నెలల కింద డిసెంబర్లో వార్డు ఆఫీసర్లుగా 76 మందిని కేటాయిస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. సుమారు 60 మందికి పైగా కేటాయించిన బల్దియాల్లో రిపోర్ట్ చేసి డ్యూటీలో జాయిన్ అయ్యారు. వీరికి రావాల్సిన జీతభత్యాల కోసం సంబంధిత డాక్యుమెంట్లు తీసుకొని ఆయా బల్దియాల్లోని ఎస్టాబ్లిష్మెంట్ డిపార్ట్మెంట్లలో ఐడీ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఈ టైంలో ఐడీల కోసం ట్రెజరీ ఆఫీసర్ల పేరు చెప్పి ఒక్కో వార్డు ఆఫీసర్ వద్ద రూ. 3 వేల నుంచి రూ. 5 వేల వరకు వసూల్ చేశారు. విషయం బయటకు పొక్కడంతో ఉన్నతాధికారుల మందలింపుతో రీఫండ్ చేసి, వాట్సప్ గ్రూప్ లో చెక్ చేసుకోవాలని వార్డు ఆఫీసర్లకు మెసేజ్ కూడా పోస్టు చేశారు. కాగా మామూళ్లు ఇచ్చిన ఇద్దరు, ముగ్గురికి ఐడీలు, ప్రాన్ నంబర్లు అప్రూవ్ కాగా, మిగిలిన వారికి అప్రూవ్ కాలేదు. దీంతో మిగతావారు వచ్చే మార్చి నెలలో కూడా జీతాలు వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు.