డౌన్​పేమెంట్​ తీసుకొని కారు ఇస్తున్న ట్రావెల్స్​ కంపెనీలు

డౌన్​పేమెంట్​ తీసుకొని కారు ఇస్తున్న ట్రావెల్స్​ కంపెనీలు
  • ఐటీ కంపెనీల్లో తిప్పుకునేలా అవకాశాలు
  • నెల కిస్తీ పోనూ మిగిలిన మొత్తం డ్రైవర్లకే..  
  • కిస్తీలన్నీ అయిపోయాక కారు సొంతం


హైదరాబాద్, వెలుగు:సిటీలోని కొన్ని ట్రావెల్స్​కంపెనీలు ‘ఓనర్ కమ్​డ్రైవర్’ పేరుతో సెకండ్ హ్యాండ్​కార్లను అందిస్తున్నాయి. కారు మోడల్​ను బట్టి రూ.50 వేలు, రూ.లక్ష డౌన్​పేమెంట్​తీసుకుని అప్పగిస్తున్నాయి. ఐటీ కంపెనీల్లో తిప్పుకునే అవకాశం కల్పిస్తున్నాయి. నెలనెలా కిస్తీ కింద కొంత అమౌంట్​తీసుకుని మిగిలిన మొత్తాన్ని డ్రైవర్లేకే ఇస్తున్నాయి. దీంతో చాలా మందికి ఉపాధి దొరుకుతోంది. పనితోపాటు మంచి ఆదాయం వస్తోందని డ్రైవర్లు చెబుతున్నారు. కిస్తీలన్నీ పూర్తయ్యాక ట్రావెల్స్​కంపెనీలు ఆ కార్లను డ్రైవర్లకు ఇచ్చేస్తున్నాయి. గతంలో ఈ తరహాలో ఎయిర్ పోర్టు నుంచి తిప్పుకునేలా క్యాబ్​లు అందించేవారు.  అయితే ఇప్పుడు లాంగ్ టర్మ్​లేకుండా 18 నెలల నుంచి రెండేళ్లలోపే కార్లు డ్రైవర్ల సొంతం అయ్యేలా ట్రావెల్స్​కంపెనీలు అవకాశం కల్పిస్తున్నాయి. 2018 మోడల్ అయితే రూ.50 వేలు, 2019–20 మోడల్స్ అయితే రూ.లక్ష డౌన్ పేమెంట్ తీసుకుంటున్నాయి. ఇలా సిటీలోని సాఫ్ట్ కంపెనీల్లో వేలాది కార్లు నడుస్తున్నాయి. ఆదాయం మంచిగా ఉండడంతో చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. నెలా నెలా కిస్తీ పోను రూ.30 వేల వరకు సంపాదిస్తున్నామని చెబుతున్నారు. పైగా వారానికి 5 రోజులు మాత్రమే ఐటీ కంపెనీల్లో డ్యూటీ ఉంటుంది. మిగిలిన రెండ్రోజులు డ్రైవర్లు బయట తిప్పుకోవచ్చు.

ఎంతో మందికి ఉపయోగం

కరోనా టైంలో ఈఎంఐలు కట్టలేకపోవడంతో ఫైనాన్స్ కంపెనీలు కార్లను లాగేసుకుని వేలం వేశాయి. దాదాపు 50 వేలకు పైగా కార్లను వేలం వేయగా చాలా ట్రావెల్స్​కంపెనీలు వాటిని కొనుగోలు చేశాయి. అయితే కొన్న వాటిలో కొన్నింటిని మాత్రమే ట్రావెల్స్​కంపెనీల నిర్వాహకులు వినియోగించారు. చాలా కార్లను రెండేళ్లపాటు ఎట్టికి పడేశారు. ఒక్కొక్కటిగా సాఫ్ట్​వేర్ కంపెనీలు తెరుచుకోవడంతో కార్లకు డిమాండ్​పెరిగింది. పైగా చాలా ఫైనాన్స్ కంపెనీలు కొత్త క్యాబ్​లకు లోన్లు ఇవ్వడం లేదు. దీంతో ట్రావెల్స్​కంపెనీలకు కలిసొచ్చింది. తమను సంప్రదించిన వారికి ఓనర్ కమ్ డ్రైవర్​పేరుతో కార్ల అందిస్తున్నాయి. అయితే క్యాబ్ లను ట్రావెల్స్​కంపెనీల పేర్లపైనే ఉంచి, కిస్తీలు అయిపోయిన తరువాత కార్లను సొంతం చేస్తామని ముందే ఒప్పంద పత్రాన్ని రాసుకుంటున్నాయి. అయితే కిస్తీలు పూర్తయ్యాక మళ్లీ ఏదైనా కండిషన్స్ ​
పెడతాయేమో  అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ఇబ్బంది ఉండి డ్యూటీకి రాకపోతే కొన్ని కంపెనీలు పెనాల్టీ విధిస్తున్నాయి. ఇలాంటి వాటిపై డ్రైవర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.


మొన్ననే కారు తీసుకున్న..

మొన్నటి దాకా డ్రైవర్​గా పనిచేశాను. ఇటీవల రూ.50 వేలు కట్టి ఓ ట్రావెల్స్​కంపెనీ వద్ద కారు తీసుకున్నాను. ప్రస్తుతం సాఫ్ట్​వేర్ కంపెనీలో నడుపుతున్నాను. ట్రావెల్స్​కంపెనీనే బిజినెస్ ఇస్తోంది. కిస్తీ కింద నెలకి రూ.18వేలు పోను మిగతా పైసలు నాకు ఇస్తున్నారు. ప్రస్తుతం ఆదాయం బాగానే ఉంది.  
- వాసు, క్యాబ్ డ్రైవర్, నానక్​రామ్​గూడ


ఆదాయం మంచిగనే ఉంది

కొత్త కారు కొనుక్కొని ఏదో ఒక సాఫ్ట్ వేర్ కంపెనీలో పెడదాం అనుకున్నాను. కానీ డౌన్ పేమెంట్ కి పైసలు అడ్జస్ట్ కాలేదు. రూ.50 వేలు చెల్లించి ఓ ట్రావెల్స్ కంపెనీ వద్ద సెకండ్​హ్యాండ్​కారు తీసుకున్నాను. కారుతో పాటు పని కూడా వారే ఇస్తున్నారు. వారానికి ఐదు రోజులు మాత్రమే పని. మంచి ఆదాయం వస్తుంది. 
- రాజేశ్, క్యాబ్ డ్రైవర్, హైటెక్ సిటీ

మెయింటెనెన్స్​ కంపెనీలే చూస్కోవాలి

ట్రావెల్స్​ కంపెనీలు డ్రైవర్లకు కార్లు ఇస్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్​చేసి ఇవ్వడం లేదు. కంపెనీల పేర్ల మీదనే ఉంచుకుంటున్నాయి. అలా కాకుండా డ్రైవర్ల పేర్లపై రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి. కారు మెయింటెనెన్స్ ను ట్రావెల్స్​కంపెనీలే చూసుకోవాలి. సాఫ్ట్ వేర్ కంపెనీల్లో నడుస్తున్న వెహికల్స్ తో డ్రైవర్ల కంటే ట్రావెల్స్ కంపెనీలకే ఎక్కువ ఇన్ కమ్​వస్తుంది. డీజిల్​బిల్లు మాత్రమే డ్రైవర్ల నుంచి తీసుకోవాలి. -  షేక్ సలావుద్దిన్, తెలంగాణ ఫోర్ వీలర్స్ డైవర్స్ అసోసియేషన్  ప్రెసిండెంట్