
ఏపీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం ప్రకటించింది. ఏపీ బీజేపీ మాజీ చీఫ్ సోము వీర్రాజును ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేసింది బీజేపీ. ఈ మేరకు సోమవారం (మార్చి 10) సోము వీర్రాజు పేరును బీజేపీ అధికారికంగా ప్రకటించింది. నామినేషన్ దాఖలు చేసేందుకు సోమవారమే చివరి తేదీ కావడంతో మరి కాసేపట్లో ఆయన నామినేషన్ వేయనున్నారు.
2025, మార్చి 29తో ఏపీలో ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ ఐదు స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనుండగా.. మార్చి 10 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ. ప్రస్తుత ఏపీ అసెంబ్లీ బలాబలాల ప్రకారం ఐదు స్థానాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికే దక్కనున్నాయి.
కూటమి పొత్తులో భాగంగా జనసేన, బీజేపీకి చెరో ఎమ్మెల్సీ సీటు ఇచ్చింది టీడీపీ. మిగిలిన మూడు స్థానాలకు టీడీపీ ఆదివారం (మార్చి 9) అభ్యర్థులను ప్రకటించింది. జనసేన ఇప్పటికే తమ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ఖరారు చేసింది. జనసేన చీఫ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబుకు జనసేన అవకాశం కల్పించింది.
ALSO READ | ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ.. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు నిరాశ..!
కూటమి పొత్తులో భాగంగా వచ్చిన ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ల చివరి రోజు బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది. పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజుకు ఛాన్స్ ఇచ్చింది కాషాయ పార్టీ. నామినేషన్ల దాఖలు చేసేందుకు సోమవారమే చివరి రోజు కావడంతో మూడు పార్టీల నేతలు ఇవాళ నామినేషన్లు సమర్పించనున్నారు. సంఖ్యా బలం లేకపోవడంతో పోటీకి ప్రతిపక్ష వైసీపీ పోటీకి దూరంగా ఉండటంతో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం కానుంది.