తమిళనాడులోని చెన్నైలో దారుణం.. తల్లికి చికిత్స సరిగా చేయలేదని డాక్టర్‌ను పొడిచిండు

తమిళనాడులోని చెన్నైలో దారుణం.. తల్లికి చికిత్స సరిగా చేయలేదని డాక్టర్‌ను పొడిచిండు

చెన్నై: క్యాన్సర్​తో బాధపడుతున్న తన తల్లికి ట్రీట్మెంట్ సరిగా ఇవ్వలేదన్న కోపంతో కొడుకు ప్రభుత్వ డాక్టర్​పై దాడికి పాల్పడ్డాడు. తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి మాట్లాడేందుకని వెళ్లి ఆస్పత్రిలోనే డాక్టర్​ను కత్తితో పొడిచాడు. ఏడుసార్లు పొడిచి పారిపోతుండగా తోటి డాక్టర్లు, సిబ్బంది నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. తమిళనాడు చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం ఈ దారుణం జరిగింది.

తల్లి ఆరోగ్యం మెరుగవలేదనే కోపంతో.. 

పెరుంగళత్తూర్​కు చెందిన విఘ్నేశ్వరన్ క్యాన్సర్​తో బాధపడుతున్న తన తల్లి ప్రేమను చెన్నైలోని కలైంజర్ సెంటినరీ సూపర్ స్పెషాల్టీ ఆస్పత్రిలో చేర్పించాడు. అంకాలజీ డిపార్ట్​మెంట్​లో పనిచేస్తున్న డాక్టర్ బాలాజీ జగన్నాథన్ ఆమెకు ఆరు నెలలుగా ట్రీట్​మెంట్ అందిస్తున్నారు. అయినా, ఆమె ఆరోగ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. దీంతో ప్రేమ కొడుకు విఘ్నేశ్వరన్ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. తల్లి ఆరోగ్యం గురించి మాట్లాడాలని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. విఘ్నేశ్వరన్​ను సెక్యూరిటీ సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు. డాక్టర్ బాలాజీ కడుపు, ఛాతీ, ముఖం, వీపుపై కత్తిపోట్లున్నాయని, ఐసీయూలో ట్రీట్​మెంట్ అందజేస్తున్నారని హెల్త్ మినిస్టర్ సుబ్రమణియన్ మీడియాకు తెలిపారు. డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ దాడి జరిగిన స్పాట్​ను పరిశీలించారు.

విచారణకు ఆదేశించిన  సీఎం స్టాలిన్

దాడి ఘటనపై రాష్ట్ర సీఎం ఎంకే స్టాలిన్ విచారణకు ఆదేశించారు. నిత్యం సేవలందిస్తున్న డాక్టర్లపై ఇలాంటి దాడులు మరోసారి జరకుండా చూస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.