
హైదరాబాద్ నగరంలో ఈ మధ్య దారుణాలు పెరిగి పోతున్నాయి. పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి. అందరు చూస్తుండగానే నేరాలు చేస్తున్నారు. లేటెస్ట్ గా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో పట్టపగలే ఓ కుమారుడు తన తండ్రిని నరికి చంపాడు. ఈ ఘటన స్థానికంగ కలకలం రేపుతోంది.
ఫిబ్రవరి 21న సాయంత్రం 4 గంటల 48 నిమిషాలకు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కూత వేటు దూరంలో ఈ ఘటన జరిగింది. నడిరోడ్డు మీద లాలాపేట్ లో నివాసం ఉండే ఆరెల్లి సాయి కుమార్ అనే కుమారుడు తన తండ్రి మొగిలిని వెంటాడి వేటాడి దారుణంగా కత్తితో పొడిచాడు. అతడికి తీవ్రంగా గాయాలయ్యాయి. ఈ ఘటన అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది.
ఈ ఘటన జరుగుతుండగా రోడ్డుపై అందరు చూస్తుండిపోయారు. అయినా ఏ ఒక్కరు కూడా అతడిని అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయాలైన తండ్రిని దగ్గర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. చికిత్స పొందుతున్న తండ్రి ఫిబ్రవరి 22న మృతి చెందాడు.
తండ్రి మొగిలి రోజు మధ్యం తాగొచ్చి గొడవ చేస్తున్నాడని.. ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడన్న కోపంతో నే ఈ హత్య చేసినట్లు నిందితుడు సాయికుమార్ ఒప్పుకున్నాడు. కడుపులో 10 నుంచి 15 కత్తి పోట్లు ఉన్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.