
‘నేషనల్ హెరాల్డ్’ మనీలాండరింగ్ కేసులో రేపు ఉదయం (జూన్ 23న) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎదుట కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ హాజరుకావాల్సి ఉన్న తరుణంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. విచారణకు హాజరయ్యేందుకు ఇంకొన్ని వారాల గడువు కోరుతూ ఈడీకి సోనియాగాంధీ లేఖ రాశారు. ఇంకొంత కాలం విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించిన నేపథ్యంలో తాను ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. తాను కొవిడ్ నుంచి.. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ నుంచి పూర్తిగా కోలుకోవాల్సి ఉందని తెలిపారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని విచారణను ఎదుర్కొనేందుకు కొంత గడువు ఇవ్వాలని కోరారు. ఈవిషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ బుధవారం మధ్యాహ్నం వెల్లడించారు. కొవిడ్ చికిత్స అనంతరం సర్ గంగారామ్ ఆస్పత్రి నుంచి సోమవారమే (జూన్ 20న) సోనియాగాంధీ డిశ్చార్జి అయ్యారు. కాగా ఇదే కేసులో ఐదు రోజుల పాటు రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నించిన సంగతి తెలిసిందే.