ఖమ్మం మీదుగా నడిచే 30 రైళ్లు రద్దు.. గోల్కొండ, శాతవాహన ఎప్పటిదాకా బంద్ అంటే..

ఖమ్మం మీదుగా నడిచే 30 రైళ్లు రద్దు.. గోల్కొండ, శాతవాహన ఎప్పటిదాకా బంద్ అంటే..

ఖమ్మం: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేట –విజయవాడ మధ్య మూడో రైల్వే లైన్​పనుల కారణంగా ఖమ్మం మీదుగా విజయవాడ, వరంగల్​ వైపు వెళ్లే పలు రైళ్లను ఫిబ్రవరి 10 నుంచి 20వ తేదీ వరకు రద్దు చేశారు. మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. అయితే రద్దయిన రైళ్లలో కొన్నింటిని నిర్ణీత తేదీల్లో నడిపించేందుకు అధికారులు చర్యలు తీసుకున్నారు.

భద్రాచలం -విజయవాడ, డోర్నకల్​ విజయవాడ ప్యాసింజర్లు, గోల్కొండ, శాతవాహన, ఇంటర్​సిటీ ఎక్స్ప్రెస్​ రైళ్లను ఈనెల 10 నుంచి పది రోజుల వరకు రద్దు చేశారు. ఖమ్మం మీదుగా నడిచే 107 రైళ్లలో 30 రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచించారు.

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కాజీపేట–విజయవాడ​ మధ్య మూడో రైల్వే లైన్​ పనులు చకచక కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రైల్వే అమృత్ పథకం కింద ఈ పనులు చేపట్టారు. ఖమ్మం మీదుగా హైదరాబాద్, వరంగల్, విజయవాడ పరిధిలో పలు రైళ్లను రద్దు చేసి మరీ వేగంగా పనులు చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం రైల్వే స్టేషన్​సమీపంలో ఇంటర్​లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీని కోసం ఖమ్మం రైల్వే స్టేషన్లో రెండో ప్లాట్ ఫామ్ను కొంత మేర కూల్చివేశారు.

కొండపల్లి నుంచి కాజీపేట వరకు పలు స్టేషన్లలో ఇప్పటికే లైన్​ నిర్మాణం పూర్తయింది. మిగిలిన చోట్ల పనులు స్పీడప్​ చేసి జూన్​ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కొండపల్లి - మధిర మధ్య మూడో లైన్​ నిర్మాణం పనులు పూర్తికాగా ఇటీవల ట్రయల్ రన్​ కూడా నిర్వహించారు. మధిర నుంచి మోటమర్రి వరకు మూడో లైన్ను మార్చి వరకు, మోటమర్రి నుంచి పందిళ్లపల్లి స్టేషన్​ వరకు ఏప్రిల్ లోపు పనులు పూర్తి చేయాలని ప్లాన్​చేస్తున్నారు. ఈ పనుల కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఇదంతా పూర్తయ్యాక ఖమ్మం నుంచి డోర్నకల్ వరకు, ఆ తర్వాత మహబూబాబాద్​ వరకు పనులు చేయనున్నారు.