
గద్వాల, వెలుగు: రైల్వే శాఖలో చేపడుతున్న పనులు గడువులోగా పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ తరుణ్ కుమార్ జైన్ ఆదేశించారు. గురువారం బాల బ్రహ్మేశ్వర జోగులాంబ స్టేషన్ నుంచి తనిఖీలు చేపట్టారు. స్టేషన్ లో సౌలతులు, ఆస్తులు, పరిసరాలు పరిశీలించారు. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా రూ.6.7 కోట్ల అంచనాతో స్టేషన్లో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. నిర్దేశించిన గడువులోగా పనులు కంప్లీట్ చేయాలని ఆదేశించారు.
కర్నూల్ లో నిర్మిస్తున్న కోచ్ మిడ్ లైఫ్ రియాబిలిటేషన్ వర్క్ షాప్ కు కొత్త లైన్ అనుసంధానికి సంబంధించిన పనులను పరిశీలించారు. కర్నూల్ లో సీఎంఎల్ఆర్ వర్క్ షాప్ ఎస్టిమేషన్లు ప్రస్తుతం రూ.562 కోట్లకు పెంచడం జరిగిందన్నారు. ఈ వర్క్ షాప్ పూర్తయితే నెలకు 50 కోచ్లకు రిపేర్లు చేసే కెపాసిటీ వస్తుందన్నారు. మొదటి దశలో నాన్ ఏసీ కోచ్ ల రిపేర్లు చేపడతామని, ఆ తర్వాత ఏసీ కోచ్ నిర్వహణ చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆయన వెంట హైదరాబాద్ డీఆర్ఎం లోకేశ్ విష్ణోహీ ఉన్నారు.