
మెదక్ టౌన్, వెలుగు: ఎన్నికల సమయంలో ప్రజలకు పోలీసులు ఉన్నారనే నమ్మకం, ధైర్యాన్ని కలిగించాలని ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. శనివారం తన ఆఫీసులో ఎన్నికల విధులపై పోలీసులకు ఒక్క రోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి ఎన్నికల విధులలో నిర్వహించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో జరిగేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతతో పని చేయాలని సూచించారు.
సరిహద్దు జిల్లాల పోలీసులతో కలిసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేయాలని నగదు, మద్యం, ఉచిత పంపిణీలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా విక్రయాలు చేసే షాపు యజమానులు అనుమతి తీసుకోవాలన్నారు. లైసెన్సు లేకుండా విక్రయాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో ఏఎస్పీ మహేందర్, డీసీఆర్బీ డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, మెదక్, తూప్రాన్ డీఎస్పీలు ఫణీంద్ర, యాదగిరెడ్డి, జిల్లాలోని సీఐలు, ఆర్ఐలు, ఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.