చంద్రయాన్​-3 ప్రాజెక్టుకు స్పేస్​ అవార్డు

చంద్రయాన్​-3 ప్రాజెక్టుకు స్పేస్​ అవార్డు

–ఇస్రో చేపట్టిన చంద్రయాన్​ – 3 ప్రాజెక్టుకు అంతర్జాతీయ ఆస్ట్రోనాటికల్​ ఫెడరేషన్​ ఇంటర్నేషనల్​ స్పేస్​ అవార్డును ప్రకటించింది. ఈ అవార్డును ఈ ఏడాది అక్టోబర్​ 14న ఇటలీలోని మిలాన్​లో జరుగనున్న 75వ అంతర్జాతీయ ఆస్ట్రానాటికల్​ కాన్ఫరెన్స్​ను పురస్కరించుకొని అందజేయనున్నారు. 

    2023, ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్​ ల్యాండర్​ను భారత్​ విజయవంతంగా ఇస్రో ల్యాండింగ్​ చేసింది. అమెరికా, చైనా, రష్యా తర్వాత చంద్రుడిపై కాలు పెట్టిన నాలుగో దేశంగా భారత్​ అవతరించింది. ఇప్పటివరకు ఏ దేశం వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగిన మొదటి దేశంగా చరిత్ర సృష్టించింది. 
    రెండు వారాల పరిశోధనలు సాగించేలా వీలుగా విక్రమ్​ ల్యాండర్​, ప్రజ్ఞాన్​ రోవర్​లను ఇస్రో రూపొందించిది. 

    విక్రమ్​ ల్యాండ్​ అయిన తర్వాత లోపలి నుంచి బయటకు వచ్చిన ప్రజ్ఞాన్​ రోవర్​ 100 మీటర్ల దూరం ప్రయాణించి అక్కడ సమాచారాన్ని సేకరించింది. ఆ తర్వాత ల్యాండర్​, రోవర్లు స్లీప్​ మోడ్​లోకి వెళ్లాయి. 

    రెండు వారాల తర్వాత మేల్కొలిపేందుకు ఇస్రో ప్రయత్నం చేసినా ఫలించలేదు. దాంతో అవి శాశ్వత నిద్రలోకి వెళ్లినట్లు శాస్త్రవేత్తలు ధ్రువీకరించారు. 
     ఇస్రో చంద్రయాన్​–4 ప్రయోగానికి ప్రణాళికలు రచిస్తున్నది. ఈ మిషన్​లో చంద్రుడిపై నమూనాలను సేకరించి తిరిగి భూమిపైకి చేరుకోనున్నది. ఈ మిషన్​ను 2026 నాటికి నిర్వహించాలని ఇస్రో భావిస్తున్నది.