
- పదేండ్లలో రూ.1,243 కోట్ల ఆమ్దానీ
- 393 ఉపగ్రహాలు స్పేస్లోకి చేర్చిన ఇస్రో.. లోక్సభలో కేంద్రమంత్రి వెల్లడి
న్యూఢిల్లీ: స్పేస్ సెక్టార్లో ఇండియాకు పదేళ్లలో రూ.1,243 కోట్ల ఆదాయం వచ్చిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. 2015 నుంచి 2024 వరకు విదేశీ శాటిలైట్ల ప్రయోగం ద్వారా ఈ రెవెన్యూ వచ్చిందని లోక్సభలో ప్రకటించారు. ‘‘గడిచిన పదేండ్లలో మొత్తం 393 విదేశీ ఉప గ్రహాలను ఇండియా లాంచ్ చేసింది.
ఇస్రోకు చెందిన పీఎస్ఎల్వీ, ఎల్వీఎం3, ఎస్ఎస్ఎల్వీ లాంచ్ వెహికల్స్ నుంచి శాటిలైట్లు ప్రయోగించింది. ఇస్రో.. మొత్తం 34 దేశాలకు శాటిలైట్ లాంచింగ్ సేవలు అందించింది. అభివృద్ధి చెందిన దేశాల శాటిలైట్లను కూడా మనం ప్రయోగించాం. అత్యధికంగా అమెరికాకు చెందిన 232 శాటిలైట్లను నింగిలోకి పంపినం. ఆ తర్వాత యూకేవి 83, సింగపూర్వి 19, కెనడావి 8, కొరియావి 5, లక్జెంబర్గ్వి 4, ఇటలీవి 4, జర్మనీ, బెల్జియం, ఫిన్లాండ్, ఫ్రాన్స్కు చెందిన మూడేసి శాటిలైట్లు సహా పలు దేశాల ఉపగ్రహాలను ఇస్రో విజయవంతంగా నింగిలోకి ప్రవేశపెట్టింది’’ అని జితేంద్ర సింగ్ లోక్సభలో వెల్లడించారు.
మరో 61 దేశాలు, పలు స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన శాటిలైట్లను లాంచ్ చేసేందుకు ఇస్రో ఒప్పందం కుదుర్చుకున్నదని తెలిపారు. ‘‘లాంచింగ్ చేసిన వాటిలో శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, శాటిలైట్ నేవిగేషన్, శాటిలైట్ కమ్యూనికేషన్, కెపాసిటీ బిల్డింగ్కు సంబంధించినవి ఎక్కువగా ఉన్నాయి.
స్పేస్ సెక్టార్లో ఇండియా అద్భుత విజయాలు సాధించిందని సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ సమాధానం ఇచ్చారు. 2023లో చంద్రయాన్ 3లో భాగంగా సాఫ్ట్ ల్యాండింగ్ అనంతరం చాలా దేశాలు శాటిలైట్ల ప్రయోగాలకు ఇండియాను సంప్రదిస్తున్నాయని వివరించారు. చంద్రుడి సౌత్పోల్లో ఇండియా అడుగుపెట్టిందన్నారు. చంద్రయాన్ 3 తర్వాత ఫస్ట్ సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 విజయవంతంగా లాంచ్ చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది గగన్యాన్ మిషన్పై ఫోకస్ పెట్టిందన్నారు.