వర్గీకరణ చేసిన రేవంత్​కు తిట్లు..మోదీ, చంద్రబాబుకు పొగడ్తలా?

వర్గీకరణ చేసిన రేవంత్​కు తిట్లు..మోదీ, చంద్రబాబుకు పొగడ్తలా?

ఎస్సీ వర్గీకరణ ఉద్యమానికి 40 దశాబ్దాల చరిత్ర ఉన్నది.  మాజీ  మంత్రి  టీఎన్ సదాలక్మి మొదట ఆది జాంబవ అరుంధతీయ బంధు సేవామండలి పేరుతో ఎస్సీ రిజర్వేషన్​ను ఏబీసీడీ గ్రూపులుగా వర్గీకరించాలని ఆందోళన చేశారు.  ఆ తర్వాత 1994 జులై 7న  మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (MRPS ) ఉద్యమం ప్రారంభించారు.  పేరు పక్కన మాదిగ అని పెట్టుకొని ఆత్మగౌరవ పోరాటానికి శ్రీకారం చుట్టారు. 

1996 మార్చి 2 న  నిజాం కాలేజ్ గ్రౌండ్​లో లక్షలాది మంది మాదిగలతో భారీ బహిరంగ సభ జరిపి మాదిగ హక్కుల దండోరా వేశారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్​ను నియమించింది. 1997లో చంద్రబాబు ప్రభుత్వం జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా షెడ్యూల్​లోని 59 ఎస్సీ కులాలను 4 గ్రూపులుగా విభజిస్తూ జీఓ ఇచ్చింది. ఎస్సీ కులాలను 4 గ్రూపులుగా విభజన చేస్తున్నామని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్​ను సంప్రదించకుండా వర్గీకరణ జీఓ ఇచ్చారని హైకోర్ట్  జీఓను కొట్టివేసింది.  

నాటి సీఎం చంద్రబాబు నాయుడు సొంతగ్రామం చిత్తూరు జిల్లా నారావారిపల్లి నుంచి హైదరాబాద్ వరకు 1100 కి.మీ. పాదయాత్ర చేస్తూ ముగింపు హైదరాబాద్​కు దగ్గరికి వచ్చిన వెంబడే 1999 నవంబర్​లో  ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ వచ్చింది.  2000 ఏప్రిల్ 20న ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్​ను అసెంబ్లీ ఆమోదించింది. హైకోర్టు కూడా ఆర్డినెన్స్​ను  ఆమోదించింది. మాదిగలు  వర్గీకరణ ఉద్యమాన్ని ఆపేశారు.  ఇతర కులాల హక్కుల కోసం మందకృష్ణ పోరాటం మొదలుపెట్టాడు.

2000 సంవత్సరం నుంచి 2004 వరకు ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీలుగా విద్య, ఉద్యోగ రంగాలలో అమలు జరిగింది. ఈ ఎస్సీ వర్గీకరణ ఆర్డినెన్స్​ మీద ఈవీ  చిన్నయ్య సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం జరిగింది. ఐదుగురి  సభ్యుల సుప్రీంకోర్టు ధర్మాసనం 2004 నవంబర్ 5న ఎస్సీ వర్గీకరణ మీద  తీర్పు  చెబుతూ ఈ ఎస్సీ కులాలను విభజించటానికి వీలులేదు. ఎందుకంటే వీరు హోమోజినియస్ (ఒకేవిధంగా అంటరానితనానికి చెందినవారు వీరు మొత్తం ఒకే కుటుంబానికి చెందినవారు) ఆర్టికల్ 341 ప్రకారం వర్గీకరణ చేయటానికి వీలులేదు. 

ముఖ్యంగా క్లాజ్ 14కు వ్యతిరేకం అని తీర్పునిస్తూ  పార్లమెంట్​లో  వర్గీకరణకు చట్టం చేసుకునే అధికారం ఉన్నదని చెప్పింది. 2005లో  అసెంబ్లీలో  అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ బిల్లును అమోదిస్తూ కేంద్రానికి పంపించింది. 2006 – 07లో కేంద్ర ప్రభుత్వం ఉషామెహ్రా కమిషన్​ను 

నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ కమిషన్ 2009 దాకా దేశమంతటా అన్ని రాష్ట్రాల్లో  పర్యటించి ఎస్సీ కులాల అభిప్రాయం తీసుకుంది.  చివరికి ఎస్సీ వర్గీకరణ సబబే.. ఆర్టికల్  341ను  సవరిస్తూ పార్లమెంట్​లో  బిల్లు ప్రవేశపెట్టి షెడ్యూల్ కులాలు వర్గీకరణ చేయవచ్చు అని రిపోర్ట్ తయారుచేసి 2012లో పార్లమెంటుకు అందించింది.

ఎంఆర్​పీఎస్​ నాయకత్వ మార్పులు

1996లో మొదటి రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు ఏర్పాటయ్యాయి. మొదటి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ.  కమిటీ 2000 వరకు కొనసాగింది.  ఎస్సీ వర్గీకరణ సాధించింది. ఈ రాష్ట్ర కమిటీ రద్దు చేస్తూ అణగారిన కులాల ఐక్య వేదిక నాయకులుగా మొదటి  ఎంఆర్​పీఎస్​ కమిటీ వారిని నియమిస్తూ,  ఎంఆర్​పీఎస్​కు 2వ రాష్ట్ర కమిటీ వ్యవస్థాపక అధ్యక్షుడుగా మందకృష్ణ మాదిగ కొనసాగుతూ,  ప్రతి మూడు సంవత్సరాలకు కొత్త రాష్ట్ర కమిటీ,  జిల్లా కమిటీలు వేస్తూ  పాతవారిని  బయటకు వెళ్లగొడుతూ తాను మాత్రం ఎంఆర్​పీఎస్​కు వ్యవస్థాపక అధ్యక్షుడుగా కొనసాగుతున్నారు. 

1994 నుంచి ప్రస్తుతం 2025లో  20, 25 సంవత్సరాల విద్యార్థులకు నాయకత్వం వహిస్తున్న 60 సంవత్సరాలు నిండిన నాయకుడు మంద కృష్ణ మాదిగ.  60లో 20 నాయకత్వం నడుస్తుంది. 2000 సంవత్సరంలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ జరిగిన తర్వాత అణగారిన కులాల ఐక్యవేదిక, మహాజన సంఘర్షణ సమితి సంస్థల ఏర్పాటు, ఇతర కులాల గురించి మాదిగల  పోరాటం జరిగింది. 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం కేసీఆర్​ తెరాస పేరుతోప్రారంభమైంది.  

సామాజిక తెలంగాణ పేరుతో మంద కృష్ణ సైకిల్ యాత్ర, తెలంగాణ రాష్ట్రం కోసం  సపరేట్​గా  ఎంఆర్​పీఎస్ పోరాటం చేసింది. 2004లో  ఎస్సీ వర్గీకరణను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు తీర్పు రాగా  ఈ తీర్పును  మంద కృష్ణ మాదిగ పట్టించుకోలేదు. ఎలాంటి ఉద్యమం చేయలేదు. 
 
ఇతర వర్గాల కోసం పోరాటం

కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఉషామెహ్రా కమిషన్ వేసింది.  2006లో  కరీంనగర్ పార్లమెంట్​కు ఉప ఎన్నిక వచ్చింది, ఈ ఎన్నికలలో  కేసీఆర్​ను ఓడించటానికి కాంగ్రెస్​ను గెలిపించటానికి  తెలంగాణ పది జిల్లాల నుంచి  ఎంఆర్​పీఎస్​  ఉద్యమకారులను కరీంనగర్​కు పిలిపించి కేసీఆర్​కు వ్యతిరేకంగా అంటే తెలంగాణకు వ్యతిరేకంగా ఎంఆర్​పీఎస్​ను  పనిచేయించాడు. ఎంఆర్​పీఎస్​ అంటే తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర పడింది.  

ఎంఆర్​పీఎస్​ పోరాటం చేసిన మాదిగలు మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు ఇతర వర్గాలకోసం పోరాడటం మొదలైంది. గుండె జబ్బుల పిల్లల కోసం బీజేపీ,  కిషన్ రెడ్డితో కలసి పోరాటం,  వృద్ధాప్య పింఛన్ల కోసం, వికలాంగుల కోసం, రాజకీయ నాయకులకు అవమానం జరిగితే వారికోసం ఉద్యమం చేయటం జరిగింది.  నిత్యం మాదిగలు ఇతరుల కోసం మంద కృష్ణ మాదిగ నాయకత్వంలో పోరాటం చేశారు.

బీజేపీతో జోడికి బీజం

ఎంఆర్​పీఎస్​ రాష్ట్ర మీటింగ్​కు బీజేపీకి చెందిన కిషన్ రెడ్డిని ఆహ్వానించి బీజేపీకి సఖ్యతగా ఉండేవిధంగా  మాదిగ  ఉద్యమకారులకు అలవాటు చేయడం జరిగింది.  వర్గీకరణ పేరుతో  గాంధీ భవన్ దగ్ధం చేశారు.  2009 ఫిబ్రవరిలో  సోనియా గాంధీ హైదరాబాద్ పర్యటనకు వస్తున్న సమయంలో.. సోనియా గాంధీ సభను అడ్డుకోవాలి. అడుగడుగునా  రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేయాలని చెబుతూ,  సీక్రెట్​గా  గాంధీ భవన్​ను తగులబెట్టాలని హైదరాబాద్, అబిడ్స్​కు  చెందిన  సురేందర్,  దేవేందర్, మహేష్​లను మందకృష్ణ  పురమాయించి, వారికి జాగ్రత్తలు చెప్పకుండా వాళ్లకు వాళ్లే తగులబడేటట్లు చేసి వారి సమాధుల మీద రాజకీయ పునాదులు వేసుకున్న వ్యక్తి మంద కృష్ణ. 2009లో మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. 

వైఎస్​ రాజశేఖర్ రెడ్డి  ప్రమాదవశాత్తు చనిపోవటం. రోశయ్య ముఖ్యమంత్రి కావటం, ఆ తర్వాత కిరణ్​కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం, తెలంగాణ ఉద్యమం ఉధృతం కావటం, 2014లో సోనియా
గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగింది.  

2014లో తెలంగాణ ఏర్పాటు

2014లో  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో   కేసీఆర్ బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి గుర్రాలు, ఒంటెలు, ఏనుగులతో ఊరేగింపు నిర్వహించారు.  అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగి తెలంగాణ రాష్ట్రంలో తెరాస,  కేంద్రంలో బీజేపీ సర్కార్ ఏర్పాటు అయ్యింది.  2014 తెలంగాణలో తెరాస ప్రభుత్వం ఏర్పడింది.  కేసీఆర్  ముఖ్యమంత్రి అయ్యారు. 

కేంద్రంలో బీజేపీ 

ప్రభుత్వం ఏర్పడింది.  ప్రధానిగా నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ ఉషామెహ్రా కమిషన్ రిపోర్ట్ ను కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 341ను  సవరిస్తూ వెంటనే వర్గీకరణ చేయాలని కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్​ ప్రభుత్వం అడగలేదు. కృష్ణమాదిగ కూడా ఎలాంటి పోరాటం  చేయలేదు.  ఉషామెహ్రా కమిషన్ రిపోర్ట్ ను  2014 నుంచి 2024 వరకు అంటే పది సంవత్సరాలపాటు మోదీ బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు.  వర్గీకరణను పట్టించుకోవాలని మంద కృష్ణ,  కిషన్ రెడ్డి అడగలేదు.  కానీ, టీఆర్ఎస్  ప్రభుత్వం మాత్రం అసెంబ్లీలో వర్గీకరణ  బిల్లును  ప్రవేశపెట్టి కేంద్రానికి పంపించి చేతులు దులుపుకుంది. 

10 సంవత్సరాలు వర్గీకరణను  పట్టించుకోని మోదీ.. మాదిగల సభకు హాజరయ్యారు.  2023 నవంబర్​లో  సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో మాదిగల సభకు  ప్రధాని నరేంద్ర మోదీ హాజరవటం జరిగింది.  మందకృష్ణ  మోదీని  కౌగిలించుకుని అర్ధగంటసేపు ఏడవటం జరిగింది.  దీంతో తమ్ముడా కృష్ణా నీ కింద పనిచేస్తానని మోదీ తెలిపారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో ఎంఆర్​పీఎస్​మంద కృష్ణ మాదిగ బీజేపీకి మద్దతిచ్చారు. హెలికాప్టర్లో సభలకు తిరుగుతూ బీజేపీకి మాదిగలు ఓట్లు వేయాలని ప్రచారం చేసిండు.

తెలంగాణలో రేవంత్ సర్కార్.. మంద కృష్ణ బేజార్

2023 డిసెంబర్ 3న తెలంగాణలో  కాంగ్రెస్ సర్కార్ ఏర్పడింది.  రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఎస్సీ వర్గీకరణ మీద ఏడుగురి జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వాదనలు అన్ని రాష్ట్రాల అభిప్రాయాలు తెలపాలని రాష్ట్రాలకు నోటీసులు,  తెలంగాణ ప్రభుత్వంకు కూడా సుప్రీం కోర్టు నోటీసులు.. వెంటనే సీఎం రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు.  మంత్రి దామోదర్ రాజానర్సింహకి ఎస్సీ  వర్గీకరణ గురించి చెప్పి నిష్ణాతులైన కౌన్సిలు నియమించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో వర్గీకరణ మీద సుప్రీంకోర్టులో వాదనలు వినిపించింది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం.  

పంజాబ్ ప్రభుత్వం నియమించిన లాయర్లు కలసి ఎస్సీ వర్గీకరణ కేసు వాదించి గెలిపించారు.  సుప్రీంకోర్టు వాదనల సమయంలో మంద కృష్ణ మాత్రం సుప్రీంకోర్టు దగ్గర మెట్లు ఎక్కుతూ, దిగుతూ మీడియాకు ఫోజులు ఇచ్చాడు.  సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రోజు మంద కృష్ణ మాదిగ ఎక్కడున్నారు? సుప్రీంకోర్టు ఎస్సీ ఉప వర్గీకరణ మీద తీర్పు వెలువరిస్తూ  ఆ తీర్పులో జస్టిస్  బి.ఆర్. గవాయ్  కామెంట్స్.. ఎస్సీ రిజర్వేషన్లు అన్ని కులాలకు అందాలంటే  ఎస్సీలలో కూడా క్రిమిలేయర్ విధానం పాటించాలని తెలిపారు.  సుప్రీంకోర్టు తీర్పులో క్రిమిలేయర్ గురించి వచ్చింది.

క్రిమిలేయర్ విధానాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్​

కాంగ్రెస్ పార్టీ క్రిమిలేయర్ విధానాన్ని  వ్యతిరేకిస్తుందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే ప్రకటించారు.  ఆగస్టు1న  సుప్రీంకోర్టు తీర్పును అసెంబ్లీలో స్వాగతిస్తూ తీర్మానించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.  మంద కృష్ణ మాదిగ  మాత్రం సీఎం రేవంత్ రెడ్డికి కనీసం కృతజ్ఞత కూడా  తెలపకుండా  అదే రోజు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.  అక్కడే వారం రోజులు ఉండి తెలంగాణ భవన్ దగ్గర విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి క్రిమిలేయర్​ను  వ్యతిరేకించిన మల్లిఖార్జున ఖర్గే వారి కుటుంబ వారసత్వ రాజకీయం గురించి,  వివేక్ వెంకట్ స్వామి కుటుంబ రాజకీయం గురించి,  మల్లు భట్టి కుటుంబ రాజకీయ వారసత్వం గురించి మాలల మీద తీవ్ర స్థాయిలో విమర్శించాడు.  

వారసత్వ రాజకీయం మాలలే కాదు మాదిగ ఉపకులాలైన డా. బాబు జగజ్జీవన్ రాం కుటుంబ రాజకీయం గురించి, సుశీల్ కుమార్ షిండే రాజకీయ వారసత్వం గురించి, దామోదర్ రాజ నరసింహ  రాజకీయ వారసత్వం,  కడియం శ్రీహరి రాజకీయ వారసత్వం గురించి కూడా మంద కృష్ణ చెప్పకుండా ఒక్క మాలల గురించే మాట్లాడి మాదిగ ఉద్యమకారులను రెచ్చగొట్టాడు.  క్రిమిలేయర్ గురించి మాట్లాడి మాలలను కూడా రెచ్చగొట్టాడు. క్రిమిలేయర్​ను  యావత్ దళిత సమాజం వ్యతిరేకిస్తోంది.

కాంగ్రెస్​పై తప్పుడు ప్రచారం

ఆగష్టు 1, 2024 నుంచి ఫిబ్రవరి 4, 2025 వరకు ఎసీ వర్గీకరణ ప్రాసెస్ కంప్లీట్ అయింది.  వెయ్యి గొంతులు లక్ష డప్పులతో  హైదరాబాద్​కు  వస్తున్న  ఎస్సీ  వర్గీకరణను చేస్తే  సంబురాలు చేస్తా..... వర్గీకరణ చేయకపోతే  చావు డప్పు కొడతా అన్నారు మంద కృష్ణ.   ఎస్సీ  వర్గీకరణపై  సుప్రీంకోర్టు తీర్పు చెప్పినరోజే  తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  ఆగస్టు1, 2024 న వర్గీకరణకు  కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ప్రకటించి కార్యక్రమానికి  శ్రీకారం చుట్టి ముందుకు పోతున్న సమయంలో,  తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాల నేతలకు భయపడి వర్గీకరణ చేయటంలో కాలయాపన చేస్తున్నదని తప్పుడు ప్రచారం చేస్తూ ఫిబ్రవరి 7, 2025న ‘వెయ్యి గొంతులు.. లక్ష డప్పులు’ కార్యక్రమానికి  బీజేపీ, మంద కృష్ణ  కుట్రకు ప్లాన్ చేశారు.  

ఫిబ్రవరి 7 ప్రోగ్రామ్​ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇదే అదనుగా సీఎం ఇంటి ముందు చావు డప్పు కొట్టి కాంగ్రెస్ పార్టీకి మాదిగలను పూర్తిగా దూరం చేయాలనే కుట్రకు  మంద కృష్ణ తెర లేపారు. వీళ్ళ కుట్రను ఛేదించి ఫిబ్రవరి 4 నే SC వర్గీకరణ చేసి మాట నిలబెట్టుకున్న  మహానేత  తెలంగాణ  సీఎం రేవంత్ రెడ్డి.  వర్గీకరణనే నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్న నాయకుడా ఫిబ్రవరి 1న  ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా మంద కృష్ణ డప్పు ఎందుకు సంబురానికి మోగలేదో చెప్పాలి.  

జస్టిస్ సెమిమ్ అక్తర్  ఇచ్చిన్న కమిషన్ రిపోర్ట్  తప్పుల తడక అని తప్పుడు ప్రచారం ఎవరి కోసం  చేశాడు మంద కృష్ణ.. అదేవిధంగా గ్రూప్ ఉద్యోగాలు 1,2,3,4 ల నోటిఫికేషన్ లు  2022లో  గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లు, వాటిలో ఎస్సీ  వర్గీకరణను అమలు చేయాలని పట్టుపట్టి కాంగ్రెస్ ప్రభుత్వంను, సీఎం రేవంత్ రెడ్డిని బదనాం చేయాలని బీజేపీ, మంద కృష్ణ ప్లాన్ చేశారు.  ఎస్సీ రిజర్వేషన్ ఉప వర్గీకరణ మూడు గ్రూపులుగా చేసింది మొదట తెలంగాణ సీఎం  రేవంత్ రెడ్డి.  ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్  సీఎం చంద్రబాబు నాయుడు ఎస్సీ రిజర్వేషన్​ను ఉప వర్గీకరణ చేశాడు. అయితే మంద కృష్ణ.. చంద్రబాబు నాయుడును దేవుడులాగ  ప్రచారం చేస్తూ బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు తెలపడం శోచనీయం.

ఎస్సీ వర్గీకరణను స్వాగతించిన సీఎం రేవంత్​

సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన రోజు అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మాదిగలు  రాజకీయంగా కాంగ్రెస్  వెంబడి పోకూడదని భావించిన మంద కృష్ణ  ఢిల్లీ పోయి బీజేపీ నేతలతో చర్చించి క్రిమిలేయర్ పంచాయితీ పెట్టాడు.  ఢిల్లీ నుంచి మంద కృష్ణ  హైదరాబాద్​కు  బయలుదేరి వచ్చి సికింద్రాబాద్ నుంచి ఊరేగింపుగా బాబూ జగ్జీవన్ రాం విగ్రహం వరకు వచ్చాడు. మంత్రి దామోదర్ రాజనర్సింహాను వెంటవేసుకొని 20 రోజుల తర్వాత  సీఎం రేవంత్ రెడ్డిని మందకృష్ణ కలసి కృతజ్ఞతలు తెలపటానికి అయిష్టంగా వెళ్ళాడు.  

ఇష్టంగా చంద్రబాబును కలసి కృతజ్ఞతలు తెలిపాడు. ఎస్సీ ఉప వర్గీకరణ చేయటంలో ముందున్న సీఎం రేవంత్ ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద తీర్పు వెలువడుతున్న గంటలోపే అసెంబ్లీలో సీఎం  రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నాం, స్వాగతిస్తున్నాం. దేశంలోనే మొట్టమొదట ఎస్సీ వర్గీకరణ చేసిన రాష్ట్రంగా చరిత్ర సృష్టిస్తా.  సెప్టెంబర్ 12, 2024న ఎస్సీ ఉప వర్గీకరణకు మంత్రివర్గ ఉపసంఘం 6 మందితో కమిటి ఏర్పాటు.  మంత్రివర్గ ఉప సంఘం సిఫారసుతో అక్టోబర్ 11న ఏక సభ్య కమిషన్ జస్టిస్ సెమిమ్ అక్తర్​తో ఏర్పాటు.  ఫిబ్రవరి 3, 2025 (82రోజులు )న  కమిషన్ రిపోర్ట్ రాష్ట్ర  ప్రభుత్వానికి అందజేత.  ఫిబ్రవరి 4, 2025న అసెంబ్లీలో ఎస్సీ ఉప వర్గీకరణను 3 గ్రూపులుగా విభజిస్తూ బిల్లును ప్రవేశపెట్టి పాస్ చేశారు.  

మంద కృష్ణ  ద్వంద్వ రాజకీయ నీతి 

తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ రిజర్వేషన్ ఉప వర్గీకరణ చేసి గ్రూప్ 1లో  15 కులాలను చేర్చి 1 శాతం రిజర్వేషన్ కల్పించారు.  గ్రూప్ 2 లో  18 కులాలను  చేర్చి 9 శాతం రిజర్వేషన్​ను  కల్పించారు.  గ్రూప్ 3లో 26 కులాలను చేర్చి 5 శాతం  రిజర్వేషన్ కల్పించారు.  తెలంగాణ  రాష్ట్రంలో మాదిగ జనాభా నిష్పత్తి ప్రకారం 9 శాతం రిజర్వేషన్ తో పాటు  గ్రూప్ 1లో ఉన్న 7 మాదిగ ఉప కులాలకు 0.77%  రిజర్వేషన్ వాటా కల్పించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి  మాదిగలకు  కొబ్బరి లేని చిప్ప ఇచ్చినట్లు ఉద్యోగాలు లేని వర్గీకరణ జీఓ ఇచ్చాడని తప్పుడు ప్రచారం ఎందుకు మంద కృష్ణ చేస్తున్నాడు  బీజేపీ కోసమా?  ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ఆపి ఎస్సీ  రిజర్వేషన్ వర్గీకరణ చేశాడు చంద్రబాబు నాయుడు అని గొప్పలు చెబుతున్న మంద కృష్ణ... అయ్యా మంద కృష్ణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అస్సలు ఉద్యోగ నోటిఫికేషన్​లే  వెయ్యలేదు.  

ఇక ఉద్యోగాల భర్తీ ఎక్కడ ఆపినట్లు.... ఎందుకు ఈ దొంగ మాటలు మంద కృష్ణ.  బీజేపీ కోసమే నీ తాపత్రయమని తెలంగాణ మాదిగలకు తెలిసిపోయింది.  మంద కృష్ణ  నీ ద్వంద్వ రాజకీయ నీతి బంద్ చెయ్.  మహబూబ్ నగర్ జిల్లా మాదిగలు నీ భుజం మీద వేసిన ఉద్యమ నల్ల కండువాను  పక్కన పెట్టి బీజేపీ కాషాయ జెండాను చేతబట్టుకోమని ఎంఆర్​పీఎస్​ సీనియర్ నేతలు మీకు హితవు చెబుతున్నారు.  ఎస్సీ  రిజర్వేషన్ వర్గీకరణకు 1996 నుంచి 2000 సంవత్సరం వరకే దండోరా ఉద్యమం నడిచింది. మిగతా 25 సంవత్సరాలు పూర్తిగా ఇతర కులాల నాయకుల కోసం జరిగింది. 

అన్ని రాజకీయ పార్టీలను బెదిరించి డబ్బులు సంపాదించిన మంద కృష్ణ  నేడు మోదీ కౌగిలిలో ఎంజాయ్ చేస్తూ... దళితులకు మొదటి నుంచి ఇండ్లు ఇచ్చి, భూములిచ్చి, భూములు దున్నుకొని వ్యవసాయం చేయటానికి ఎడ్ల బండ్లు ఇచ్చి, ఎట్టి చేసే బతుకులకు పట్టెడు అన్నం పెట్టినది కాంగ్రెస్ పార్టీ.  దళితుడి చేత రాజ్యాంగం  రాయించింది, అందులో రిజర్వేషన్లు పెట్టింది కాంగ్రెస్.  నేడు ఆ రిజర్వేషన్లను వర్గీకరణ చేసి దళితులకు సామాజిక న్యాయం చేసింది కాంగ్రెస్.  ఇలాంటి కాంగ్రెస్​కు  మాదిగలను దూరం చేయాలనుకునే  నీ దుర్బుద్ధి మార్చుకో మంద ఎలియ.

- దేవని సతీష్ మాదిగ,
ఎంఆర్​పీఎస్​ ఫౌండర్ జనరల్ సెక్రటరీ,
ఎంఆర్​పీఎస్ సీనియర్ ఉద్యమకారుల వేదిక