
కరీంనగర్ లో కొనసాగుతున్న ట్రాఫిక్ పోలీసుల వరుస స్పెషల్ డ్రైవ్, వాహన తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్ కమీషనరేట్ వ్యాప్తంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, ప్రజల భద్రత దృష్ట్యా తీసుకునే చర్యల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు.
విద్యార్థుల భద్రత దృష్ట్యా పిల్లలను స్కూళ్లకు చేరవేసే ప్రయివేటు బస్సులు, వాన్ లు, ఆటోలపై స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించామన్నారు పోలీసులు. డ్రైవర్లకు డ్రైవింగ్ లైసెన్స్ తో పాటుగా, డ్రైవర్స్ చరిత్ర.. గతంలో ఏమైనా రోడ్డు ప్రమాదాలకు గురిచేసిన కేసులు ఉన్నాయా లేదా ఆరాదీశామని వెల్లడించారు.
వాహనాల ఫిట్ నెస్ సర్టిఫికెట్స్, ఇతర ధ్రువపత్రాలు, పొల్యూషన్, ఇన్సూరెన్సులు తనిఖీ చేశారు. స్కూల్ బస్సులు, వాన్ లు , ఆటోలు, టెంపో వాహనాలను నడుపుతున్న డ్రైవర్లకు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించామని పేర్కొన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ నందు వివిధ స్కూళ్లు, కాలేజీలకు చెందిన 52 వాహనాలను తనిఖీ చేశామన్నారు. సరైన ధృవపత్రాలు లేని 18 వాహనాలను గుర్తించి వారికి ఈ చలాన్ ద్వారా జరిమానాలు విధించామన్నారు.
ఈ తనిఖీల్లో చాలా వరకు స్కూళ్లకు చెందిన బస్సుల్లో చిన్న పిల్లల కోసమై కేర్ టేకర్ లు అందుబాటులో ఉంచట్లేదని గుర్తించామన్నారు.ఆయా పాఠశాలలు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించామని తెలిపారు.
కరీంనగర్ లో ట్రాఫిక్ పోలీసుల స్పెషల్ డ్రైవ్ లు నిరంతరం కొనసాగుతాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా సహకరించాలని కోరారు. ట్రాఫిక్ నియమాలు పాటించకుండా పట్టుబడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని చెప్పారు. ఈ తనిఖీల్లో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమేష్ తో పాటుగా సబ్ ఇన్స్పెక్టర్ ఇషాక్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.