
హనుమకొండ, వెలుగు: మహాశివరాత్రి సందర్భంగా హనుమకొండలోని హయగ్రీవాచారి గ్రౌండ్లో ఇండస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 'ఆధ్యాత్మిక సాంస్కృతిక సమ్మేళనం' వైభవంగా సాగింది. ఫౌండేషన్ చైర్మన్ ఏనుగుల రాకేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ సమ్మేళనం జరగగా, బీఆర్ఎస్ నేతలు సిద్దిపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావు, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి చీఫ్గెస్ట్గా హాజరయ్యారు. చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్, ప్రణవానంద దాస్ ప్రవచనాలు, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఆధ్యాత్మిక ప్రసంగాలు అలరించాయి.
అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ కనబరుస్తున్న కళాకారులకు ఇండస్ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'కాకతీయ పురస్కారం' అందజేశారు. కళలు, సాహిత్యం రంగంలో పల్లె రాములు, ఆధ్యాత్మికత, కోటగుళ్ల పరిరక్షణలో నాగపురి శ్రీనివాస్ గౌడ్, పోశాల శ్రీనివాస్(యోగా), మల్లికాంబ మనోవికాస కేంద్రం రామలీల(సామాజిక సేవ), సిరిపురం మహేశ్(క్రీడలు), మూడు విశ్వామిత్ర(పర్యావరణం), రంజిత్(పర్యావరణం), పడమటి అన్వితా రెడ్డి(మహిళా సాధికారత, సాహసం), కన్నె రాజు(సామాజిక సేవా క్రీడలు), ఎంఎన్ఆర్ గుప్తా(సామాజిక సేవా, ఆర్కిటెక్ట్) తదితరులు కాకతీయ పురస్కారాలు అందుకున్నారు. అనంతరం హిమాన్షి కాట్రగడ్డ నృత్యం, ఫోక్ సింగర్స్ మాట్ల తిరుపతి, శిరీష, భిక్షమమ్మ, అనితా యాదవ్ తదితరుల ప్రదర్శనలు అలరించాయి. కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యేలు ఒడితల సతీశ్ కుమార్, నన్నపనేని నరేందర్, తాటికొండ రాజయ్య తదితరులు పాల్గొన్నారు.