
- ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే
- తేలికగా తీసుకోవద్దని హెచ్చరిక
ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వంలో చీలిక వచ్చినట్టు తెలుస్తోంది. శివసేన నేత, డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే.. మూడు ముఖ్యమైన ప్రభుత్వ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో అధికార మహాయుతి కూటమిలో ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతోందన్న ప్రచారం మొదలైంది.
నిరుడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీ కూటమి ఘన విజయం సాధించగా, షిండేకు సీఎం పదవి ఇవ్వకపోవడంతో శివసేనలో అసంతృప్తి వ్యక్తమైంది. తర్వాత కొందరు శివనసే ఎమ్మెల్యేలకు ‘వై’- సెక్యూరిటీ తొలగించడంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు మహారాష్ట్ర సర్కారులో చీలికకు దారి తీశాయని తెలుస్తోంది.
అంతేకాకుండా, శుక్రవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న షిండే.. ‘‘నన్ను తేలికగా తీసుకోకండి.. నన్ను తేలికగా తీసుకున్న వారితో నేను ఇప్పటికే చెప్పాను. నేను సాధారణ పార్టీ కార్యకర్తని.. కానీ, బాలాసాహెబ్ కార్యకర్తను కూడా. 2022లో నేను ప్రభుత్వాన్ని మార్చాను. అందుకే నేను చెబుతున్నా.. నన్ను తేలికగా తీసుకోకండి" అంటూ హెచ్చరించారు. కాగా, బీజేపీ నేత ఆశిష్ షెలార్ దీనిని తోసిపుచ్చారు. కూటమిలో, ఎలాంటి చీలిక లేదని, ప్రభుత్వం ఐక్యంగా నడుస్తోందన్నారు.