
ఖానాపూర్, వెలుగు: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రూ.25 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్ తెలిపారు. స్థానిక మున్సిపల్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. నూతనంగా ఏర్పాటైన ఈ మున్సిపాలిటీకి మంజూరైన ఈ నిధులతో పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతామని ఆయన పేర్కొన్నారు.
అనంతరం మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్పాలకవర్గం, స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం ముందు బీఆర్ఎస్ నేతలు సీఎం కేసీఆర్ ఫొటోలకు క్షీరాభిషేకం చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖలీల్, కౌన్సిలర్లు సంతు, జన్నారపు శంకర్, సురేశ్, తొంటి శ్రీను, నాయకులు డాక్టర్ కేహెచ్ ఖాన్, మెహరాజ్, మున్సిపల్ కమిషనర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.