
హైదరాబాద్, వెలుగు : మట్టిలో మాణిక్యాలను గుర్తించి, వారి ప్రతిభకు ప్రోత్సాహం కల్పించే స్పష్టమైన లక్ష్యాలతో రాష్ట్ర ప్రభుత్వం నూతన స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తుందని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్ శివసేనా రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అట్టడుగు స్థాయి నుంచి క్రీడలను ప్రోత్సహించి, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు నెగ్గేందుకు శిక్షణ అందించేలా కొత్త పాలసీ ఉంటుందన్నారు. స్పోర్ట్స్ పాలసీ ముసాయిదా కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కమిటీ బుధవారం హైదరాబాద్ లో సమావేశమైంది.
ప్రభుత్వ క్రీడా సలహాదారు జితేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన తొలి సమావేశంలో శివసేనా రెడ్డి, క్రీడా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ వీసీ ఎండీ సోనీ బాలాదేవి, ప్రముఖ కోచ్లు పుల్లెల గోపీచంద్, ఇస్మాయిల్ బేగ్, ఒలింపిక్ సంఘం ప్రతినిధులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు. స్పోర్ట్స్ క్యాలెండర్ అమలు
నిర్వహణతో పాటు స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ ఏర్పాటుకు ఉన్న అవకాశాలు గుర్తించి, క్రీడలను ప్రోత్సహించడంలో ఐటీ, ఫార్మా, ఇతర ప్రముఖ కార్పొరేట్ సంస్థలను భాగం చేయాలని సూచించారు. కమిటీ తదుపరి సమావేశం పది రోజుల తర్వాత నిర్వహించాలని నిర్ణయించారు.