
శ్రావణ మాసం అంటే పండుగల మాసం. వర్షరుతువుతో పరిసరాలు పచ్చగా కళకళలాడే కాలం. ఇళ్లన్ని పూజాధికాలతో శోభిల్లే కాలం. అటువంటి శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, నోములు, వ్రతాలతో ఇళ్లన్నీ ఆధ్యాత్మిక శోభతో నిండిపోతుంటాయి. మహిళలు పూజలు చేస్తు భక్తి నిండిన మనస్సులో ఉంటారు. మహిళలు కళకళలాడుతుంటే ఆ ఇల్లే సౌభాగ్యాలతో వర్ధిల్లుతుందంటారు. కాబట్టి శ్రావణ మాసం అంటే పూజలే కాదు ఆనందాల కాలం. లక్ష్మీదేవి ఇళ్లల్లో కొలువుండే మాసం. ఆమెకు అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణమాసం. అందుకే వ్రతాలు, నోములు నోచుకునే మహిళలు శ్రావణమాసంలో నిర్వహించుకుంటారు.
అలా ప్రతీ ఏడాది వచ్చే శ్రావణమాసానికి ఈ 2023లో శ్రావణ మాసానాకి తేడా ఉంది. ఎందుకంటే 2023లో రెండు శ్రావణమాసాలు వచ్చాయి. అంటే అధిక శ్రావణం అన్నమాట. కానీ అధిక శ్రావణంలో పూజలు వంటివి చేయరు. తరువాత వచ్చే నిజ శ్రావణంలోనే పూజలు, వ్రతాలు, శుభకార్యాలు చేసుకోవాలని చెబుతున్నారు పండితులు. అలా ఈ ఏడాది వచ్చిన శ్రాణమాసం 19 ఏళ్లకు వచ్చింది. దీనినే అధిక శ్రావణం అంటారు. తెలుగు పంచాంగం ప్రకారం.. (ఇంగ్లీషుల నెలల ప్రకారంగా చూస్తే) నిజ శ్రావణమాసం ఆగస్టు 17వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు నిజ శ్రావణం ఉంటుంది. శ్రావణ మాసం దక్షిణాయనంలో వచ్చే విశిష్టమైన మాసాల్లో ఒకటిగా భావిస్తారు. ఈ మాసంలో శివయ్యకు పూజలు చేస్తే మంచి శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి మూడేళ్ల తరువాత అదనపు నెల వస్తుంది. దీనినే అధికమాసం లేదా శూన్య మాసం అని కూడా అంటారు.
నిజ శ్రావణమాసంలో చేసుకునే వ్రతాలు, పూజల వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం..శ్రావణ మాసం లక్ష్మీ ప్రదమైనమాసం.. శ్రావణ మాసం స్థితికారుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైనది ఈ శ్రావణమాసం. అనేక రకములైన వ్రతములు, నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే శ్రావణ మాసం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రావణ నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణమాసంలో శ్రీమహావిష్ణువుకు చేసే పూజలు అనంత పుణ్యములను ఇస్తాయి.
మంగళగౌరీ వ్రతం ( ఆగస్టు 22, 29, సెప్టెంబర్ 5,12) : శ్రావణ మాసం మందు ఆచరించ వలసిన వ్రతములలో మొదటిది మంగళగౌరీ వ్రతం. ఈ నెలలో ( శ్రావణ మాసంలో) వచ్చే నాలుగు మంగళవారాలు మంగళ గౌరీని పూజించాలి. పార్వతి దేవికి మరొక పేరు (గౌరీ ) మంగళ గౌరీ. సాధారణంగా కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు ఈ వ్రతాన్ని చేస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన ఐదవతనం కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ఈ వ్రతాన్నిగురించి స్వయంగా శ్రీ కృష్ణుడు ద్రౌపదికి వివరించినట్లు పురాణాలు పేర్కొన్నాయి.
ఒకసారి ద్రౌపది శ్రీకృష్ణుడిని అడిగిందట..అన్నా ... మహిళలకు వైధవ్యం కలగని వ్రతం ఏదైనా ఉంటే చెప్పమని కోరిందని పురాణాల్లో ఉందని వేదపండితులు చెబుతున్నారు. దానికి ఆ ఆదిదేవుడి సోదరైన ద్రౌపదికి మంగళ గౌరీ వ్రతం గురించి చెప్పాడని స్కంద పురాణంలో చెప్పబడింది. మంగళగౌరీ అనగా మహాదేవత..ఆ ఆదిపరాశక్తికి ప్రతిరూపం. ఆ వ్రతం చేసిన వారి భర్తలు చల్లగా ఉంటారని చెప్పాడట. అలా ద్రౌపది మంగళగౌరీ వ్రతం ఆచరించిందట..కురుక్షేత్రం తరువాత పంచపాండవల పత్ని అయిన ద్రౌపది భర్తల కంటే ముందే పరమపదించిందని పురాణాలు చెబుతున్నాయి. అలా ఆమె సౌభాగ్యవతిగా స్వర్గానికి చేరుకుందట.
వరలక్ష్మీ వ్రతం ( ఆగస్టు 25) : శ్రావణ మాసంలో మహిళలకు అతి ముఖ్యమైన ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను. ఈ రోజున( ఆగస్టు 25) వరలక్ష్మీ దేవతను పూజిస్తే అష్టలక్ష్మీ పూజలకు సమానం అనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా పాలుపంచుకుంటారు. ఈ దేవతను పూజిస్తే అష్టైశ్వర్యాలు అయిన సంపద, భూమి, శిక్షణ, ప్రేమ, కీర్తి, శాంతి, సంతోషం మరియు శక్తి వంటివి లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం.
శుక్ల చవితి- నాగచతుర్థి ( ఆగస్టు 20) : దీపావళి తర్వాత జరుపుకొనే నాగులచవితి లాగ, మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలందు ఈరోజును ( ఆగస్టు 20) నాగులచవితి పండుగలా నాగ దేవత పూజలను చేస్తారు. రోజంతా ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి, నాగ దేవతను పూజిస్తారు. దుర్వాయుగ్మ వ్రతం చేయడానికి కుడా విశేషమైన రోజు ఈ శుక్ల చవితి.
శుక్ల ఏకాదశి- పుత్రదా ఏకాదశి ( ఆగస్టు 27) : శ్రావణశుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి లేదా లలిత ఏకాదశి అంటారు. ఆరోజున గొడుగు దానమిస్తే విశేష ఫలితాన్ని పొందుతారని పండితులు చెడుతున్నారు. పుత్ర సంతానాన్ని కోరుకొనేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచి ఫలితాలు వస్తాయని శివ పురాణంలో ఉందని ఆధ్యాత్మిక వేత్తలు పలు వేదికల్లో చెప్పారు.
శ్రావణ పూర్ణిమ–రాఖీపూర్ణిమ ( ఆగస్టు 31) : అన్న/తమ్ముని శ్రేయస్సుని కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుని చేతికి రాఖీ కట్టే పండుగే ఈ రాఖీ పూర్ణిమ. సోదరునికి రాఖీ కట్టి, నుదుట బొట్టు పెట్టి అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరిని ఆశీర్వదించి కానుకలివ్వడం ఆనవాయితీ. ఈ రోజునే బ్రాహ్మణ, క్షత్రియ & వైశ్యులు తమ పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం. అందుచేత ఈ రోజును జంధ్యాల పూర్ణిమ అనికూడా అంటారు.
పూర్ణిమ – హయగ్రీవ జయంతి ( ఆగస్టు 31): యుగయుగాలలో లోక పాలనకై, ధర్మ సంస్థాపనకై విష్ణువు అనేక అవతారాలను దాల్చాడని ప్రజలు విశ్వశిస్తుంటారు. అలాంటి అనేక అవతారాల్లో దశావతారాలు ప్రసిద్ధి.. వాటిల్లో ముఖ్యమైనవి నరసింహస్వామి, రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వరస్వామి ఈ అవతారాల్లో భక్తులతో పూజలను అందుకుంటున్నాడు. అయితే తన భక్తుల కోసం విష్ణువు దాల్చిన అవతారల్లోకి ఒకటి ‘హయగ్రీవావతారం’ ఒకటి. ఈరోజునే శ్రీమహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. హయగ్రీవుడు జన్మించిన ఈ రోజును హయగ్రీవ జయంతిగా జరుపుకొని, హయగ్రీవుడిని పూజించి శనగలు, ఉలవలతో గుగ్గిళ్ళు చేసి నైవేద్యం సమర్పించడం సర్వ శ్రేష్టమని బ్రాహ్మణులు చెబుతున్నారు.
కృష్ణవిదియ- శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి ( సెప్టెంబర్ 1) :మంత్రాలయంలో శ్రీ గురు రాఘవేంద్రస్వామి జయంతిని పురస్కరించుకొని విశేష పూజలను చేస్తారు. అంతే కాదు. క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సర, శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామి వారు సజీవంగా సమాధిలో ప్రవేశించారని ప్రాచీన గ్రంధాలలో పేర్కొనబడినది. కాబట్టి గురు రాఘవేంద్ర స్వామి ఆరాధన ఉత్సవాలు శ్రావణమాసంలో జరుపుతారు. అంటే జులై ఆగస్టుల్లో నిర్వహిస్తారు.
కృష్ణపక్ష అష్టమి – శ్రీకృష్ణాష్టమి ( సెప్టెంబర్ 7):శ్రీమహావిష్ణువు యోక్క ఎనిమిదో అవతారమే శ్రీకృష్ణ అవతారం. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన శుభదినమే ఈ శ్రీకృష్ణాష్టమి. దీనినే జన్మాష్టమి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఉదయం ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు, వెన్నలను సమర్పించడం అనంతరం ఉట్టిని కొట్టడం అనేది ఆచారంగా వస్తోంది.
కృష్ణపక్ష ఏకాదశి–కామిక ఏకాదశి ( సెప్టెంబర్ 10): ఇక బహుళ పక్షంలో వచ్చే ఏకాదశే కామిక ఏకాదశి. ఈరోజున నవనీతమును(వెన్న) దానం చేయాలని పెద్దలు అంటారు. తద్వారా ఈతి బాధలు పోయి, కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి.
పోలాల అమావాస్య ( సెప్టెంబర్ 14): పోలాల అమావాస్యను మహిళలు శ్రావణ మాసములో అమావాస్య రోజున జరుపుకుంటారు. సంతానాన్ని కోరుకునే ఇల్లాళ్లు దీనిని చేసుకోవాలని పెద్దలు చెబుతుంటారు. కాలక్రమేణా పోలాల అమావాస్య అన్న పేరు కాస్తా, పోలేరు అమావాస్య గా మారి, పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి