- టీ20 వరల్డ్కప్ ముంగిట ఆ జట్టును చూసి టీమిండియా నేర్చుకోవాల్సిన పాఠాలెన్నో
ఓవైపు దేశంలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం. ఆతిథ్య హక్కులు తమవే అయినా ఆసియా కప్ను సొంతగడ్డపై నిర్వహించలేని పరిస్థితి. ఇంకోవైపు ఐదారేళ్లుగా ఆటలో అట్టడుగు స్థాయికి పడిపోతున్న వైనం. పైగా, ఆరంభ మ్యాచ్లోనే చిన్న జట్టు అఫ్గానిస్తాన్ చేతిలో అవమానం. ఇలా మైదానం లోపల, బయట గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్న శ్రీలంక ఆసియా కప్ గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేకపోయారు. కానీ, లంక మాత్రం అద్భుతం చేసింది. ప్రతీ ఆటగాడు ఓ సైనికుడిలా.. ప్రాణం పెట్టి పోరాడటంతో ఆరోసారి ఆసియా విజేతగా నిలిచిన శ్రీలంక దేశ ప్రజల్లో ఆనందాన్ని నింపింది. దాంతో పాటు పతనావస్థలోకి వెళ్తున్న తమ క్రికెట్కు కొత్త ఊపిరి అందించింది. అదే సమయంలో సూపర్ స్టార్లతో నిండిన టీమిండియా.. ఫేవరెట్గా బరిలోకి దిగి బొక్కబోర్లా పడింది. మరి, తొలి మ్యాచ్ ఓడిన తర్వాత గొప్పగా పుంజుకునేందుకు శ్రీలంక ఏం చేసింది? ఇండియా సూపర్4లోనే ఇంటిదారి పట్టడానికి కారణాలేంటి? వచ్చే నెలలో టీ20 వరల్డ్ కప్ రూపంలో అతి పెద్ద సవాల్ ముందున్న నేపథ్యంలో ఆసియా కప్లో మన జట్టు తమ తప్పిదాలను తక్షణమే సరిదిద్దుకోవాలి. అలాగే, ఆసియా కప్లో లంక సక్సెస్ నుంచి కొన్ని విషయాల్లో పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
తుది జట్టు ఎంపిక
శ్రీలంక టైటిల్ గెలవడానికి అత్యంత కీలకమైన అంశం సరైన తుది జట్టు ఎంపిక. ఓ సెట్ ప్లేయర్లకు మద్దతు ఇవ్వడంతో పాటు టోర్నీ అసాంతం స్థిరమైన తుది జట్టును కొనసాగించడం లంకకు చాలా హెల్ప్ అయింది. టోర్నీలో ఆరు మ్యాచ్ల్లో టాపార్డర్ బ్యాటర్ చరిత్ అసలంక, పేసర్లు అసిత ఫెర్నాండో, మతీషా పతిరనను మాత్రమే ప్రయత్నించి తప్పించింది కానీ, ఇండియా మాత్రం దాదాపు ప్రతీ మ్యాచ్లో మార్పులు చేసింది. టీ20 వరల్డ్కప్ గురించి ఆలోచిస్తూ రోహిత్, ద్రవిడ్ ఆడుతున్న టోర్నీలో చేతులు కాల్చుకున్నారు. పంత్ (4 మ్యాచ్లు), కార్తీక్ (3 మ్యాచ్లు)లో ఎవరికి మొగ్గు చూపాలో తేల్చుకోలేకపోయారు. థర్డ్ పేసర్ స్థానాన్ని భర్తీ చేయడంతో పాటు, స్పిన్నర్లు అశ్విన్ (2 మ్యాచ్లు), రవి బిష్ణోయ్ (1 మ్యాచ్) విషయంలోనూ కచ్చితమైన అంచనాకు రాలేకపోయారు. ఇండియా ఫైనల్ ఎలెవన్ ఏ దశలోనూ సెటిల్డ్గా కనిపించలేదు. జడేజా స్థానంలో దీపక్ హుడా (3 మ్యాచ్లే)ను తీసుకుంటే తను ఫెయిలయ్యాడు. అవేశ్ గాయపడితే సూపర్ 4 దశలో దీపక్ చహర్ను జట్టులో చేర్చినా అతడిని ఆడించకపోవడం చేటు చేసింది. ఏ ఫార్మాట్లో అయినా తుది జట్టును అదే పనిగా మార్చడం వల్ల లాభం ఉండబోదు. నిలకడైన జట్టు ఉంటే మంచి ఫలితం రాబట్టవచ్చని శ్రీలంక నిరూపించింది. కాబట్టి ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్లను ఉపయోగించుకొని వరల్డ్ కప్కు ఫస్ట్ చాయిస్ ప్లేయర్లతో ప్లేయింగ్ ఎలెవన్ను ఎంచుకుంటే మంచిది.
బౌలింగ్ పదును
శ్రీలంక ఆరంభం నుంచి స్పిన్నర్లు హసరంగ (9 వికెట్లు), తీక్షణ (6 వికెట్లు)ను తమ ప్రధాన బౌలర్లుగా ప్రయోగించింది. వాళ్లకు సపోర్ట్గా పేసర్లు చమిక కరుణరత్నె, మదుషంక కలిసి 13 వికెట్లు పడగొట్టారు. ఇండియా ముగ్గురు ప్రధాన పేసర్లతో (భువనేశ్వర్, అర్ష్దీప్, అవేశ్ ఖాన్) బరిలోకి దిగింది. కానీ, అవేశ్ తీవ్రంగా నిరాశ పరచడంతో ఆల్రౌండర్ హార్దిక్తో ఫుల్ కోటా వేయించాల్సి వచ్చింది. కానీ, మెయిన్ పేసర్ లోటును పాండ్యా భర్తీ చేయలేకపోయాడు. ఈ టోర్నీలో తను 4 వికెట్లు తీస్తే మూడు పాక్తో తొలి మ్యాచ్లోనే వచ్చాయి. జడేజా గాయంతో వైదొలగడంతో కాంబినేషన్ విషయంలో సమస్యలు వచ్చాయి. అశ్విన్, చహల్ తమ స్థాయి మేరకు రాణించలేకపోయారు. వరల్డ్కప్ కోసం పేస్ లీడర్ బుమ్రా, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ హర్షల్ తిరిగి రావడంతో పేస్ బలం పెరుగుతుంది. వీళ్లకు తోడు భువీ, మరో ఇద్దరు ప్రధాన స్పిన్నర్లతో పర్ఫెక్ట్ కాంబినేషన్ను రెడీ చేసుకుంటేనే వరల్డ్కప్లో ఇండియా నుంచి మంచి ఫలితం ఆశించొచ్చు.
టీమ్ పెర్ఫామెన్స్పై బోర్డు రివ్యూ
ఆసియాకప్లో టీమిండియా పెర్ఫామెన్స్పై బీసీసీఐ బాస్ గంగూలీ, సెక్రటరీ జై షా.. సెలెక్షన్ కమిటీతో సమీక్ష చేశారు. మిడిల్ ఓవర్లలో స్లో బ్యాటింగ్ జట్టును దెబ్బ తీసిందని గుర్తించారు. 7–15 ఓవర్ల మధ్య స్పిన్నర్లను ఎదుర్కోవడంలో మన బ్యాటర్లు ఇబ్బంది పడుతున్నారని, వరల్డ్ కప్ సమీపిస్తున్న నేపథ్యంలో ఈ సమస్యను తక్షణమే పరిష్కరించాలని బోర్డు అభిప్రాయపడింది.
పవర్ హిట్టింగ్
లంక ఓపెనర్లు పాథుమ్ నిశాంక, కుశాల్ మెండిస్ దాదాపు అన్ని మ్యాచ్ల్లో జట్టుకు బలమైన పునాది వేశారు. తర్వాత డెత్ ఓవర్లలో భానుక రాజపక్స, దసున్ షనక, హసరంగ పవర్ హిట్టింగ్తో మంచి స్కోర్లు చేయడంతో పాటు పెద్ద టార్గెట్లను లంక కరిగించింది. నిశాంక, మెండిస్ వరుసగా 173, 155 రన్స్ చేస్తే.. రాజపక్స దాదాపు 150 స్ట్రయిక్ రేట్తో 191 రన్స్తో సత్తాచాటాడు. హసరంగ, షనక కూడా 140 ప్లస్ స్ట్రయిక్ రేట్తో చివర్లో విలువైన రన్స్ అందించడంతో లంక విజయాలు సులువయ్యాయి. పాక్తో ఫైనల్లో 58/5తో నిలిచి వంద రన్స్ చేస్తే గొప్పే అనుకున్న లంక భారీ టార్గెట్ నిర్దేశించిందంటే రాజపక్స, హసరంగ పవర్ హిట్టింగే కారణం. ఇండియా టీమ్లో ఇదే లోపించింది. రోహిత్ 4 ఇన్నింగ్స్ల్లో 133 రన్స్ మాత్రమే చేయగా.. భారీ షాట్లు ఆడే టాలెంట్ ఉన్న లోకేశ్ రాహుల్ కేవలం 122 స్ట్రయిక్ రేట్తో 132 రన్స్తో సరిపెట్టాడు. హార్డ్ హిట్టర్ హార్దిక్ 3 ఇన్నింగ్స్ల్లో కేవలం 50 రన్సే చేశాడు. ఫినిషర్ రోల్ను అప్పగించిన దినేశ్ కార్తీక్కు సరిగ్గా బ్యాటింగ్ చేసే చాన్సే రాలేదు. రిషబ్ పంత్ తన స్టయిల్కు భిన్నంగా నింపాదిగా బ్యాటింగ్ చేశాడు. కోహ్లీ (147.59 స్ట్రయిక్ రేట్తో 276) తప్పితే మిగతా బ్యాటర్లంతా హిట్టింగ్ చేయలేకపోయారు. పించ్–హిట్టింగ్ అనేది ఇండియాకు చాన్నాళ్ల నుంచి సమస్యగా ఉంది. టీ20 ఫార్మాట్లో పరిస్థితులు చాలా వేగంగా మారుతాయి. కాబట్టి వరల్డ్కప్ లో రోహిత్, రాహుల్తో పాటు డెత్ ఓవర్లలో హార్దిక్, పంత్ దూకుడుగా ఆడాల్సిన అవసరం ఉంది. బ్యాటింగ్లో తమ అప్రోచ్ మార్చుకొని హిట్టింగ్ చేయకపోతే ఆస్ట్రేలియాలోనూ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.