
శ్రీరామ.. నీ నామమెంత రుచిరా.. అని పాడుకోవడమే కాదు. శ్రీరామ నవమికి పసందైన వంటకాలు చేసుకుని.. వాటిని ఆరగిస్తూ నవమిని మరింత సంతోషంగా జరుపుకోవచ్చు. ఇవన్నీ తెలిసిన వంటకాలే. అయినా.. మరోసారి మీ కోసం...
పానకం తయారీకి కావలసినవి:
- బెల్లం: ఒక కప్పు
- నీళ్లు లీటర్
- మిరియాల పొడి : ఒక టీ స్పూన్
- అల్లం పొడి :ఒక టీ స్పూన్
- యాలకులు :ఒక టీ స్పూన్
తయారీవిధానం: లీటర్ నీళ్లలో తురిమిన బెల్లం కరిగేవరకు కలపాలి. అందులో యాలకుల పొడి, మిరియాల అల్లం పొడి వేసి బాగా కలిపితే పానకం రెడీ.
వడపప్పు తయారీకి కావలసినవి
- పెసరపప్పు: అర కప్పు
- బెల్లం: కొంచెం
తయారీ విధానం: పెసరపప్పు గంట నానబెట్టాలి. నీళ్లు వడకట్టి పెసరపప్పుని ఒక గిన్నెలో తీసుకొని కొంచెం బెల్లం.. కలుపుకుంటే వడపప్పు సిద్ధం
చలిమిడి తయారీకి కావలసినవి
- బియ్యప్పిండి: ఒక కప్పు
- చక్కెర లేదా బెల్లం తురుము: ముప్పావు కప్పు
- తురుమిన కొబ్బరి తురుము :పావు కప్పు
- చక్కెర పొడి: అర టేబుల్ స్పూన్
- నెయ్యి: ఒక టేబుల్ స్పూన్
తయారీ విధానం: ముందుగా నెయ్యి వేడి చేసి చల్లార్చాలి. అందులో చక్కెర లేదా తురిమిన బెల్లం, కొబ్బరి వేసి బాగా కలపాలి. తర్వాత బియ్యప్పిండి వేసి మరోసారి బాగా కలపాలి. పిండి దగ్గరకు అయ్యాక గిన్నెలో తీసుకోవాలి
చక్కెర పొంగలి తయారీకి కావలసినవి
- బియ్యం: ఒక కప్పు
- పెసరపప్పు :అరకప్పు
- పాలు: ఒక కప్పు
- చక్కెర: అర కప్పు
- జీడిపప్పు :ఎనిమిది
- కిస్మిన్ :ఎనిమిది
- కొబ్బరి ముక్కలు: అర కప్పు
- యాలకుల పొడి :ఒక టేబుల్ స్పూన్
- నెయ్యి :ఐదు టేబుల్ స్పూన్లు
తయారీ విధానం : పాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేగించాలి. ఇందులో శుభ్రంగా కడిగిన బియ్యంతో పాటు నాలుగు గ్లాసుల నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి. తర్వాత పాలు, చక్కెర వేసి మరికొద్ది సేపు ఉడికించి యాలకుల పొడి కలపాలి. మరో పాన్ లో నెయ్యి వేసి జీడిపప్పు, కొబ్బరి ముక్కల తరుగు, కిస్మిస్ వేగించి.. ఉడికించి పొంగలిలో కలపాలి.
వడ తయారీకి కావలసినవి
- మినప్పప్పు: ఒక కప్పు
- ఉల్లిపాయ తరుగు: ముప్పావు కప్పు
- అల్లం ముక్క: ఒకటి
- పచ్చిమిర్చి: రెండు
- ఇంగువ: చిటికెడు
- కరివేపాకు: రెండు రెమ్మలు
- కొత్తిమీర :ఒక కప్పు
- నూనె: వేగించడానికి సరిపడా
- ఉప్పు: తగినంత
తయారీ విధానం: మినప్పప్పు బాగా కడిగి రెండు గంటలు నానబెట్టి నీళ్లు వడకట్టాలి. ఇందులో కొద్దిగా పప్పు తీసుకొని ఉప్పు కలిపి కచ్చాపచ్చాగా రుబ్బాలి. మిగిలిన పప్పును మెత్తగా రుబ్బాలి. ఈ రెండిటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ తరుగు, అల్లం, వెచ్చిమిర్చి తరుగు, ఇంగువ, కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలపాలి. సన్నని మంట మీద పాన్ పెట్టి నూనె వేడి చేయాలి. ముందుగా చేసుకున్న పిండిని కొద్దిగా తీసుకుని వడలా చేసి కరకరలాడే వరకు నూనెలో వేగించాలి. పరుప్పు వడలు కొబ్బరి, పల్లీ, టొమాటో చట్నీలతో తింటే రుచిగా ఉంటాయి
శెనగలు, రవ్వ పులిహోర తయారీకి కావలసినవి
- బియ్యంరవ్వ: ఒక కప్పు
- నీళ్లు: రెండు కప్పులు,
- ఉడికించిన కాబూలీ శెనగలు :అర కప్పు
- మినప్పప్పు: రెండు టీ స్పూన్లు
- వచ్చి శెనగపప్పు: రెండు టీ స్పూన్లు
- పల్లీలు :రెండు టీ స్పూన్లు
- ఆవాలు: పావు టీ స్పూన్
- జీలకర్ర: పావు టీస్పూన్
- ఇంగువ: కొద్దిగా
- పసుపు: చిటికెడు
- నిమ్మరసం: ఒకటీ స్పూన్
- ఎండుమిర్చి: రెండు
- పచ్చిమిర్చి :రెండు
- కరివేపాకు: రెండు రెబ్బలు
- ఉప్పు :తగినంత
- నూనె :మూడు టీస్పూన్లు
తయారీ విధానం : రెండు కప్పుల నీటిలో బియ్యంరవ్వ. పసుపు, కొద్దిగా ఉడికించాలి. తర్వాత ఒక పాన్ లో రెండు టీ స్పూన్ల నూనె వేసి ఎండుమిర్చి, మినప్పప్పు, పచ్చి శెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, పల్లీలు, ఇంగువ, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉడికించిన కాబూలీ శెనగలు వేసి వేగించాలి. మరో గిన్నెలో ఉడికించిన బియ్యం రవ్వ, వేగించిన పోపు మిశ్రమం వేసి తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. చివరిగా నిమ్మరనం కలుపుకుంటే శెనగల రవ్వ పులిహార రెడీ. . .
చింతపండు పులిహోర తయారీకి కావలసినవి
- బియ్యం: అర కిలో
- చింతపండు: వంద గ్రాములు
- ఎండుమిర్చి: 25
- శెనగపప్పు :రెండు టేబుల్ స్పూన్లు
- మినప్పప్పు: రెండు టేబుల్ స్పూన్లు
- ఆవాలు: ఒకటీస్పూన్
- ఇంగువ: ఒకటీస్పూన్
- ఉప్పు: రుచికి సరిపడా
- పసుపు: ఒక టీస్పూన్
- నువ్వుల నూనె :రెండు వందల గ్రాములు
- ధనియాలు: ఒక టేబుల్ స్పూన్
- జీలకర్ర: అరటీస్పూన్
- మెంతులు: అరటీస్పూన్
- పల్లీలు లేదా జీడిపప్పు: యాభై గ్రాములు
- కరివేపాకు :పది రెమ్మలు
తయారీ విధానం : ఉడికించిన అన్నంలో రెండు టేబుల్ స్పూన్ నువ్వుల నూనె వేసి పక్కన పెట్టాలి. తర్వాత చింతపండులో తగినన్ని నీళ్లు పోసి నానబెట్టి చిక్కని గుజ్జు తీయాలి. చిన్న పాన్ లో మెంతులు వేగించి పొడి చేయాలి. మరో పాన్లో నువ్వుల నూనె వేసి పప్పులు, ఎండుమిర్చి, పసుపు, ఆవాలు వేగించాలి. తర్వాత చింతపండు గుజ్జు వేసి చిన్న మంట మీద ఉడికించాలి. ఇందులో కరివేపాకు, ఇంగువ, ఉప్పు వేసి ఉడికించాలి చింతపండు గుజ్జు దగ్గరగా అయిన తర్వాత చల్లార్చాలి. ఇందులో మెంతిపొడివేసి బాగా కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని అన్నంలో వేసి కలపాలి.
మామిడికాయ రసం తయారీకి కావలసినవి
- పచ్చి మామిడికాయ (చిన్నది) ఒకటి
- టొమాటోలు రెండు
- కందిపప్పు: రెండు టేబుల్ స్పూన్లు
- కరివేపాకు: నాలుగు రెబ్బలు
- ఎండు మిర్చి: రెండు
- మిరియాలు :అర టీ స్పూన్
- ధనియాలు :ఒక టీ స్పూన్
- జీలకర్ర ఒక టీ స్పూన్,
- అల్లం తురుము ఒక టీ స్పూన్,
- వెల్లుల్లి తురుము ఒక టీ స్పూన్,
- ఆవాలు అరటీస్పూన్
- పసుపు: ఒకటేస్పూన్
- నూనె :నాలుగు టీస్పూన్లు
తయారీవిధానం: పాన్ లో మిరియాలు, ధనియాలు, జీలకర్ర వేగించి పొడి చేయాలి. తర్వాత మామిడి కాయతొక్కు తీసి ముక్కలు కోసి గుజ్జులా ఉడికించాలి కందిపప్పు, టొమాటో ముక్కల్ని కూడా విడిగా ఉడికించాలి. టొమాటో గుజ్జులో అల్లం, వెల్లుల్లి తురుము, రసం పొడితో పాటు నీళ్లు పోసి మరిగించాలి. ఈ మిశ్రమాన్ని పలుచని వస్త్రంలో వేసి వడకట్టాలి. ఇందులో మామిడి కాయ గుజ్జు, మెత్తగా ఉడికించిన పప్పు, ఉప్పు వేసి ఐదు నిమిషాలు మరిగించి పక్కన పెట్టాలి. మరో పాన్ కొద్దిగా నూనె వేసి ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు. కొంచెం పసుపు వేగించి. రసంలో కలుపుకుంటే చాలు ..
దద్దోజనం తయారీకి కావలసినవి
- బియ్యం: అర కప్పు
- నీళ్లు: ఒకటిన్నర కప్పులు
- పెరుగు: ఒక కప్పు
- పాలు:పావు కప్పు
- పచ్చిమిర్చి: రెండు
- అల్లం: ఒకటిన్నర టీ టీస్పూన్
- పచ్చి శెనగపప్పు :ముప్పావు టీ స్పూన్
- కరివేపాకు: రెండు
- ఇంగువ: చిటికెడు
- నూనె: రెండు టీ స్పూన్లు
- ఎండుమిర్చి : రెండు
తయారీ విధానం : బియ్యం శుభ్రంగా కడిగి ఒకటిన్నర కప్పుల నీళ్లు పోసి నాలుగు విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో ఉడికించి.. కొంచెం వేడిగా ఉన్నప్పుడే పాలు పోసి చల్లారనివ్వాలి. తర్వాత పెరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. పాన్ లో నూనె వేసి ఆవాలు, పచ్చి శెనగపప్పు, మినప్పప్పు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, ఎండుమిర్చి, ఇంగువ వేగించాలి. ఈ తాలింపు పెరుగన్నంలో వేసి బాగా కలిపి దానిమ్మ గింజలతో అలంకరించాలి.
►ALSO READ | Sriramanavami 2025: రాముడికి అక్క ఉంది.. ఆమె ఎక్కడ పెరిగింది... పురాణాల్లో ఆమె గురించి ఏముంది..