
మెదక్ జిల్లా శివ్వంపేట మండల కేంద్రంలోని ఎస్టీ బాయ్స్ హాస్టల్ అస్తవ్యస్తంగా మారింది. రెండేళ్లుగా బిల్లులు రాకపోవడంతో ఎలాంటి మెయింటెన్స్ చేయడం లేదు. హాస్టల్లోని బాత్రూమ్లకు డోర్లు ఊడిపోయాయి. ట్యాప్లు లేవు. స్టూడెంట్లే డోర్లను అడ్డుగా పెట్టుకుని మల, మూత్ర విసర్జనకు వెళ్తున్నారు. చలికి వణుకుతూనే ఆరుబయట స్నానాలు చేస్తున్నారు. ఎలాంటి వాటర్హీటర్లు లేవు. హాస్టల్లోని మినరల్వాటర్ప్లాంట్ చెడిపోయి రెండేళ్లు అవుతోంది. ఫండ్స్లేక ఇప్పటి వరకు రిపేర్చేయించలేదు. చేసేదేం లేక చిన్నారులు నల్లా నీళ్లనే తాగుతున్నారు.
గతేడాది అక్టోబర్ లో ప్రభుత్వం నుంచి రావాల్సిన బ్లాంకెట్లు ఇంతవరకు అందలేదు. స్టూడెంట్లు పాత వాటినే వాడుకుంటున్నారు. హాస్టల్ బిల్డింగ్ చుట్టూ కాంపౌండ్ వాల్ లేదు. దీంతో పక్కనే ఉన్న పంచాయతీ వాటర్ ట్యాంక్ నుంచి లీకైన నీరు నేరుగా హాస్టల్ ఆవరణలోకి చేరుతోంది. డెయిలీ పందులు, కుక్కలు, గేదెలు వచ్చి వాటిలో పొర్లుతున్నాయి. మురుగు నీరు దోమలు, ఈగల ఆవాసంగా మారింది.
ఉన్నతాధికారులు స్పందించి బిల్లులు రిలీజ్చేయాలని, హాస్టల్లో రిపేర్లు చేయించాలని స్టూడెంట్లు కోరుతున్నారు. చిన్నారుల ఇబ్బందులు చూడలేక వార్డెన్ గతేడాది సొంత ఖర్చుతో ఫ్యాన్లను రిపేర్ చేయించారు. బల్బులు తెప్పించి అమర్చారు. ఇక్కడ మొత్తం 180 మంది ఎస్టీ స్టూడెంట్లు ఉంటున్నారు. స్థానిక స్కూల్లో చదువుకుంటున్నారు.
వెలుగు, శివ్వంపేట