ఓరుగల్లులో యూజీడీపై ఫోకస్​

 ఓరుగల్లులో  యూజీడీపై ఫోకస్​
  • డీపీఆర్ తయారు కోసం ప్రైవేటు కన్సల్టెన్సీ  సర్వే
  • ప్రతిసారీ ఎన్నికల హామీగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
  • సీఎం చొరవతో ముందడుగు

వరంగల్​, వెలుగు: ఓరుగల్లులో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ (యూజీడీ) ఏర్పాటుపై రాష్ట్ర సర్కార్​ ఫోకస్​ పెట్టింది. ​వరంగల్​నగరానికి దాదాపు 30 ఏండ్ల కింద రావాల్సిన యూజీడీ ప్రాజెక్ట్​ సమైక్య రాష్ట్రంలో వెనక్కిపోయింది. అనంతరం ఉమ్మడి వరంగల్​జిల్లాలో ఏ ఎన్నికలొచ్చినా రాజకీయ పార్టీలకు ప్రచార అస్త్రంగా మారింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా రాష్ట్రంలోని రేవంత్​రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ నిర్మాణానికి అవసరమైన డీపీఆర్​ తయారీకి అడుగు వేసింది.

​ ఇందులో భాగంగా సర్వే కంపెనీలు సిటీలో పర్యటించాయి. డీపీఆర్​ తయారీకి సంబంధించి చేసే సర్వే విధానాన్ని గ్రేటర్​ పాలకమండలి, బల్దియా అధికారులకు పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ద్వారా వివరించారు. 

ప్రధానులు, సీఎంల మార్పు ఎఫెక్ట్​ 

పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా..  1996లో రూ.110 కోట్లతో డీపీఆర్​ తయారు చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించారు.  అయితే 1996 నుంచి 1998 వరకు దేశంలో అయిదుగురు ప్రధానులు మారారు. రాష్ట్రంలోనూ ఏడాది తేడాతో ఎన్​టీఆర్​, చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. దీంతో ఈ ప్రాజెక్ట్​ను ఎవరూ సీరియస్​గా తీసుకోలేదు. అయితే 2005, 2009లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా జైపాల్​రెడ్డి సమయంలో మరోసారి యూజీడీ కోసం చొరవ చూపినా ప్రాజెక్ట్​కు పూర్తిస్థాయి అడుగులు పడలేదు.  

సీఎం రేవంత్​రెడ్డి, మంత్రుల ఫోకస్​తో.. సర్వే 

అసెంబ్లీ ఎన్నికల కాంగ్రెస్​ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రేవంత్​రెడ్డి వరంగల్​ నగరానికి అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ హామీ ఇచ్చారు. పార్లమెంట్​ ఎలక్షన్​ ప్రచారంలోనూ మరోసారి ఇదే అంశంపై మాట్లాడారు.  జిల్లా ఇన్‌‌చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి జిల్లా మంత్రులు కొండా సురేఖ, సీతక్కతో కలిసి  ప్రతి రివ్యూలో అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ ఏర్పాటుపై చర్చించారు. త్వరగా డీపీఆర్​ తయారు చేయాలని పొంగులేటి అధికారులను ఆదేశించారు. ఈ నెల 20న బెంగళూర్‌‌‌‌కు చెందిన శుభ్​ కన్సల్టెన్సీ ప్రతినిధులు గ్రేటర్​ వరంగల్‌‌లో పర్యటించారు.

మేయర్​ గుండు సుధారాణి, కమిషనర్​ అశ్విని తానాజీ వాఖడే, ఎన్​పీడీసీఎల్​, ఆర్​ అండ్​ బీ, కుడా, ట్రాఫిక్​ పోలీస్​, పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డ్​. ఇరిగేషన్​, ఎన్​ఐటీ అధికారులతో సమావేశమయ్యారు. అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ, అండర్​ గ్రౌండ్​ కేబుల్స్​, అండర్​ గ్రౌండ్​ స్ట్రోమ్​ వాటర్​ డ్రైనేజీ (వరద నీటి కాలువలు), అండర్​ గ్రౌండ్​ వాటర్​ సప్లై సిస్టం, ఆక్విఫర్​ మేనేజ్​మెంట్​ ప్లాన్​ బ్లూ గ్రీన్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ రూపకల్పనపై నగరంలో వారు చేపట్టబోయే సర్వేను పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ద్వారా వివరించారు. ఈ నెల 24న గ్రేటర్​ కౌన్సిల్​ మీటింగ్ లో  మంత్రి కొండా సురేఖ, గ్రేటర్​ ఎమ్మెల్యేలు అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ ప్రాజెక్ట్​ డీపీఆర్​ అంశంపై చర్చించారు.

 2050లో జనాభా, అవసరాలను దృష్టిలో పెట్టుకుని మాస్టర్​ ప్లాన్​ ఆధారంగా అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ డీపీఆర్​ రూపొందిస్తున్నట్లు నిమగ్నమైనట్లు చెప్పారు. త్వరలోనే అధికారులు, స్టేక్​ హోల్డర్స్​లను భాగస్వామ్యం చేస్తూ విస్తృతస్థాయిలో సమావేశం  ఏర్పాటు చేయనున్నట్లు మేయర్​ 
తెలిపారు.

రెండు టర్మ్‌ లలో కేసీఆర్​హామీ.. నెరవేర్చలే  

కేసీఆర్​ 2001లో తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచే వరంగల్​ అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ అంశాన్ని రాజకీయంగా వాడుకున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో దానిని ఏర్పాటు చేసుకుంటామని ప్రచారం చేశారు. తీరా కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక 2015లో సీఎం హోదాలో గ్రేటర్​ వరంగల్లో పర్యటించారు. అప్పటికే బల్దియా గ్రేటర్​ కార్పొరేషన్​గా అవతరించింది.

కాగా, సీటీ పర్యటన అనంతరం నగరంలోని నందన గార్డెన్​లో మీటింగ్​ పెట్టి వరంగల్​ సిటీలో త్వరలోనే యూజీడీ పూర్తి చేస్తామని చెప్పివెళ్లారు. కాగా, 2023 వరకు రెండు టర్ములు రాష్ట్రంలో కేసీఆర్​ ఆధ్వర్యంలో బీఆర్​ఎస్​ ప్రభుత్వమే ఉన్నా.. వారు చెప్పినట్లు అండర్​ గ్రౌండ్​ డ్రైనేజీ ప్రాజెక్ట్​ వైపు చూడలేదు.