
- జేపీఎస్లను చర్చలకు పిలువలె
- రూల్స్ను ఉల్లంఘిస్తూ సమ్మె చేయొద్దు: ఎర్రబెల్లి దయాకర్ రావు
- ఇప్పటికైనా మించిపోయింది లేదు సమ్మె బంజేయండి
జనగామ/ పాలకుర్తి/ తొర్రూరు/హైదరాబాద్, వెలుగు: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల(జేపీఎస్)ను రాష్ట్ర ప్రభుత్వం చర్చలకు పిలువలేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. గురువారం ఆయన జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన రిలీజ్ చేశారు. జేపీఎస్ లను చర్చలకు పిలిచినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పారు.
సమస్యలపై జేపీఎస్లు తనతో ఫోన్లో మాట్లాడగా సమ్మె విరమించాలని మాత్రమే సూచించానని అన్నారు. కొందరు దీనిని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. చట్ట విరుద్ధంగా చేస్తున్న సమ్మెను వెంటనే విరమించాలన్నారు. సీఎం కేసీఆర్కు జేపీఎస్లపై మంచి అభిప్రాయం ఉందని దానిని చెడగొట్టుకోవద్దన్నారు. ప్రభుత్వాన్ని శాసించాలనుకోవడం సరికాదన్నారు. సెక్రటరీలు సమ్మె విరమిస్తే, వారి డిమాండ్లను సీఎం పరిష్కరిస్తారన్న నమ్మకం తనకు ఉందన్నారు. విధుల్లో చేరినప్పుడు సంఘాలు కట్టబోమని, యూనియన్లలో చేరబోమని, సమ్మెలు చేయబోమని, ఎలాంటి డిమాండ్లకు దిగబోమని ప్రభుత్వానికి బాండ్ రాసి ఇచ్చారన్నారు.
ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న తీరు బాగా లేదన్నారు. పైగా సోషల్ మీడియాలో చర్చలకు పిలిచినట్లు జరుగుతున్న ప్రచారాన్ని వెంటనే నిలిపివేయాలన్నారు. జేపీఎస్లు వెంటనే విధుల్లో చేరాలని కోరారు. మరోవైపు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ను రెగ్యులరైజ్ చేసి సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ఎర్రబెల్లి చెప్పారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని గెస్ట్ హౌజ్లో గురువారం మంత్రిని ఉద్యోగులు కలిసి బొకే అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఫ్లోర్ లీడర్ మంగళపల్లి శ్రీనివాస్, సోమేశ్వర్రావు, పీఏసీఎస్ చైర్మన్ హరిప్రసాద్రావు, కుర్ర శ్రీనివాస్, కాంట్రాక్ట్ ఉద్యోగులు సతీశ్, కక్కర్ల రాము, పెద్దూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
గిరక తాటిచెట్టు ఎక్కి కల్లు తీసిన మంత్రి
పాలకుర్తి మండలం మల్లంపల్లిలో మూడేండ్ల కింద తాను పంపిణీ చేసిన గిరక తాటి చెట్టుకు కల్లు పారుతున్న సంగతి తెలుసుకున్న మంత్రి స్వయంగా నిచ్చెన వేసుకొని చెట్టు ఎక్కి కల్లు తీసుకొని తాగారు. గిరిక తాటి కల్లులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, దానిని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిదన్నారు.