
- ఉద్యోగాలు కల్పించేందుకు నియోజకవర్గాల వారీగా చర్యలు
- ఇప్పటికే వరంగల్ వెస్ట్, పరకాలలో కంప్లీట్
- నేడు వరంగల్ ఈస్ట్ లో నిర్వహణ
- 26 న భూపాలపల్లిలో ఏర్పాటు
హనుమకొండ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం 'ప్లేస్ మెంట్స్ ఫర్ లోకల్ యూత్' పేరుతో ప్రైవేటు రంగంలోని ఉద్యోగాలను నిరుద్యోగులకు చేరువ చేస్తోంది. తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్అండ్నాలెడ్జ్(టాస్క్) ఆధ్వర్యంలో సెవెన్త్, టెన్త్, ఇంటర్, ఐటీఐ వివిధ కోర్సులు చేసిన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపట్టింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎక్కడికక్కడ మెగా జాబ్మేళాలు నిర్వహిస్తున్నారు. పదుల సంఖ్యలో కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగుల ఉపాధికి బాటలు వేస్తున్నారు. ఇప్పటికే హనుమకొండ జిల్లాలోని వరంగల్ వెస్ట్, పరకాల నియోజకవర్గాల్లో వందలాది మందికి ఉద్యోగావకాశాలు కల్పించగా.. మిగతా నియోజకవర్గాల్లో కూడా మెగా జాబ్మేళాలు నిర్వహించేందుకు అక్కడి లీడర్లు కసరత్తు చేస్తున్నారు.
రెండు చోట్లా.. వెయ్యి మందికిపైగా..
రాష్ట్రంలో 25 లక్షల మందికిపైగా నిరుద్యోగులు ఉండగా.. గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ నోటిఫికేషన్లు రిలీజ్ చేయక చాలామంది తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వయసు దాటి పోతుండటంతో కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం యువతకు ఉద్యోగాల కల్పనపై దృష్టి పెట్టింది. టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్ వన్, టూ, త్రీ, ఫోర్, తదితర నోటిఫికేషన్లు రిలీజ్ చేసి, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేపట్టింది. అందులోనూ ఉద్యోగావకాశం దక్కని స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచడంపై ప్రభుత్వం దృష్టి పెట్టి టాస్క్ ఆధ్వర్యంలో వివిధ కంపెనీల సౌజన్యంతో జాబ్ మేళాలు నిర్వహిస్తోంది.
దీనిని సద్వినియోగం చేసుకుంటూ ఓరుగల్లు జిల్లా లీడర్లు స్థానిక యువతకు ఉపాధి కల్పనపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి గతేడాది ఫిబ్రవరిలో ఓసారి, ఈ ఏడాది మార్చి 23న మరోసారి హనుమకొండలో జాబ్ మేళా నిర్వహించారు. మొత్తంగా 500 మందికిపైగా ఉద్యోగావకాశాలు కల్పించారు. ఈ నెల 4న పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మెగా జాబ్ మేళా నిర్వహించారు. 52కుపైగా కంపెనీల్లో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఈ మెగా జాబ్ మేళాలో 500 మందికి పైగా ఉద్యోగావకాశాలు దక్కగా.. మరో 1400 మందిని వివిధ కంపెనీలు షార్ట్ లిస్ట్ చేశాయి. కంపెనీల అవసరాన్ని బట్టి వారికీ విడతలవారీగా ఉద్యోగాలు కల్పించనున్నాయి.
నేడు వరంగల్ ఈస్ట్.. 26న భూపాలపల్లి
టాస్క్ ఆధ్వర్యంలో 'ప్లేస్ మెంట్స్ ఫర్ లోకల్ యూత్'లో భాగంగా మంత్రి కొండా సురేఖ, తన సొంత నియోజకవర్గం వరంగల్ ఈస్ట్ లో ఈ నెల 11న (శుక్రవారం) మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈ మెగా జాబ్ మేళాలో జెన్ ప్యాక్ట్, భారత్ బయోటెక్, హెచ్డీబీ, పేటీఎం, జీఎంఆర్, జస్ట్ డయల్, అపోలో ఫార్మసీ, ఎల్ అండ్ టీ ఫైనాన్స్, ఐడీబీఐ బ్యాంక్ తదితర 50కిపైగా పేరుమోసిన కంపెనీలు పాల్గొననున్నాయి.
వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాలులో ఉదయం 9.30 గంటలకు మెగా జాబ్ మేళాను ప్రారంభించనుండగా.. ఈ మేరకు ఆఫీసర్లు ఏర్పాట్లు పూర్తి చేశారు. దీని తర్వాత భూపాలపల్లి నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మెగా జాబ్ మేళా నిర్వహణకు ప్లాన్ చేశారు. ఈ నెల 26న మెగా జాబ్ మేళా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు నిరుద్యోగ యువత ఈ మెగా జాబ్ మేళాలను సద్వినియోగం చేసుకోవాలని సూచిస్తున్నారు.
తొందర్లోనే మిగతా నియోజకవర్గాల్లో..
మెగా జాబ్ మేళాలో వివిధ రంగాలకు సంబంధించిన బడా కంపెనీలు పాల్గొంటున్నాయి. టెన్త్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ, పీజీ.. ఇలా వివిధ కోర్సులు పూర్తి చేసిన వారికి వందల సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. దీంతో స్కూల్ స్టడీస్ తో చదువులు ఆపేసిన వాళ్లు కూడా జాబ్ మేళాకు బారులు తీరుతున్నారు. కాగా నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి దొరుకుతుండటం, యూత్ కు మరింత చేరువయ్యేందుకు అవకాశం కూడా ఉండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు కూడా మెగా జాబ్ మేళాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారు. మే నెలాఖరు వరకు అన్ని నియోజకవర్గాల్లో పూర్తి చేసేలా కసరత్తు చేస్తున్నారు. దీంతో నిరుద్యోగ యువతీ, యువకుల్లో హర్షం వ్యక్తమవుతోంది.