
- రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ త్వరగా పూర్తి చేయండి
- రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లు మంజూరు చేయండి
- ట్రిపుల్ ఆర్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ లైన్ ఇవ్వండి
- కరీంనగర్–తిరుపతి రైలు ప్రతి రోజు నడపండి
- రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్కు మంత్రులు, ఎంపీల వినతి
హైదరాబాద్, వెలుగు: కాజీపేట డివిజన్ ను ప్రకటించడంతోపాటు రాష్ట్రానికి కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఎంపీలు చామల కిరణ్ కుమార్ రెడ్డి, కడియం కావ్య కోరారు. శనివారం రాష్ట్ర పర్యటనకు వచ్చిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో మంత్రులు ఎంపీలు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పెండింగ్ సమస్యలు, ప్రాజెక్టులు, నిధుల వివరాలను రైల్వే మంత్రికి వివరించారు. అనంతరం ఎయిర్ పోర్ట్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు రైల్వే మంత్రిని కలిసి కొత్త రైల్వే లైన్లు, కాజీపేట డివిజన్ డిమాండ్ తో పాటు కాజీపేటలో కొనసాగుతున్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు వేగంగా పూర్తి చేసి ప్రారంభించాలని కోరామని తెలిపారు.
ప్రయాణికులకు, గూడ్స్ కు సమర్థవంతమైన రైల్వే నెట్ వర్క్ ఆపరేషన్స్, మెయింటెనెన్స్ చేసేందుకు కాజీపేటలో కొత్త రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. అలాగే కాజీపేట ను డివిజన్గా చేస్తే గుంటూరు, హైదరాబాద్ డివిజన్ల కంటే ఎక్కువ ఆదాయం ఆర్జిస్తుందని వివరించామన్నారు. వరంగల్ చుట్టూ నిర్మిస్తున్న రింగ్ రోడ్డు చుట్టు రింగ్ రైల్ ను నిర్మిస్తామని రైల్వే మంత్రి హామీ ఇచ్చారని మంత్రి వెల్లడించారు. వికారాబాద్–-కృష్ణ లైన్ దక్షిణ తెలంగాణలో వెనకబడిన పరిగి, కొడంగల్, టేకల్ కోడే, నారాయణ్పేట, మక్తల్ వంటి పట్టణాలను కలుపుతుందని పేర్కొన్నారు. దీన్ని ప్రధానమంత్రి గతిశక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ లో భాగంగా నిర్మించాలని కోరినట్టు చెప్పారు. గద్వాల్– డోర్నకల్ రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వేపై స్థానికుల అభిప్రాయాలను కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు.
మంత్రుల వినతులు
తిరుపతి--కరీంనగర్ (12761)(బుధ,శని) రైలు, కరీంనగర్-తిరుపతి (12762) (ఆది , గురు) రైలును ప్రతి రోజు నడపాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ లేఖలో కోరారు. ఇదే విషయంపై కరీంనగర్బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా గతంలో మీకు విజ్ఞప్తి చేశారని అందులో పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో హైదరాబాద్ తరువాత వరంగల్ పెద్ద నగరమని, ఇటీవల మామునూరు ఎయిర్ పోర్ట్ వచ్చిందని, కాజీపేట డివిజన్ కూడా ఏర్పాటు చేయాలని రైల్వే మంత్రిని కోరారు. డోర్నకల్–భద్రాచలం రైల్వే లైన్ ఉందని కానీ బ్రిడ్జి పూర్తి కాలేదని ఆ పనిని త్వరతగతిన పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి తుమ్మల మాట్లాడుతూ పాండురంగాపురం–మల్కాన్ గిరి రైల్వే లైన్ ను సారపాక (భద్రాచలం) వరకు వెంటనే పూర్తి చేయాలని లేఖ ద్వారా రైల్వే మంత్రిని అభ్యర్థించారు. సత్తుపల్లి–కొవ్వూరు, పెనుబల్లి –కొండపల్లి వరకు కొత్త రైల్వే లైన్లు మంజూరు చేయాలని అందులో పేర్కొన్నారు. దక్షిణ భారతదేశానికి ముఖ్య కూడలిగా ఉన్న కాజీపేట జంక్షన్కు రైల్వే డివిజన్ గా అప్గ్రేడ్ చేయాలని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను వరంగల్ ఎంపీ కడియం కావ్య కోరారు. కాజీపేట డివిజన్ అప్ గ్రేడ్ పై త్వరలో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీలో కేంద్ర మంత్రిని మరోసారి కలుస్తామని ఎంపీ తెలిపారు.
రీజనల్ రింగ్ రైల్ తో భారీగా ఉపాధి అవకాశాలు
తెలంగాణలో సెమీఅర్బన్ బెల్ట్ ను ఏర్పాటు చేయడానికి 370 కి.మీ. పొడవైన రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ ఆర్) నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్నదని.. ఈ ట్రిపుల్ఆర్ చుట్టూ రీజినల్ రింగ్ రైల్ ను నిర్మిస్తే.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య సామాజిక అనుసంధానం, ఆర్థిక తోడ్పాటును పెంచుతుందని రైల్వే మంత్రికి వివరించామన్నారు. దీంతో భారీగా ఉపాధి అవకాశాలను పెరిగి గ్రామీణ పేదరికం తగ్గుతుందని, పారిశ్రామిక వృద్ధికి మార్గం సుగమం అవుతుందని చెప్పినట్టు ఆయన తెలిపారు.