
- మెడికల్ కాలేజీ కోసం స్థలాన్ని పరిశీలిస్తున్నం
- రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, వెలుగు : హుస్నాబాద్లో కేంద్రీయ విద్యాలయాన్ని ఏర్పాటు చేయిస్తానని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించినట్టు చెప్పారు.
మంగళవారం ఆయన మున్సిపల్ పాలకవర్గం, అధికారులతో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అభివృద్ధి కోసం రాజకీయాలకతీతంగా కలిసిరావాలని ప్రజాప్రతినిధులను కోరారు. ఎన్నికల వరకే రాజకీయాలని, తరువాత ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. కరీంనగర్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాల కూడలిలో హుస్నాబాద్ ఉందని, ఇక్కడ మెడికల్ కాలేజీ అవసరముందని తమ నాయకురాలు ప్రియాంకగాంధీ గుర్తించి హామీ ఇచ్చారన్నారు.
ఆమె మాట ప్రకారం మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకోసం యాభై ఎకరాల స్థలాన్ని చూస్తున్నట్టు చెప్పారు. దీంతోపాటు ఇక్కడ కేంద్రీయ విద్యాలయాన్ని కూడా ఏర్పాటుచేసేందుకు ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్ను ఆదేశించామన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం వారాలు, ముహూర్తాలు చూసుకోనన్నారు. మున్సిపల్ పాలకవర్గం తన దృష్టికి తెచ్చిన రింగ్రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుతోపాటు హుస్నాబాద్ను ఏవిధంగా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు రూపొందించి ముందుకు తీసుకెళ్తానన్నారు.
డెవలప్మెంట్ విషయంలో తాను రాజీ పడబోనని, అవసరమైతే తమ ప్రభుత్వంతోనూ కొట్లాడతానని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు, ఇతర పనులు మినహా అన్ని రోజుల్లో తాను హుస్నాబాద్లోనే ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. అనంతరం మంత్రి హుస్నాబాద్లోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు. అంతకుముందు ఆయన మార్నింగ్ వాక్ చేస్తూ ప్రజలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.
అధికారులు ప్రజలతో మమేకమై పని చేయాలి
సిద్దిపేట రూరల్: అధికారులు ప్రజలతో మమేకమై పని చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. మంగళవారం ఆయన సిద్దిపేట కలెక్టరేట్లో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం మారిందని, ప్రజల్లో కూడా మార్పు వచ్చిందని, ప్రభుత్వ అధికారుల పనితీరు కూడా మారాలన్నారు. ఈ సందర్భంగా పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, శ్రీనివాస్ రెడ్డి, సీపీ. ఎన్. శ్వేత, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజ, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.