జమ్మూకాశ్మీర్​కు రాష్ట్ర హోదానే మా టాప్​ ప్రయారిటీ

జమ్మూకాశ్మీర్​కు రాష్ట్ర హోదానే మా టాప్​ ప్రయారిటీ

 

  • ఒమర్​ అబ్దుల్లా వెల్లడి
  • కేంద్రంతో కలిసి పనిచేస్తం

శ్రీనగర్: కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్మూకాశ్మీర్​కు రాష్ట్ర హోదాను రాబట్టుకోవడమే తమ టాప్​ ప్రయారిటీ అని నేషనల్​ కాన్ఫరెన్స్(ఎన్​సీ) పార్టీ వైస్​ప్రెసిడెంట్, కాబోయే సీఎం ఒమర్​ అబ్దుల్లా అన్నారు. జమ్మూకాశ్మీర్​ అసెంబ్లీలో ఇదే తమ తొలి తీర్మానంగా ఉంటుందని ఆయన ప్రకటించారు. మంగళవారం వెలువడిన జమ్మూకాశ్మీర్​ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్​సీ, కాంగ్రెస్​ కూటమి విజయం సాధించడంతో అక్కడ కూటమి ప్రభుత్వం కొలువుదీరనుంది. ఒమర్​ అబ్దుల్లానే సీఎం అని ఆయన తండ్రి, ఎన్సీ చీఫ్​ ఫరూఖ్​ అబ్దుల్లా ఇప్పటికే  ప్రకటించారు.  ఈ క్రమంలో బుధవారం ఒమర్​ మీడియాతో మాట్లాడుతూ తమ టాప్​ ప్రయారిటీ రాష్ట్ర హోదా సాధించడమేనని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దును వెనక్కి తీసుకోవాలన్న డిమాండ్​ విషయంలో వెనక్కి తగ్గబోమని  చెప్పారు.  కేంద్రంలో ఉన్న బీజేపీ.. ఆర్టికల్ 370ని పునరుద్ధరిస్తుందని భావించడంలేదని,  కేంద్రంలో ప్రభుత్వం మారితే తప్ప పునరుద్ధరణ జరగదని ఆయన అన్నారు.  

కేంద్రంతో సత్సంబంధాలే

ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా, ఏ కేంద్ర పాలిత ప్రాంతమైనా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాల్సిందేనని, తాము కూడా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఒమర్​ అబ్దుల్లా చెప్పారు. అట్లని బీజేపీతో మాత్రం ఎలాంటి సంబంధాలు ఉండవని అన్నారు. ‘‘ప్రధానమంత్రి దేశానికి గౌరవనీయులు. ప్రధాని హోదాలో ఇచ్చిన మాటకు కట్టుబడి మోదీ.. జమ్మూకాశ్మీర్​కు రాష్ట్ర హోదా ఇవ్వాలి. దీనికోసం మా పోరాటం కొనసాగుతుంది” అని ఆయన స్పష్టం చేశారు. 

ఓటమిపై కాంగ్రెస్​ రివ్యూ చేస్కోవాలి

జమ్మూకాశ్మీర్​లో తమతో కలిసి కూటమిగా పోటీ చేసిన కాంగ్రెస్​ పార్టీ.. హర్యానాతోపాటు జమ్మూకాశ్మీర్​ఎన్నికల ఫలితాలను క్షుణ్ణంగా సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని ఒమర్​ అబ్దుల్లా అన్నారు. సర్వేలన్నీ చెప్పిన తర్వాత కూడా ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందో ఆ పార్టీ చర్చించుకోవాలని, లోపాలు గుర్తించాలన్నారు.