
- స్కిల్ యూనివర్సిటీలో స్కిల్లింగ్ కోర్సు
- అర్హత పరీక్ష నిర్వహించిన వర్సిటీ
హైదరాబాద్, వెలుగు: బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) రంగంలో వచ్చే మూడేండ్లలో 30 వేల మంది బీటెక్ గ్రాడ్యుయేట్లకు ఉపాధి కల్పించేందుకు ఐటీ, పరిశ్రమల శాఖ ప్రణాళికలు రచిస్తున్నది. ఏటా 10 వేల మంది చొప్పున అభ్యర్థులకు ఈ రంగంలో శిక్షణ ఇచ్చి నైపుణ్యాలను పెంపొందించనున్నారు. అందులో 5 వేల మంది ఇంజినీరింగ్, మరో 5 వేల మంది డిగ్రీ అభ్యర్థులకు ట్రైనింగ్ ఇస్తారు.
అందుకు అనుగుణంగా బీఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్ కోర్సు ప్రారంభించనుంది. ఆదివారం ఆ కోర్సుకు సంబంధించి అర్హత పరీక్ష నిర్వహించారు. అర్హత సాధించిన అభ్యర్థులను ఎంపిక చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నాలుగు నెలల పాటు ట్రైనింగ్ ఇవ్వనున్నారు. ట్రైనింగ్ అనంతరం బీఎఫ్ఎస్ఐ రంగంలోని గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లలో (జీసీసీ) ప్లేస్మెంట్లు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నారు.
కాగా, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులను తెలంగాణ యువతకు అందుబాటులోకి తెచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రణాళిక తయారు చేస్తున్నారు. అందులో భాగంగానే బీఎఫ్ఎస్ఐ రంగంలోనూ నైపుణ్యం ఉన్న యువతను అందించేందుకు స్కిల్ యూనివర్సిటీలో ఈ కోర్సును ప్రారంభించారు. బీఎఫ్ఎస్ఐ రంగంలో అనుభవమున్న అమెరికా, సింగపూర్తో పాటు దేశీయ నిపుణులు, జీసీసీ సంస్థలతో సంప్రదింపులు జరిపారు.
అందులో భాగంగానే నిరుడు సెప్టెంబరులో బీఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్ కోర్సును ప్రారంభించి రెండు బ్యాచ్లకు ట్రైనింగ్ పూర్తిచేశారు. తాజాగా మూడో బ్యాచ్కు పరీక్ష నిర్వహించారు. ఈ కోర్సు నిర్వహణకు అయ్యే ఖర్చును ఎక్విప్ , బీఎఫ్ఎస్ఐ కన్సార్టియంలు భరించనున్నాయి.