నదుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నం.. ఇరిగేషన్​ శాఖ పవర్ పాయింట్​ ప్రజంటేషన్​

నదుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నం.. ఇరిగేషన్​ శాఖ పవర్ పాయింట్​ ప్రజంటేషన్​
  • మంజీరా, మూసీని గోదావరి నీటితో పునరుద్ధరిస్తున్నం
  • పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ 
  • భేటీలో ఇరిగేషన్​ శాఖ పవర్ పాయింట్​ ప్రజంటేషన్​

హైదరాబాద్, వెలుగు: నదుల సంరక్షణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని ఇరిగేషన్​ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో భూగర్భ జలాలను రీచార్జ్​  చేసేందుకు పలు చర్యలు తీసుకున్నామని, 5 నుంచి 6 మీటర్ల లోతులోనే నీటి లభ్యత ఉందని చెప్పింది. ‘రాష్ట్రంలో జీవం కోల్పోతున్న నదుల పునరుద్ధరణ’ అనే అంశంపై శనివారం హైదరాబాద్ లోని ఓ హోటల్​లో రాజ్యసభ పార్లమెంటరీ స్టాండింగ్​ కమిటీ సమావేశం నిర్వహించింది. 

ఈ సమావేశానికి ఇరిగేషన్​ శాఖతో పాటు మైనింగ్, సింగరేణి, పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డు అధికారులు హాజరయ్యారు. ఇరిగేషన్​ సెక్రటరీ రాహుల్​ బొజ్జా రాష్ట్రంలో నీటి సంరక్షణ కోసం తీసుకుంటున్న చర్యలపై పవర్​ పాయింట్​ ప్రజంటేషన్​ ఇచ్చారు. మంజీరా నదిని పునరుద్ధరించేందుకు మల్లన్నసాగర్​ నుంచి హల్ది వాగు ద్వారా నీటిని తరలిస్తున్నామని పేర్కొన్నారు. ఆ నది చుట్టుపక్కల పర్యావరణాన్ని కాపాడేందుకు చెట్లు నాటే కార్యక్రమం చేపట్టామని, పరివాహక ప్రాంతాన్ని స్థిరీకరిస్తున్నామని తెలిపారు. 

మూసీనది శుద్ధిలో భాగంగా ఉస్మాన్​సాగర్​, హిమాయత్​ సాగర్ కు మల్లన్న సాగర్​ నుంచి 5 టీఎంసీల నీటిని తీసుకెళ్లి మూసీలో గోదావరి నీళ్లు పారేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. అంతేకాకుండా మూసీకి ఇరువైపులా సుందరీకరణ పనులను చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. గోదావరి నీటిని సమర్థంగా వినియోగించుకునేందుకు నీటిని ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్​ చేసి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ ​ రిజర్వాయర్లకు తరలిస్తున్నామని వివరించారు. కడెం పూడికతీతపైనా ఫోకస్​ పెట్టామన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాన్ని స్థిరీకరిస్తున్నామని తెలిపారు. ఎల్లంపల్లి నుంచి మిడ్​మానేరు, లోయర్​ మానేరుకు లిఫ్ట్​ చేస్తున్నామన్నారు. మిడ్​మానేరు, లోయర్​ మానేరుల్లో పూడికతీత పనులను చేపట్టామని తెలిపారు.