ఖమ్మం, వెలుగు : జిల్లాలో టూరిజాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ తెలిపారు. శనివారం జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మంలో అటవీ డివిజన్ ఆఫీస్ను ఏర్పాటు చేసి వందేళ్లు అయిన సందర్భంగా వివిధ కార్యక్రమాలను ప్లాన్ చేశామని వివరించారు.
జిల్లాలోని 22 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 7 వేల మంది విద్యార్థులకు అర్బన్ పార్కులతో పాటు పులిగుండాల ప్రాజెక్టు దగ్గర అటవీ జీవ జాతులను ప్రత్యక్షంగా చూపిస్తామన్నారు. ఈ సందర్భంగా సుమారు 30 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న కనకగిరి కొండల్లో ఉన్న పక్షిజాతులు, జంతువులు, మొక్కలు, పలు రకాల చెట్ల గురించి హైదరాబాద్ నుంచి వచ్చిన 8 మంది టీమ్ ఆధ్వర్యంలో సర్వే జరుగుతోందని చెప్పారు.
త్వరలోనే శని, ఆదివారాల్లో కనకగిరి కొండల్లో టూరిస్టులకు క్యాంపింగ్ ఏర్పాటు చేసుకునే అనుమతి ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఇక అటవీ చట్టాల గురించి కూడా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. వన్ యాప్ ద్వారా అటవీ శాఖ సిబ్బంది పనితీరును కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే పర్యవేక్షించేలా టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని చెప్పారు.
ఇక సోలార్ సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి అడవుల్లోకి వెళ్తున్న వారిపై నిఘాపెట్టామన్నారు. శాటిలైట్ ద్వారా నిఘా ఏర్పాటు చేయడం ద్వారా ఎక్కడైనా ఫారెస్ట్ ఫైర్ జరిగితే వెంటనే అటవీశాఖకు అలర్ట్ వచ్చే విధంగా టెక్నాలజీని వాడుతున్నామని వివరించారు. సమావేశంలో ఎఫ్డీవో మంజుల, కృష్ణారావు, ఎఫ్ఆర్వోలు నాగేశ్వరరావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.