
ప్రతిష్టాత్మక ఒలింపిక్స్లో క్రికెట్ రీఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. 2028లో లాస్ ఏంజెల్స్ వేదికగా జరిగే ఒలింపిక్స్లో క్రికెట్ అధికారికంగా చేరింది. టీ20 ఫార్మాట్ లో జరగనున్న 2028 ఒలింపిక్స్ లో టోర్నమెంట్ లో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయని బుధవారం (ఏప్రిల్ 9) ధృవీకరించబడింది. మెన్స్ తో పాటు ఉమెన్స్ లో ఆరు జట్లే ఈ టోర్నీలో పాల్గొంటాయని స్పష్టం చేసింది. 128 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న క్రికెట్ లో ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా చైనా గోల్డ్ మెడల్ సాధిస్తుందని చెప్పి బిగ్ షాక్ ఇచ్చాడు. ఇప్పటికే చైనా తమ ప్రణాళికలు ప్రారంభించిందని ఈ మాజీ ఆసీస్ కెప్టెన్ చెప్పుకొచ్చాడు.
"ఒలింపిక్స్లో క్రికెట్ను చేర్చినట్లు ప్రకటించిన వెంటనే, చైనా ఒక జట్టును నిర్మించడం ప్రారంభించింది. వారు గోల్డ్ మెడల్ గెలవడంపై తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. టీ20 క్రికెట్ కు చాలా పెద్ద ఆదరణ ఉంది. రోజు రోజుకీ క్రేజ్ ఎక్కువవుతుంది. టెస్ట్ క్రికెట్ ప్రమాదంలో పడినా.. టీ20 ఫార్మాట్ క్రికెట్ లో ఆధిపత్యం చూపిస్తుంది. త్వరలో ప్లేయర్స్ ఫ్రాంచైజీ క్రికెట్ తో ఒప్పందం కుదుర్చుకుంటారు. టెస్ట్ క్రికెట్ ఆడేందుకు ఎవరూ ఆసక్తి చూపించరు. ప్రతి ఒక్కరూ వన్డే క్రికెట్ అంతరించిపోతుందని అనుకుంటారు. కానీ వరల్డ్ కప్ వస్తే క్రేజ్ అమాంతం పెరిగిపోతుంది. ముందు ముందు టీ20 ఫార్మాట్ వచ్చినా వన్డే వరల్డ్ కప్ అన్నిటికంటే ముఖ్యమైనది". అని స్టీవ్ వా అన్నారు.
ఒలింపిక్స్లో క్రికెట్ ఇదే తొలిసారి కాదు. 1900లో పారిస్లో జరిగిన ఒలింపిక్స్లో క్రికెట్ను ఆడించారు. ఇందులో ఇంగ్లండ్, ఫ్రాన్స్ రెండే టీమ్స్ బరిలోకి దిగగా.. ఇరు జట్ల మధ్య ఒకే మ్యాచ్ జరిగింది. చెరో 12 మంది క్రికెటర్లతో ఇరు జట్లు రెండ్రోజుల మ్యాచ్లో పోటీ పడ్డాయి. ఇంగ్లండ్ నెగ్గిన ఈ గేమ్ను కనీసం 20 మంది కూడా చూడలేదు. అయితే, 128 ఏండ్ల తర్వాత రీఎంట్రీ ఇస్తున్న ఈ ఆట గత దశాబ్దంలో చాలా పాపులర్ అయింది. 2028 ఒలింపిక్స్లో సూపర్ హిట్ అయ్యే చాన్సుంది.