
- ఐదో రోజూ లాభాలే !
- 557 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- నిఫ్టీ 159 పాయింట్లు జామ్
న్యూఢిల్లీ: ఎఫ్ఐఐల కొనుగోళ్లు, బ్యాంక్ స్టాక్స్లో ర్యాలీ కారణంగా శుక్రవారం బెంచ్మార్క్ ఇండెక్స్లు దూసుకెళ్లాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 557.45 పాయింట్ల లాభంతో 76,905 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 698.88 పాయింట్ల వరకు పెరిగింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 159.75 పాయింట్లు లాభపడి 23,350.40 వద్ద ముగిసింది. గత ఐదు సెషన్లలో ఇన్వెస్టర్ల సంపద రూ.22.12 లక్షల కోట్లు పెరిగింది. యూఎస్ ఫెడ్ మరో రెండుసార్లు రేట్లకు కోత పెడుతుందనే అంచనాలు ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపాయని ఎనలిస్టులు తెలిపారు.
సెన్సెక్స్ ప్యాక్ నుంచి ఎన్టీపీసీ, బజాజ్ ఫైనాన్స్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, నెస్లే, లార్సెన్ అండ్ టూబ్రో, టాటా మోటార్స్, ఐసీఐసీఐ బ్యాంక్, పవర్ గ్రిడ్, జొమాటో లాభపడ్డాయి. ఇన్ఫోసిస్, టాటా స్టీల్, మహీంద్రా అండ్ మహీంద్రా, టైటాన్, బజాజ్ ఫిన్సర్వ్ వెనకబడి ఉన్నాయి. ఎఫ్ఐఐలు గురువారం రూ.3,239.14 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు. బీఎస్ఈ సెక్టోరల్ ఇండెక్స్లలో కన్జూమర్ డ్యూరబుల్స్, మెటల్ మాత్రమే నష్టపోయాయి. ఆసియా మార్కెట్లో సియోల్ లాభాల్లో ముగిసింది. టోక్యో, షాంఘై, హాంగ్కాంగ్ నష్టపోయాయి. యూరప్ మార్కెట్లు నెగటివ్గా ట్రేడవుతున్నాయి. యూఎస్ మార్కెట్లు గురువారం నష్టపోయాయి.