- సెన్సెక్స్ 738.81 పాయింట్లు డౌన్
- నిఫ్టీ 269.95 పాయింట్లు తగ్గుదల
న్యూఢిల్లీ: రికార్డు స్థాయి ర్యాలీ తర్వాత మార్కెట్లు పతనమవడంతో శుక్రవారం ఇన్వెస్టర్ల సంపద రూ.7.94 లక్షల కోట్లు తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి నెగెటివ్ సంకేతాలు, ప్రాఫిట్ బుకింగ్ వల్ల 30-షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 738.81 పాయింట్లు దిగజారి 80,604.65 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 269.95 పాయింట్లు తగ్గి 24,530.90 వద్ద సెటిలయింది. గత నాలుగు రోజుల్లో, బీఎస్ఈ బెంచ్మార్క్ 1,446.12 పాయింట్లు ర్యాలీ చేసింది.
శుక్రవారం వరకు వరుసగా ఐదవ సెషన్లో బెంచ్మార్క్ జీవితకాల గరిష్ట స్థాయిలను తాకింది. సెన్సెక్స్ ప్యాక్లో టాటా స్టీల్ 5 శాతానికి పైగా పతనం కాగా, జేఎస్డబ్ల్యూ స్టీల్ 4 శాతానికి పైగా పడిపోయింది. ఎన్టీపీసీ, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్, టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్, మహీంద్రా అండ్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వెనకబడి ఉన్నాయి. జూన్ క్వార్టర్లో ఇన్ఫోసిస్ కన్సాలిడేటెడ్ నికర లాభం 7 శాతం పెరిగి రూ. 6,368 కోట్లకు చేరుకోవడంతో షేరు దాదాపు 2 శాతం ఎగబాకింది.
ఐటీసీ, ఏషియన్ పెయింట్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్ లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ గేజ్ 2.31 శాతం పడిపోయింది. అన్ని సూచీలూ నష్టాల్లో ముగిశాయి. మైక్రోసాఫ్ట్ యూజర్లు ప్రపంచ వ్యాప్తంగా శుక్రవారం సేవలలో భారీ అంతరాయాలు కలిగినట్టు ఫిర్యాదు చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక ఎయిర్లైన్లు, బ్యాంకులు, మీడియా ఔట్లెట్లు ఇబ్బందిపడ్డాయి. అయితే ఈ టెక్నికల్ ప్రాబ్లమ్ ప్రభావం తమపై లేదని దేశంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజీలు ఎన్ఎస్ఈ, బీఎస్ఈలు తెలిపాయి.
ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో, హాంకాంగ్ నష్టాల్లో, షాంఘై లాభాల్లో ముగిశాయి. యూరప్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. గురువారం అమెరికా మార్కెట్లు ప్రతికూలంగా ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్కు 0.07 శాతం క్షీణించి 85.05 డాలర్లకు చేరుకుంది. ఎఫ్ఐఐలు గురువారం రూ. 5,483.63 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు.