
హైదరాబాద్, వెలుగు: గ్రూప్- 1 నియామకాలపై తుది నిర్ణయం వెలువరించొద్దంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను సస్పెండ్ చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) అప్పీలు దాఖలు చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయడం ద్వారా నియామకాలను పూర్తిచేసేందుకు అవకాశం ఇవ్వాలంది. గ్రూప్-1 పరీక్షల వాల్యుయేషన్లో అవకతవకలు జరిగాయంటూ ఎం.పరమేశ్ మరో 20 మంది దాఖలు చేసిన పిటిషన్పై విచారించిన సింగిల్ జడ్జి తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా నియామకాలను ఖరారు చేయరాదంటూ ఈ నెల 17న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాలు చేస్తూ టీజీపీఎస్సీ తరఫున అదనపు కార్యదర్శి, నోడల్ అధికారి ఆర్.సుమతి అప్పీలు దాఖలు చేశారు. అప్పీలులో అభ్యర్థులకు ఎవరికీ ఏ ఇబ్బంది లేకుండా కమిషన్ అన్ని జాగ్రత్తలు తీసుకుందని వివరించారు. పరీక్ష కేంద్రాలు గుర్తించడానికి, తనిఖీలు నిర్వహించడానికి కమిషన్కు సిబ్బంది లేకపోవడంతో ఈ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించామన్నారు. జిల్లా అధికారుల సిఫారసుల మేరకే ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్ష కేంద్రాల నిర్ణయం జరుగుతుందని అప్పీలులో పేర్కొన్నారు.
మెయిన్స్ పరీక్షలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో (మూడు కమిషనరేట్ల పరిధిలో) జరిగాయని, మొదట 45 సెంటర్లను గుర్తించామన్నారు. సీవీఆర్ కాలేజీలో మొదట 984 మంది అభ్యర్థులను ప్రతిపాదించామని, మహిళా విశ్వవిద్యాలయం పరీక్ష కేంద్రంలో గ్రౌండ్ ఫ్లోర్ ఎత్తు ఎక్కువగా ఉండటంతో దివ్యాంగులు మెట్లు ఎక్కడం కష్టమని భావించి.. విశ్వ విద్యాలయం నుంచి 87 మందిని సీవీఆర్ కాలేజీకి కేటాయించామని తెలిపారు. అదేవిధంగా సెయింట్ పీటర్స్ ఇంజనీరింగ్ కాలేజీలో 504 నుంచి 358 మందికి తగ్గిందని, 24 మంది సామర్థ్యం ఉన్న గదిలో దివ్యాంగులకు తోడుగా పరీక్ష రాయడానికి వస్తుంటారని, అందువల్ల గదికి ఆరుగురినే కేటాయించాల్సి ఉందని తెలిపారు.
అందువల్ల అభ్యర్థుల సర్దుబాటు, నిష్పత్తి, వికలాంగులు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని అదనంగా మరో కేంద్రాన్ని ఏర్పాటు చేశామని.. మొదట 45 సెంటర్లుగా పేర్కొన్నప్పటికీ 46 సెంటర్లను ఏర్పాటు చేశామని వివరించారు. పరీక్షకు హాజరైన సంఖ్యపై వివాదం లేవనెత్తుతున్నారని, సూపరింటెండెంట్ల సమాచారం మేరకు హాజరైన వారి సంఖ్య 21,075గా ప్రకటించామన్నారు. అనంతరం ఉపయోగించిన, ఉపయోగించని జవాబు పత్రాలు, ఓఎంఆర్, నామినల్ రోల్స్ అన్నీ సరి చూసుకుని వాస్తవ సంఖ్యగా 21,085 ప్రకటించామని తెలిపారు. రీకౌంటింగ్లో తేడా ఉందని 60 మార్కుల తగ్గాయని బి.పూజితారెడ్డి వినతిపత్రం సమర్పించగా పరిశీలిస్తే రీకౌంటింగ్కు ముందు, తర్వాత కూడా 422.4 మార్కులు వచ్చాయన్నారు.
ఆరోపణలు అవాస్తవం
కోఠి మహిళా కళాశాలలో పురుషులకు ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడంతో ఆ కేంద్రంలో మహిళలను మాత్రమే కేటాయించామని టీజీపీఎస్సీ తన అప్పీలులో తెలిపింది. కోఠి మహిళా కళాశాలలోని రెండు సెంటర్లలో ఎక్కువ మంది అర్హత సాధించారన్న ఆరోపణలు అవాస్తమని, 18వ సెంటర్లో 5.41 శాతం, 19లో 4.12 శాతం అర్హత సాధించారని, ఇదేమీ అసాధారణం కాదని తెలిపారు.
మూల్యాంకనం నిమిత్తం ప్రొఫెసర్లను సబ్జెక్టుల వారీగా ఎంపిక చేశామని చెప్పారు. ప్రభుత్వ కళాశాల్లో పని చేస్తున్న, చేసిన అనుభవం ఉన్న ప్రొఫెసర్లను మూల్యాంకనం నిమిత్తం ఎంపిక చేశామని, పారదర్శకంగా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మూల్యాంకనం చేసేవారి వివరాలను రహస్యంగా ఉంచుతామని, వారి పేర్లను వెల్లడిస్తే బెదిరింపులు ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఎలాంటి ఆధారాలు లేకుండా ఊహాజనిత ఆరోపణలపై పిటిషన్ దాఖలు చేశారని, ఇప్పటికే సర్టిఫికెట్ల ప్రక్రియ ముగిసిందని, సింగిల్ జడ్జి ఉత్తర్వులను సస్పెండ్ చేయడం ద్వారా నియామక ప్రక్రియను కొనసాగించడానికి అనుమతించాలని కోరారు. దీనిపై ఒకటి రెండు రోజుల్లో డివిజన్ బెంచ్ విచారణ చేపట్టనుంది.