తీరిగ్గా కుక్కల వేట : చిన్నారి ప్రాణం పోతేకానీ స్పందించరా..

తీరిగ్గా కుక్కల వేట : చిన్నారి ప్రాణం పోతేకానీ స్పందించరా..

బాలుడి మృతితో కళ్లు తెరిచారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ అధికారులు. చిన్నారి చనిపోయాక తీరిగ్గా కుక్కల వేట మొదలుపెట్టారు మున్సిపల్ సిబ్బంది. ఒక ప్రాణం పోతేగాని స్పందించారా అని జనాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాజీపేట్, హన్మకొండలో వీధి కుక్కల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కుక్కల కోసం మున్సిపల్ సిబ్బంది వేటాడుతోంది. కుక్కలను పట్టుకుని బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేస్తున్నారు. ఆపరేషన్ తర్వాత కుక్కలను సిటీకి దూరంగా వదిలేస్తున్నారు..

కాజీపేటలో మే 19వ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిదేళ్ల బాలుడిపై వీధి కుక్కలు మూకుమ్మడిగా దాడి చేశాయి. కుక్కల దాడిలో చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు. ఒంటి నిండా రక్తపుగాయాలతో పడి ఉండగా గమనించిన కుటుంబ సభ్యులు.. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ బాలుడు చనిపోయినట్లు డాక్టర్లు తెలిపారు. పోస్టుమార్టం కోసం బాలుడి మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. 

కుక్కల దాడిలో మరణించిన బాలుడి డెడ్ బాడీని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కుడా చైర్మన్ సుందర్ రాజ్ యాదవ్ లు పరిశీలించారు. బాధిత కుటుంబానికి మున్సిపల్ కార్పొరేషన్ నుంచి రూ.లక్ష పరిహారం ప్రకటించారు. ఒక్కో వాడలో 200 వరకు కుక్కలు ఉన్నయన్నారు చీఫ్ విప్ వినయ్ భాస్కర్. కుక్కలను చంపడం నేరం.. కానీ వాటి బర్త్ కంట్రోల్ చేస్తామని తెలిపారు. నగరంలో మరో ఏబీసీ సెంటర్ ఏర్పాటు చేస్తమన్నారు. కేర్ సెంటర్ ఏర్పాటు చేసి వాటికి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు వినయ్ భాస్కర్. కుక్కల దాడుల నివారణ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక టీమ్ ను రప్పిస్తామని స్పష్టం చేశారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని వినయ్ భాస్కర్ హామీ ఇచ్చారు.

ఇదిలా ఉంటే.. కుక్కల దాడిపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. చిన్నారులపై కుక్కలు దాడులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటు ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు కొండేటి శ్రీధర్ బాలుడి డెడ్ బాడీని పరిశీలించారు. కుక్కల నియంత్రణలో పాలకులు విఫలమయ్యారని ఫైర్ అయ్యారు. ఈ మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు.