స్ట్రీమ్ ఎంగేజ్ : ఆ శిల్పం ఎవరిది?

స్ట్రీమ్ ఎంగేజ్ :   ఆ శిల్పం ఎవరిది?

ఆ శిల్పం ఎవరిది?

టైటిల్ : నెరు
డైరెక్షన్​ : జీతూ జోసెఫ్‌‌
కాస్ట్ : మోహన్‌‌లాల్‌‌, నందు, అనస్వర రాజన్‌‌, దినేష్‌‌ ప్రభాకర్‌‌, ప్రియమణి, కృష్ణ ప్రభ, సిద్ధిఖ్‌‌, జగదీష్‌‌, శంకర్‌‌ ఇందు చూడన్‌‌
లాంగ్వేజ్ : మలయాళం
ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్‌‌ హాట్‌‌స్టార్‌‌

కళ్లు లేని సారా మహ్మద్‌‌ (అనస్వర రాజన్‌‌)పై అత్యాచారం జరుగుతుంది. అతను ఎవరనేది తెలుసుకోవడానికి పోలీసులు ట్రై చేసినా ఫలితం ఉండదు. సారా శిల్పి కావడంతో ఆమెపై అత్యాచారం చేసిన వ్యక్తి శిల్పాన్ని తయారుచేస్తుంది. ఆ విగ్రహానికి దగ్గర పోలికలున్న మైఖేల్‌‌ జోసెఫ్‌‌ (శంకర్‌‌ ఇందుచూడన్‌‌) అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేస్తారు. అతడు ముంబయికి చెందిన పెద్ద బిజినెస్‌‌మ్యాన్‌‌ కొడుకు.

ఎన్నో పెద్ద పెద్ద కేసులను సాల్వ్‌‌ చేసిన లాయర్‌‌‌‌ రాజశేఖర్‌‌ (సిద్ధిఖ్‌‌)ని మైఖేల్‌‌ తండ్రి అపాయింట్‌‌ చేస్తాడు. దాంతో మైఖేల్‌‌కు బెయిల్‌‌ వస్తుంది. 
ఈ కేసును వాపసు  తీసుకుంటే డబ్బు ఇస్తామని మైఖేల్‌‌ కుటుంబం ఆఫర్ చేస్తుంది. కానీ.. సారా మాత్రం ‘‘నేను ఓడిపోయినా పర్వాలేదు. న్యాయం కోసం పోరాడతాను’’ అని చెప్తుంది. అప్పుడే లాయర్‌‌ విజయ్‌‌ మోహన్‌‌ (మోహన్‌‌లాల్‌‌) దగ్గరకు ఈ కేసు వస్తుంది. విజయ్‌‌ మోహన్‌‌ ఈ కేసు టేకప్‌‌ చేశాడా? ఇంతకీ సారాపై అత్యాచారం చేసింది ఎవరు? చివరికి దోషికి శిక్ష పడిందా? లేదా? తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

స్క్రీన్‌‌ప్లే హైలైట్‌‌ అని చెప్పొచ్చు. డైరెక్టర్‌‌‌‌ జీతూ జోసెఫ్‌‌  సినిమాలో సస్పెన్స్‌‌ని మెయింటెయిన్‌‌ చేయడంలో సక్సెస్‌‌ అయ్యాడు. .

బాంబ్‌‌ పెట్టింది ఎవరు?

టైటిల్ : ఇండియన్‌‌ పోలీస్‌‌ ఫోర్స్‌‌
డైరెక్షన్​ : రోహిత్ షెట్టి
కాస్ట్ : సిద్ధార్థ్‌‌ మల్హోత్ర, శిల్పా షెట్టి కుంద్రా, వివేక్‌‌ ఒబెరాయ్‌‌, ఇషా తల్వార్‌‌, విభూతి ఠాకూర్‌‌, నిఖితన్‌‌ ధీర్‌‌, శ్వేతా తివారి, శరద్‌‌ ఖేల్కర్‌‌
లాంగ్వేజ్ : హిందీ
ప్లాట్​ ఫాం : అమెజాన్‌‌ ప్రైమ్‌‌ వీడియో

ఢిల్లీ పోలీస్‌‌ రైజింగ్‌‌ డే రోజున సిటీలోని కొన్ని ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు జరుగుతాయి. ఆ పేలుళ్లలో 240 మంది చనిపోతారు. పేలుళ్లకు కారణం తామేనని ఇండియన్ ముజాహిదీన్‌‌ సంస్థ ప్రకటిస్తుంది. ఆ కేసును ఛేదించేందుకు ఢిల్లీ పోలీసు ఆఫీసర్లు సీపీ విక్రమ్‌‌ బక్షి (వివేక్‌‌ ఒబెరాయ్‌‌), డీసీపీ కబీర్‌‌ మాలిక్‌‌ (సిద్ధార్థ్‌‌ మల్హోత్ర), గుజరాత్‌‌ ఏటీసీ చీఫ్‌‌ తార (శిల్పా షెట్టి కుంద్రా) ట్రై చేస్తుంటారు. ఆ పేలుళ్లకు అసలు కారణం ఏంటి? బాంబులు ఎవరు పెట్టారు? పోలీసులు ఈ కేసును ఎలా ఛేదించారు? తెలియాలంటే సిరీస్‌‌ చూడాల్సిందే. 

డైరెక్టర్‌‌‌‌ రోహిత్‌‌ షెట్టి పోలీసు ఇన్వెస్టిగేషన్‌‌ సినిమాలు తీయడంలో ఎక్స్‌‌పర్ట్‌‌. అయినప్పటికీ ఈ సినిమాలో ఆయన స్ట్రాటజీలు పనిచేయలేదు. చిన్న కథను సాగదీసినట్టు అనిపిస్తుంది. కథ, కథనాల్లో కొత్తదనం లేదు. 

క్యాంపస్ లవ్ స్టోరీ

టైటిల్ : జో
డైరెక్షన్​ : హరిహరన్ రామ్
కాస్ట్ : రియో ​​రాజ్, మాళవిక మనోజ్, భవ్య త్రిఖా, చార్లే, శ్రీరామ్, ప్రవీణ
లాంగ్వేజ్ : తమిళం
ప్లాట్​ ఫాం : డిస్నీ ప్లస్ హాట్ స్టార్

కోయంబత్తూరులోని ఓ కాలేజీలో జో (రియో రాజ్‌‌‌‌) సివిల్‌‌ ఇంజనీరింగ్‌‌లో చేరతాడు. అదే కాలేజీలో కొత్తగా సుచిత్ర (మాళవిక మనోజ్)  చేరుతుంది. ఆ క్లాస్‌‌లో ఆమె మాత్రమే మలయాళీ. అందుకే ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవుతుంటుంది. అప్పుడే ఆమెకి జో పరిచయం అవుతాడు. అప్పటినుంచి ఆమెని ప్రేమిస్తుంటాడు. ఆమె ఏ కలర్‌‌‌‌ డ్రెస్‌‌ వేసుకొస్తే.. తను కూడా అదే కలర్ డ్రెస్‌‌ వేసుకొస్తాడు. ఆమెని కేరళకి చెందిన ఒక సీనియర్ వేధిస్తుంటాడు. ఆ విషయం తెలిసిన జో అతనికి బుద్ధి చెప్తాడు. దాంతో ఆమెకు మరింత దగ్గరవుతాడు. ఆ తర్వాత అది ప్రేమగా మారుతుంది. ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా ప్రేమించుకుంటారు.

కాలేజీలో చదువు పూర్తి కావడంతో మాస్టర్ డిగ్రీ పూర్తయ్యాక పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. కానీ సుచిత్రకి ఆమె పేరెంట్స్ వేరే వ్యక్తితో పెళ్లి చేయాలి అనుకుంటారు. దాంతో సుచిత్ర తండ్రితో మాట్లాడడానికి జో బయల్దేరతాడు. సీన్‌‌ కట్‌‌ చేస్తే.. శ్రుతి అనే అమ్మాయిని పెండ్లి చేసుకుంటాడు జో. ఈ మధ్యలో ఏం జరిగింది? అసలు సుచిత్రతో ఎందుకు విడిపోయాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.