ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో ఎస్ఆర్ ఇంజినీరింగ్ కాలేజీ గర్ల్స్ హాస్టల్లో హిడెన్ కెమెరాల ఇష్యూ పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. క్యాంపస్లోని గర్ల్స్ హాస్టల్ వాష్ రూమ్లో రహస్య కెమెరాలు పెట్టి తమ ప్రైవేట్ వీడియోలు రికార్డ్ చేశారని ఆరోపిస్తూ విద్యార్థినులు పెద్ద ఎత్తున రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. ఇదిలా ఉండగానే.. తాజాగా ఇలాంటి తరహా ఘటనే ఒకటి ఆంధ్రప్రదేశ్ పొరుగు రాష్ట్రం బెంగుళూరులో చోటు చేసుకుంది.
వివరాల ప్రకారం.. బెంగళూరు సమీపంలోని కుంబల్గోడు ఏసీఎస్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఓ స్టూడెంట్ యువతుల రహస్య వీడియోలు తీసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. నిందితుడు మొబైల్ ఫోన్లో తమ రహస్య వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నాడని విద్యార్థినులు ఇవాళ (సెప్టెంబర్ 21) కాలేజీలో ఆందోళనకు దిగారు. విద్యార్థినులకు మద్దతుగా పలు స్టూడెంట్ యూనియన్స్ సైతం కాలేజీ ఎదుట నిరసన చేపట్టడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
ALSO READ | ఆ 135 మంది స్టూడెంట్లకు నీట్ కౌన్సెలింగ్కు చాన్స్
సమాచారం అందుకున్న పోలీసులు కళాశాలకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కంప్యూటర్ సైన్స్ ఫోర్త్ ఇయర్ చదువుతోన్న ఓ విద్యార్థిని అదుపులోకి తీసుకుని.. అతడి మొబైల్ ఫోన్ సీజ్ చేశారు. నిందితుడు తన మొబైల్లో దాదాపు 7, 8 వీడియోలను రికార్డ్ చేశాడని, వాటిని తోటి విద్యార్థులు గుర్తించారని పోలీసులు వెల్లడించారు. వీడియోల విషయం బయట చెబితే చంపేస్తానని నిందితుడు బెదిరించినట్లు విద్యార్థులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.