
- రెండ్రోజుల వ్యవధిలో ఇద్దరు స్టూడెంట్స్ మృతి
నిర్మల్, వెలుగు: బాసర ట్రిపుల్ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యలు తోటి స్టూడెంట్స్ను బెంబేలెత్తిస్తున్నాయి. క్యాంపస్లో అసలేం జరుగుతుందో తెలియక విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా క్యాంపస్లో విద్యార్థులు ఒత్తిడికి గురి కాకుండా కౌన్సిలింగ్ చేయాలన్న ఎవరూ పట్టించుకోవడం లేదు. రెగ్యులర్ వైస్ఛాన్సలర్, టీచింగ్ ఫ్యాకల్టీ నియమాకాలతో పాటు ప్రధానమైన మెస్ కాంట్రాక్టర్ల మార్పు, హాస్టళ్లలో వసతుల కల్పన లాంటి హామీలు ఇప్పటికీ నెరవేరలేదు. మంత్రి కేటీఆర్తొమ్మిది నెలల క్రితం బాసర ట్రిపుల్ఐటీకి వచ్చి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. మొత్తం12 డిమాండ్లు విద్యార్థులు మంత్రి ముందు ఉంచగా అందులో ఇప్పటికీ రెండు, మూడు సమస్యలు మాత్రమే పరిష్కారమయ్యాయి.
వెంటాడుతున్న సమస్యలు...
ఏడాది నుంచి బాసర ట్రిపుల్ఐటీ సమస్యలతో సతమతమవుతూనే ఉంది. గవర్నర్తమిళిసైతో పాటు మంత్రులు, ఆఫీసర్లు వచ్చి సమస్యలు తీరుస్తామని హామీలిచ్చి నెలలు గడుస్తున్నా ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. ఆఫీసర్ల మధ్య సమన్వయ లోపం ట్రిపుల్ఐటీలో పరిపాలనకు శాపంగా మారుతోంది. గతేడాది నుంచి వరుసగా ఏదో ఒక సంఘటన జరగడం సాధారణమైపోయింది.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం లేదన్న అంశం పెద్ద ఉద్యమానికి కారణమైంది. ఇక్కడి మూడు మెస్ల నిర్వాహకులు తమకున్న రాజకీయ పలుకుబడితో విద్యార్థులకు నాణ్యత లేని భోజనం అందిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. నాణ్యత లేని భోజనం తిని వందలాది మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
మెస్ కాంట్రాక్టర్లను మార్చాలన్న డిమాండ్తో పాటు మొత్తం 12 డిమాండ్లను పరిష్కరించే వరకు ఉద్యమం ఆపేది లేదని విద్యార్థులు పట్టుబట్టారు. చివరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి క్యాంపస్కు వచ్చి విద్యార్థి సంఘాలతో చర్చలు జరిపారు. అప్పటి నుంచి తాత్కాలిక చర్యలతో నెట్టుకొస్తున్న ఆఫీసర్లు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. హాస్టల్లో కరెంటు సౌకర్యాన్ని కల్పించడమే కాకుండా పలు సంస్థలతో ఉద్యోగాల కల్పనకు ఎంఓయూలను చేసుకున్నారు. ఇప్పటి వరకు విద్యార్థులకు కౌన్సిలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. 300 మంది టీచింగ్ప్యాకల్టీని నియమించాల్సి ఉండగా.. 190 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. హాస్టల్లో కుక్కలుస్వైర విహారం చేస్తున్నప్పటికీ వాటిని నియంత్రించకలేకపోతున్నారు.
వరుస సంఘటనలతో ఆందోళన
ట్రిపుల్ఐటీలో చోటు చేసుకుంటున్న వరుస సంఘటనలు ఇటు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. క్యాంపస్లోని సిబ్బందిపై పర్యవేక్షణ, నియంత్రణ లేకపోవడంతో విద్యార్థుల ముందే వారు తరుచుగా గొడవలకు దిగుతున్నారు. వారం రోజుల క్రితం విద్యార్థుల స్టడీ మెటీరియల్ను సిబ్బంది బయట పడేయడం వివాదాస్పదమైంది. ఇప్పటి వరకు క్యాంపస్లో దాదాపు 20 మందికి విద్యార్థులు మరణించారు.
గత సంవత్సరం రాథోడ్ సురేశ్, భానుప్రసాద్ అనే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడగా.. ఈ ఏడాది పీయూసీ-1 విద్యార్థినీ వడ్ల దీపిక ఆత్మహత్య చేసుకుంది. రెండ్రోజుల వ్యవధిలో మరో విద్యార్థిని లిఖిత అనుమానాస్పదంగా మృతి చెందడం భయాందోళనకు గురి చేస్తోంది. క్యాంపస్ సిబ్బంది విద్యార్థులను హాజరుశాతం, పరీక్షల పేరిట భయపెడుతూ వేధింపులకు గురి చేస్తున్నారంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
మారని మెస్ కాంట్రాక్టులు..
విద్యార్థుల ఉద్యమానికి కారణమైన మెస్ కాంట్రాక్టుల మార్పు వ్యవహారం ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదు. ఇక్కడ కేంద్రీయ బండార్, ఎస్ఎస్క్యాంటీన్, శక్తి క్యాంటీన్లను వెంటనే మారుస్తామని అప్పట్లో మంత్రి కేటీఆర్తో పాటు మంత్రులు, ఆఫీసర్లందరూ హమీలిచ్చారు. దీనికి సంబంధించి కొత్త మెస్ కాంట్రాక్టర్ల నియామకానికి టెండర్లు కూడా పిలిచారు. అయితే ఈ టెండర్ల ప్రక్రియకు రాజకీయ ఒత్తిళ్లు అడ్డు తగిలాయన్న ఆరోపణలున్నాయి. ఇతర కాంట్రాక్టర్లు ఎవరూ కూడా ముందుకు రాలేదన్న సాకుతో స్వచ్ఛంద సంస్థలకు మెస్ నిర్వాహణ బాధ్యతలను అప్పజెప్పాలని ఆఫీసర్లు భావిస్తున్నారు.
ఏడాది నుంచి తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నా పాత కాంట్రాక్టర్లనే కొనసాగిస్తుండడం అనుమానాలకు తావిస్తోంది. ఈ మూడు మెస్ యాజమాన్యాల వెనక రాజకీయ అండ ఉందని విద్యార్థులకు నాణ్యత లేని భోజనం అందించినప్పటికీ వీరిపై ఫిర్యాదు చేసేందుకు వెనకాడుతున్నారన్న వాదనలు ఉన్నాయి. అధికారులు సైతం ఈ విషయంలో చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు.
ఐటీ మంత్రిగా హామీ ఇస్తున్నా..
'తాను ఐటీ మంత్రిగా చెబుతున్నా.. మీరు రాజకీయాలకు అతీతంగా జరిపిన పోరాటాన్ని అభినందిస్తున్నా.. స్టూడెంట్పవర్ ను కల్లారా చూశా.. మీ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తా.. చదువుపైనే దృష్టి పెట్టిండి. ప్రతీ ఆరు నెలలకోసారి నేనే స్వయంగా క్యాంపస్కు వచ్చి మీతో మాట్లాడుతా. గత ఏడాది సెప్టెంబర్ 26న మంత్రి కేటీఆర్ ట్రిపుల్ఐటీకి వచ్చి చెప్పిన మాటలివి. కానీ ఆయన మాట ఇచ్చి తొమ్మిది నెలలైనా ఇప్పటివరకు క్యాంపస్ మొహం కూడా చూడలేదు.